ఆగస్టు 23 నుండి 25వ తేదీ వరకు శ్రీవారి ఆలయంలో పవిత్రోత్సవాలు.. ఆర్జితసేవలు రద్దు

TTD : ఆగస్టు 23 నుండి 25వ తేదీ వరకు శ్రీవారి ఆలయంలో పవిత్రోత్సవాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా ఆర్జిత సేవలను టీటీడీ రద్దు చేసింది.

Published on: Aug 11, 2026, 20:17:01 IST
By , Tirumala
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

తిరుమల శ్రీవారి ఆలయంలో ఆగస్టు 23 నుంచి 25వ తేదీ వరకు పవిత్రోత్సవాలు వైభవంగా జరుగనున్నాయి. ఆగస్టు 22వ తేదిన అంకురార్పణతో ఈ ఉత్సవాలు ప్రారంభమవుతాయి. ఏడాది పొడవునా ఆలయంలో జరిగే అర్చనలు, ఉత్సవాల్లో యాత్రికుల వల్లగానీ, సిబ్బంది వల్లగానీ తెలియక కొన్ని దోషాలు జరుగుతుంటాయి. వీటివల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుండా ఆగమశాస్త్రం ప్రకారం పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు.

తిరుమల శ్రీవారి ఆలయంలో పవిత్రోత్సవాలు
తిరుమల శ్రీవారి ఆలయంలో పవిత్రోత్సవాలు

పవిత్రోత్సవాలు తిరుమలలో 15-16 శతాబ్దాల వరకు జరిగినట్టు ఆధారాలున్నాయి. 1962వ సంవత్సరం నుంచి దేవస్థానం ఈ ఉత్సవాలను పునరుద్ధరించింది.

ఉత్సవాల్లో భాగంగా మూడు రోజుల పాటు ఆల‌యంలోని సంపంగి ప్రాకారంలో ఉదయం 9 నుంచి 11 గంటల వరకు స్నపనతిరుమంజనం నిర్వహిస్తారు. సాయంత్రం ప్రత్యేకంగా అలంకరించిన ఆభరణాలతో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారు ఆల‌య నాలుగు మాడ వీధుల్లో విహ‌రించి భ‌క్తుల‌కు ద‌ర్శన‌మిస్తారు. ఆగస్టు 23న పవిత్రాల ప్రతిష్ట, 24న పవిత్ర సమర్పణ, 25న పూర్ణాహుతి కార్యక్రమాలు నిర్వహిస్తారు.

ఆర్జితసేవలు రద్దు

ప‌విత్రోత్సవాల్లో ఆగస్టు 22న అంకురార్పణ కార‌ణంగా సహస్రదీపాలంకార సేవను టీటీడీ ర‌ద్దు చేసింది. అదేవిధంగా ఆగస్టు 23 నుండి 25వ తేది వరకు కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార, 25న అష్టదళ పాదపద్మారాధన సేవను, ఆగస్టు 26న (పవిత్రోత్సవాలు ముగిసిన తర్వాత రోజు) కల్యాణోత్సవ సేవలను రద్దు చేయడం జరిగింది.

పట్టాభిరామస్వామివారి పట్టాభిషేక మహోత్సవాలు

టీటీడీ ఆధ్వర్యంలోని వాల్మీకిపురం శ్రీ పట్టాభిరామస్వామివారి ఆలయంలో ఆగస్టు 17 నుంచి 19వ తేదీ వరకు శ్రీ పట్టాభిషేక మహోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. ఆగస్టు 17న సాయంత్రం 6 గంటలకు సేనాధిపతి ఉత్సవం, అంకురార్పణతో మహోత్సవాలకు శ్రీకారం చుడతారు. ఆగస్టు 18న శ్రీ సీతారాముల శాంతి కల్యాణం ఉంటుంది.

ఆగస్టు 18న ఉదయం యాగశాల పూజ, ఉదయం 10 గంటలకు స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. సాయంత్రం 5 గంటలకు ఊంజల్ సేవ, 6.30 గంటలకు శ్రీ సీతారాముల శాంతి కల్యాణం, రాత్రి 8 గంటలకు హనుమంత వాహనసేవ వైభవంగా జరుగనున్నాయి.

ఆగస్టు 19న ఉదయం యాగశాల పూజ, 6.30 గంటలకు స్నపన తిరుమంజనం, అనంతరం 10 గంటలకు శ్రీరామ పట్టాభిషేక మహోత్సవం ఘనంగా నిర్వహిస్తారు. సాయంత్రం 6 గంటలకు ఊంజల్ సేవ, రాత్రి 7.30 గంటలకు గరుడ వాహనంపై శ్రీ పట్టాభిరామస్వామివారు భక్తులకు దర్శనమిస్తారు. అనంతరం మహాపూర్ణాహుతి, కుంభోద్వాసన, కుంభప్రోక్షణం నిర్వహిస్తారు.

గృహస్తులు (ఇద్దరు) రూ.300 చెల్లించి శ్రీరామ పట్టాభిషేకం ఆర్జిత సేవలో పాల్గొనవచ్చు. సేవలో పాల్గొన్న దంపతులకు ఒక ఉత్తరీయం, ఒక రవికె, అన్నప్రసాదం బహుమానంగా అందజేస్తారు.

మహోత్సవాల సందర్భంగా మూడు రోజుల పాటు టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్, అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో హరికథలు, భజనలు, ఆధ్యాత్మిక భక్తి సంగీత కార్యక్రమాలు నిర్వహించనున్నారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ పట్టాభిరామస్వామివారి కృపాకటాక్షాలు పొందాలని టీటీడీ కోరుతోంది.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More