శబరిమల భక్తులకు సింథటిక్ కుంకుమ అమ్మకాలు వద్దని చెప్పాం కదా : హైకోర్టు

శబరిమల భక్తులకు సింథటిక్ కుంకుమ అమ్మకాలపై కేరళ హైకోర్టు మండిపడింది. రెండు సంస్థలకు నోటీసులు జారీ చేసింది.

Published on: Dec 04, 2025 6:08 PM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

శబరిమల భక్తులకు సింథటిక్ కుంకుమ(రసాయనాలు కలిపిన కుంకుమ) అమ్మకం నిషేధం విధించినప్పటికీ నిరాటంకంగా కొనసాగుతోందని కేరళ హైకోర్టు పేర్కొంది. జస్టిస్ రాజా విజయరాఘవన్ వి, జస్టిస్ కేవీ జయకుమార్‌లతో కూడిన ధర్మాసనం.. డిస్ట్రిబ్యూటర్ ఐడియల్ ఎంటర్ ప్రైజెస్ అని సంస్థకు నోటీసులు జారీ చేసింది.

శబరిమల అయ్యప్ప
శబరిమల అయ్యప్ప

ఐడియల్ ఎంటర్ ప్రైజెస్ పంపిణీ చేసిన కుంకుమను విక్రయించేందుకు వివిధ విక్రేతలకు సర్టిఫికేట్లు జారీ చేసినట్టుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న కేరళ ఎన్విరో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ అనే ల్యాబ్‌కు కూడా కోర్టు నోటీసులు జారీ చేసింది. డిసెంబర్ 5న జరగనున్న తదుపరి విచారణకు ముందే సమాధానం చెప్పాలని కోర్టు ఆ రెండు సంస్థలను ఆదేశించింది.

ఎరుమేలి గ్రామ పంచాయతీ ప్రాంతంలో సింథటిక్ కుంకుమ అమ్మకాలు విస్తృతంగా జరుగుతున్నాయని, ఐడియల్ ఎంటర్ ప్రైజెస్ ద్వారా పంపిణీ జరుగుతుందని కోర్టుకు తెలిసిన తరువాత ఈ ఉత్తర్వులు జారీ అయ్యాయి. పంపిణీ చేసిన కుంకుమ సహజ పదార్థాల నుండి లభించిందో లేదో నిర్ధారించడం సాధ్యం కాదని ఎరుమేలి పంచాయతీ తెలిపింది.

కోర్టు గతంలో రసాయనాల కుంకుమపై నిషేధం విధించినా.. కుంకుమ అమ్మకాలు నిరాటంకంగా కొనసాగుతున్నాయని కోర్టు వ్యాఖ్యానించింది. ఈ విషయాన్ని తాము కనుగొన్నామని ధర్మాసనం పేర్కొంది. 'ఎట్టి పరిస్థితుల్లోనూ దీనిని అనుమతించలేం. ఐడియల్ ఎంటర్ప్రైజెస్ అని పిలిచే సంస్థ ప్రధాన పంపిణీదారు అని ప్రాథమికంగా తెలుస్తోంది.' అని కోర్టు పేర్కొంది.

నవంబర్ 7, 12 తేదీల్లో శబరిమలలోని సన్నిధానం ప్రాంతంలోని భక్తులకు రసాయనికంగా తయారైన లేదా సింథటిక్ కుంకుమను తయారు చేయడానికి, పంపిణీ చేయడానికి, విక్రయించడానికి అమ్మకందారులను అనుమతించరాదని కోర్టు ప్రత్యేక ఉత్తర్వుల ద్వారా స్పష్టం చేసింది. అయినప్పటికీ ఇది కొనసాగడంపై మండిపడింది. ఐడియల్ ఎంటర్ప్రైజెస్, ఎన్విరో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ అనే ల్యాబ్ సమాధానాలు ఇవ్వాలని స్పష్టం చేసింది. విచారణ డిసెంబర్ 5వ తేదీన జరగనుంది.

15 లక్షలు దాటిన భక్తులు

మండల-మకరవిళక్కు తీర్థయాత్రల సీజన్‌లో శబరిమల సందర్శించే భక్తుల సంఖ్య 15 లక్షలు దాటిందని అధికారులు పేర్కొన్నారు. అధికారిక సమాచారం ప్రకారం డిసెంబర్ 3న సాయంత్రం 7 గంటల నాటికి మొత్తం 14,95,774 మంది భక్తులు ఆలయానికి చేరుకున్నారు. వర్చువల్-క్యూ బుకింగ్‌లు పొందిన యాత్రికులలో దాదాపు 15 శాతం మంది హాజరు కాలేదని, స్పాట్ బుకింగ్‌పై పరిమితి 5,000కే పరిమితం అయినట్టుగా అధికారులు తెలిపారు. శబరిమల వద్ద రద్దీ పరిస్థితి పూర్తిగా అదుపులో ఉందని, వర్చువల్ క్యూ స్లాట్‌ల సంఖ్యను జోడించాలని యోచిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.