రాష్ట్రంలో స్థానిక ఎన్నికల నిర్వహణకు రంగం సిద్ధమవుతోంది. గ్రామ పంచాయతీలతో పాటు మున్సిపాలిటీల్లోనూ మరికొన్ని రోజుల్లోనే పదవీకాలం ముగియనుంది. ఈ నేపథ్యంలో ఎన్నికల నిర్వహణకు ఎన్నికల సంఘం కసరత్తు ప్రారంభించింది.
ముగియనున్న పదవీకాలం…

ఒకటి, రెండు నెలల్లో పదవీకాలం ముగియనున్న నేపథ్యంలో కొత్త ఓటర్ల జాబితాల రూపకల్పనపై ఈసీ ఫోకస్ పెట్టింది. ఇందుకోసం శనివారం వేర్వేరుగా నోటిఫికేషన్లను జారీ చేసింది. కొత్త ఓటర్ల జాబితా ప్రక్రియను వెంటనే చేపట్టాలని స్పష్టం చేసింది. వచ్చే నెల 9వ తేదీన ఓటర్ల ఫొటోలతో సహా తుది జాబితాలు ప్రచురించాలని అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలంసాహ్ని ఉత్తర్వులు ఇచ్చారు.
రాష్ట్రంలో 13,098 పంచాయతీల్లోని కొనసాగుతున్న పాలకమండలి పదవీ కాలం ఏప్రిల్ 2తో ముగుస్తుంది. అంటే మరో 2 నెలలు మాత్రమే గడువు ఉంది. కోర్టు కేసులతో 253 పంచాయతీల్లో అప్పట్లో ఎన్నికలు నిర్వహించలేదు. అయినప్పటికీ రాష్ట్రంలో ఉన్న మొత్తం 13,351 పంచాయతీల్లోనూ తాజాగా ఓటర్ల జాబితాలను సిద్ధం చేయనున్నారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యుల పదవీకాలం కూడా సెప్టెంబర్ లో ముగుస్తుంది.
ఇక పుర, నగరపాలక సంస్థలు, నగర పంచాయతీల్లో పాలకవర్గాల పదవీ కాలం మార్చి 17వ తేదీతో పూర్తవుతుంది. గతంలో 36 చోట్ల కోర్టు కేసులు, ఇతరత్రా కారణాలతో ఎన్నికలు నిర్వహించలేదు. ఇక్కడ ప్రత్యేకాధికారుల పాలనే కొనసాగుతోంది. ఇదిలా ఉన్నప్పటికీ రాష్ట్రంలో ఉన్న 123 పట్టణ స్థానిక సంస్థల్లోనూ డివిజన్లు, వార్డుల వారీగా ఓటర్ల జాబితాలు సిద్ధం చేస్తారు.
వార్డుల విభజన, ఓటర్ల నమోదు , అభ్యంతరాల స్వీకరణ వంటి ప్రక్రియలను మార్చి 9వ తేదీలోపు పూర్తి చేస్తారు. అసెంబ్లీ ఓటర్ల జాబితా ఆధారంగా వార్డుల వారీగా విభజన చేపట్టి…. ఎక్కడా పొరపాట్లు లేకుండా చూడాలని ఎస్ఈసీ…. ప్రభుత్వ యంత్రాంగానికి సూచించింది.
సర్పంచ్ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న వేళ… గ్రామాల్లోనూ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఇప్పటికే పోటీ చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్న వాళ్లు… పావులు కదిపే పనిలో పడ్డారు. రిజర్వేషన్ల ఖరారు అయితే… పోటీపై మరింత స్పష్టతకు రానున్నారు. ఇక మున్సిపాలిటీల్లోనూ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ల పదవులపై చాలా మంది ఆశలు పెట్టుకుని ఉన్నారు. ప్రధాన పార్టీలలో పని చేస్తున్న పలువురు నేతలు… ఇప్పట్నుంచే వ్యూహాలకు పదును పెడుతున్నారు.