తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాలకు 24 లక్షల మంది దరఖాస్తు.. డిసెంబర్ 2న ఈ-డిప్
తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాలకు ఈ డిప్ రిజిస్ట్రేషన్ గడువు ముగిసింది. అయితే వైకుంఠ ద్వార దర్శనాల కోసం భారీగా భక్తులు దరఖాస్తు చేసుకున్నారు.
తిరుమల వైకుంఠ ద్వార దర్శనం కోసం ఈ డిప్ రిజిస్ట్రేషన్ ద్వారా భారీగా భక్తులు దరఖాస్తు చేసుకున్నారు. సుమారు 1.80 లక్షల టోకెన్ల కోసం రికార్డు స్థాయిలో 24 లక్షల మంది దరఖాస్తులు వచ్చాయి. 9.6 లక్షల రిజిస్ట్రేషన్ల ద్వారా 24,05,237 లక్షల మంది భక్తులు తమ పేర్లను నమోదు చేసుకున్నట్టుగా టీటీడీ ప్రకటించింది. డిసెంబర్ 2న నిర్వహించే ఈ డిప్ లాటరీలో ఎంపికైన భక్తులకు టిటీడీ టోకెన్లు కేటాయించనుంది.

డిసెంబర్ 30వ తేదీన వైకుంఠ ఏకాదశి, డిసెంబర్ 31న ద్వాదశి, జనవరి 1 మూడో రోజులకు ఆన్లైన్ ఈ డిప్ ద్వారా భక్తులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. టీటీడీ మెుబైల్ యాప్ ద్వారా 13.4 లక్షల మంది, టీటీడీ వెబ్సైట్ ద్వారా 9.3 లక్షలు, ఏపీ ప్రభుత్వం వాట్సాప్ ద్వారా 1.5 లక్షల మంది భక్తులు పేర్లు నమోదు చేసిందని టీటీడీ వెల్లడించింది. మిగిలిన ఏడు రోజులు జనవరి 2 నుంచి జనవరి 8వ తేదీ దాకా సర్వదర్శనానికి యథాతథంగా అనుమతించనుంది. రోజుకు 15వేల చొప్పున రూ.300 దర్శనం టోకెన్లు, రోజుకు వెయ్యి శ్రీవాణి టిక్కెట్లను డిసెంబరు 5వ తేదీన ఆన్లైన్లో విడుదల చేయనున్నారు. వైకుంఠ ద్వార దర్శనాల్లో సామాన్య భక్తులకు టీటీడీ అధిక ప్రాధాన్యత ఇస్తోంది.
ఇతర ఆలయాల్లో అన్నప్రసాదాలు పంపిణీ
తిరుమల తరహాలో టీటీడీ పరిధిలోని ఇతర ఆలయాలలో భక్తులకు అన్నప్రసాదాలను రుచికరంగా, శుచికరంగా, నాణ్యంగా అందించాలని టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ అధికారులను ఆదేశించారు. టీటీడీలో జరుగుతున్న అభివృద్ధి పనులపై టీటీడీ పరిపాలనా భవనంలోని ఈవో ఛాంబర్ లో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ, టీటీడీ ఆధ్వర్యంలోని ఆలయాలలో అన్నప్రసాదాల పంపిణీకి సంబంధించి అన్నప్రసాదాల తయారు చేసే పోటు సిబ్బందికి శిక్షణ ఇవ్వాలని, అన్నప్రసాదాల పంపిణి పటిష్టంగా నిర్వహించేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. టీటీడీ ఆలయాలలో ఇప్పటి వరకు పంపిణీ చేస్తున్న అన్నప్రసాదాలపై రోజు వారి నివేదికను తయారు చేయాలన్నారు. టీటీడీలో ఇంకా ఎవరైనా అన్య మతస్తులు ఉంటే వారిని గుర్తించి తదుపరి చర్య కోసం నివేదిక తయారు చేయాలన్నారు.
దేశవ్యాప్తంగా టీటీడీ పరిధిలో చేరిన చారిత్రాక ఆలయాలకు, ఇతర ఆలయాలకు ఏఏ ఆలయాలకు వేదపారాయణదారులను నియమించాలి, ఎంత మంది అర్చకులను నియమించాలనే అంశంపై సమగ్ర నివేదిక రూపొందించాలని ఆదేశించారు సింఘాల్.
టీటీడీ పరిధిలో చేరిన ప్రతి ఆలయంపై ప్రామాణిక ఆపరేటింక్ విధానాన్ని (ఎస్.ఓ.పి) రూపొందించి వచ్చే సమావేశానికి నివేదించాలని టీటీడీ ఈవో సూచించారు. పోటు వర్కర్ల పేర్ల స్థానంలో ముఖ్య పాచిక, పాచిక పేర్లను మార్చాలని టీటీడీ బోర్డులో నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో రాష్ట్ర దేవాదాయ శాఖ అధికారులతో మాట్లాడి వేగంగా పోటు వర్కర్ల పేర్లను మార్చే ప్రక్రియను పూర్తి చేయాలన్నారు.
టీటీడీలోని అర్భన్ డెవలప్మెంట్ సెల్ను పటిష్ట పర్చేందుకు వీలుగా తగిన సిబ్బంది తో కార్యాచరణ సిద్ధం చేయాలని చీఫ్ ఇంజనీర్ను టీటీడీ ఈవో సింఘాల్ ఆదేశించారు. శ్రీనివాస కల్యాణాలను క్రమంగా నిర్వహించేందుకు వీలుగా ముందస్తుగా (క్యాలెండర్ ఆఫ్ ఈవెంట్స్ ) ప్రణాళికలు రూపొందించాలన్నారు. తద్వారా భక్తులకు ముందుగానే కళ్యాణం సమాచారం అందడం వలన ఎక్కువ మంది పాల్గొని స్వామి వారి ఆశీస్సులు పొందుతారని చెప్పారు.
అమరావతిలోని వెంకటపాలెంలో ఉన్న టీటీడీ శ్రీ వేంకటేశ్వర ఆలయ విస్తరణ పనులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, 25 ఎకరాలలో ఇదివరకే ఉన్న ఆలయంతో పాటు ఇకపై నిర్మించనున్న కల్యాణ కట్ట, అర్చకులు, సిబ్బంది క్వార్టర్స్, ప్రాకారం, గోపురాలు, పుష్కరిణి, తదితర నిర్మాణాలపై కార్యాచరణ సిద్ధం చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు టీటీడీ ఈవో.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్ఎడిటర్గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్మెంట్లో భాగంగా ఈటీవీ భారత్కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్స్టైల్, ఎంటర్టైన్మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్సైట్స్ లాంచ్ టీమ్లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


