శ్రీవారి దర్శనార్థం భారత గౌరవ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గురువారం సాయంత్రం తిరుమల చేరుకున్నారు. తిరుమలలోని శ్రీ పద్మావతి విశ్రాంతి గృహం వద్దకు చేరుకున్న ఆమెకు హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత, టీటీడీ చైర్మన్ బీ.ఆర్.నాయుడు, బోర్డు సభ్యులు ఘన స్వాగతం పలికారు. పుష్పగుచ్ఛాలు అందించి ఆహ్వానం పలికారు.

శుక్రవారం ఉదయం తిరుమల శ్రీవారిని రాష్ట్రపతి ముర్ము దర్శించుకోనున్నారు. అంతకు ముందు రేణిగుంట విమానాశ్రయం నుంచి ద్రౌపది ముర్ము తిరుచానూరు వెళ్లి శ్రీపద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయం వద్దకు చేరుకున్న గౌరవ రాష్ట్రపతికి రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, టిటిడి ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తో పాటు జిల్లా కలెక్టర్, ఎస్పీతో స్వాగతం పలికారు. అర్చకులు సంప్రదాయ బద్ధంగా స్వాగతం పలికారు.
అనంతరం రాష్ట్రపతి ముర్ము… ఆలయంలోని ధ్వజస్తంభానికి మొక్కుకుని శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆశీర్వాద మండపంలో దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, ఈవో అనిల్ కుమార్ సింఘాల్… రాష్ట్రపతికి అమ్మవారి ప్రసాదాలు అందజేశారు. శేష వస్త్రంతో సత్కరించి అమ్మవారి చిత్రపటాలను అందజేశారు. అమ్మవారి దర్శనం అనంతరం తిరుమలకు బయలుదేరారు.