ఉపరితల ఆవర్తన ప్రభావంతో దక్షిణ అండమాన్ సముద్రంలో అల్పపీడనం ఏర్పడింది. ఈ మేరకు వాతావరణశాఖ వివరాలను వెల్లడించింది. ఇది పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ సోమవారం నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని అంచనా వేసింది.
ఈనెల 28 నుంచి వర్షాలు….

ఆ తదుపరి 48 గంటల్లో పశ్చిమ - వాయువ్య దిశగా కదులుతూ నైరుతి బంగాళాఖాతంలో మరింత బలపడే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. ఈ ప్రభావంతో ఈనెల 28 నుంచి డిసెంబర్ 01 వరకు రాష్ట్రంలో కొన్నిప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
వర్ష సూచన ఉండటంతో రైతులకు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ కొన్ని సూచనలు చేసింది. వరి కోతలు జోరుగా సాగుతున్న నేపథ్యంలో రైతులు వెంటనే కుప్పలు వేసుకోవాలని సూచించింది. పండిన ధాన్యాన్ని తడవకుండా సురక్షితంగా భద్రపరచుకోవాలని సూచించింది. రంగుమారకుండా ఉండేందుకు పూర్తిగా పట్టాలతో కప్పి ఉంచాలని… తడిసిన గింజలు మొలకెత్తకుండా, నాణ్యత కోల్పోకుండా జాగ్రత్త పడాలని పేర్కొంది.
అమరావతి వాతావరణ కేంద్రం తెలిపిన వివరాల ప్రకారం... ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తాలో ఇవాళ, రేపు, ఎల్లుండి తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది.రాయలసీమలో ఇవాళ పలు జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు పడొచ్చని పేర్కొంది. రాబోయే రెండు మూడు రోజులు కూడా తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు కురిసే సూచనలున్నాయని ఓ ప్రకటనలో పేర్కొంది.