ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో ఏపీలో వర్షాలు పడనున్నాయి. ఈ మేరకు వాతావరణశాఖ వివరాలను పేర్కొంది. శుక్రవారం (17-10-25) ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం… అనంతపురం, శ్రీసత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా తీరం వెంబడి 35-55 కిమీ వేగంతో ఈదురుగాలులు వీచే సూచనలున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. చెట్లు, భారీ హోర్డింగ్స్ వద్ద నిలబడవద్దని హెచ్చరించారు.
నిష్క్రమించిన నైరుతి రుతుపవనాలు:
మరోవైపు గురువారం(16 అక్టోబర్ 2025)న నైరుతి రుతుపవనాలు దేశం నుంచి పూర్తిగా నిష్క్రమించాయని వాతావరణశాఖ ప్రకటించింది. ఈ ఏడాది మే 24న రుతుపవనాలు ప్రవేశించాయి. ఆంధ్రప్రదేశ్ లోకి మే 26న రుతుపవనాలు ప్రవేశించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత తెలంగాణతో పాటు ఇతర ప్రాంతాలకు కూడా విస్తరించాయి. నైరుతి రుతుపవనాల ప్రభావంతో దేశవ్యాప్తంగానూ భారీ వర్షాలు పడ్డాయి. తెలుగు రాష్ట్రాల్లోనూ వాగులు, వంకలు పొంగిపొర్లాయి. ప్రాజెక్టులన్నీ కూడా నిండుకుండలా మారాయి.