రైలు ప్రయాణికులకు దక్షిణ కోస్తా రైల్వే ముఖ్యమైన సమాచారాన్ని అందించింది. రాయగడ నుంచి గుంటూరు మార్గంలో ప్రయాణించే డైలీ ఎక్స్ప్రెస్ రైలు సమయాల్లో మార్పులు చేసింది. రైలు నంబర్ 17244 రాయగడ - గుంటూరు డైలీ ఎక్స్ప్రెస్ వేళలను సవరిస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఈ కొత్త వేళలు 2026 ఆగస్టు 24వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి.

రైలు బయలుదేరే సమయాన్ని 10 నిమిషాలు ముందుకు జరిపినట్లు రైల్వే అధికారులు స్పష్టం చేశారు. దీనివల్ల ప్రయాణికులు రైలు మిస్ కాకుండా ఉండేందుకు కొత్త టైమింగ్స్ను గమనించి ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోవాలని సూచించారు.
కొత్త టైమింగ్స్ వివరాలు….
- రాయగడ స్టేషన్ : ఇప్పటివరకు ఈ రైలు రాయగడ నుంచి మధ్యాహ్నం 15:00 గంటలకు (3:00 PM) బయలుదేరేది. ఆగస్టు 24 నుంచి మధ్యాహ్నం 14:50 గంటలకే (2:50 PM) బయలుదేరుతుంది.
- జిమిడిపేట స్టేషన్ : ఈ స్టేషన్కు రైలు చేరుకునే, బయలుదేరే సమయాల్లో కూడా మార్పులు చేశారు. పాత వేళల ప్రకారం మధ్యాహ్నం 15:16 కి వచ్చి 15:18 కి బయలుదేరేది. కొత్త షెడ్యూల్ ప్రకారం మధ్యాహ్నం 15:06 గంటలకు జిమిడిపేట చేరుకుని, 15:08 గంటలకు బయలుదేరుతుంది.
గుంటూరు మార్గంలో రాయగడకు రాకపోకలు సాగించే వారికి ఈ రైలు అనుకూలంగా ఉంటుంది. ఈ ట్రైన్ మొత్తం 13 గంటల 50 నిమిషాల పాటు ప్రయాణం సాగిస్తుంది. ఏపీ, ఒడిషా రాష్ట్రాల్ని కలిపే ముఖ్యమైన రైలు ఇది. ఈ రైలు ప్రయాణించే రూటులో దాదాపు 30 హాల్ట్ స్టేషన్లు ఉన్నాయి. అయితే ప్రస్తుతానికి మాత్రం రాయగడ నుంచి గుంటూరు వచ్చే రైలుకు మాత్రమే ఈ టైమింగ్స్ లో మార్పు చేశారు. గుంటూరు-రాయగడ రైలులో ఎలాంటి మార్పు లేదు. ఈ మార్పును గమనించాలని ప్రయాణికులకు దక్షిణ కోస్తా రైల్వే సూచించింది. ప్రయాణికులు ఈ మార్పును గమనించి సహకరించాలని కోరింది.