శ్రీశైలం వెళ్లే భక్తులకు అలర్ట్ - స్పర్శ దర్శనాలు నిలిపివేత, ఎప్పటివరకంటే..?

శ్రీశైలం వచ్చే మల్లన్న భక్తులకు ఆలయ అధికారులు కీలక అప్డేట్ ఇచ్చారు. స్పర్శ దర్శనాలను డిసెంబర్ 8వ తేదీ వరకు నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. 

Published on: Dec 04, 2025 6:02 AM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

శ్రీశైల మల్లికార్జున స్వామి స్పర్శ దర్శనంపై ఆలయ అధికారులు మరో ప్రకటన చేశారు. భక్తుల రద్దీ నేపథ్యంలో డిసెంబర్ 8వ తేదీ వరకు స్పర్శ దర్శనాలను నిలిపివేస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఆలయంలో శివదీక్ష విరమణల రద్దీ కారణంగా రద్దీ ఎక్కువగా ఉందని ఓ ప్రకటన ద్వారా తెలిపారు.

శ్రీశైలం
శ్రీశైలం

సిఫార్సు లేఖలతో వచ్చే వారికి కూడా స్పర్శ దర్శనం ఉండదని స్పష్టం చేశారు. డిసెంబర్ 5వ తేదీ వరకు రూ.5 వేల గర్భాలయ అభిషేకం, రూ.1,500 సామూహిక అభిషేకాలు ఉంటాయని వివరించారు.

మరోవైపు శ్రీశైలంలో స్పర్శ దర్శనం కోసం భక్తులు ఆన్ లైన్ ద్వారా భారీ సంఖ్యలో నమోదు చేసుకుంటున్నారు. అలాగే శివమాలధారులు కూడా భారీగా ఆలయానికి వస్తున్నారు. దీంతో శ్రీశైలంలో భక్తుల రద్దీ పెరిగింది. ఫలితంగా స్పర్శ దర్శనానికి చాలా సమయం పడుతోంది. క్రమంగా రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో… ఈనెల 8వ తేదీ వరకు స్పర్శ దర్శనాలను నిలిపివేయాలని అధికారులను నిర్ణయించారు.

మరోవైపు భక్తుల రద్దీకి అనుగుణంగా దేవస్థానం అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. కంపార్టుమెంట్లలో ఉండే భక్తులకు అల్పాహారం, తాగునీరు పంపిణీ చేస్తున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నారు.

ఉచితంగా లడ్డూల పంపిణీ:

ఇక మల్లన్న స్పర్శ దర్శనం, అతిశీఘ్ర దర్శనం టికెట్లు తీసుకున్న భక్తులకు ఉచితంగా లడ్డూలను పంపిణీ చేస్తున్నారు. డిసెంబర్ 1వ తేదీ నుంచి ఈ నిర్ణయాన్ని అమలు చేస్తున్నారు. రూ.500 స్పర్శ దర్శనం టికెట్లు, రూ.300 అతి శీఘ్ర దర్శనం టికెట్లు తీసుకున్న భక్తులకు మాత్రమే వీటిని అందిస్తారు. స్పర్శ దర్శనం టికెట్‌పై 100 గ్రాముల లడ్డూలు రెండు, రూ.300 దర్శనం టికెట్‌కు ఒక లడ్డూను అందజేస్తున్నారు.

ఈ ఉచిత లడ్డూల పంపిణీ కోసం ఆలయ అధికారులు ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేశారు. ఆలయంలోని 9,10 కౌంటర్లలో మాత్రమే ఈ ఉచిత లడ్డూలను దొరుకుతాయి. టికెట్లు తీసుకున్న ఈ భక్తులు కౌంటర్లను సంప్రదించి లడ్డూలను పొందవచ్చు.