...
...
Next Story

Tirumala Tickets : ‘శ్రీవాణి’ టికెట్ల విధానంలో మార్పులు - ఇవాళ్టి నుంచే అమలు..! వీటిని తెలుసుకోండి

Tirumala Srivani Ticket Changes : తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ అప్డేట్ ఇచ్చింది. శ్రీవాణి ట్రస్ట్ వీఐపీ బ్రేక్ దర్శన టికెట్ల కేటాయింపులో కీలక మార్పులు తీసుకొచ్చింది. ఇవాళ్టి నుంచే కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి.

Published on: Jun 10, 2026 07:24 AM IST
Advertisement

Tirumala Srivani Ticket Changes : కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి దర్శనం కోసం వచ్చే భక్తులకు మరింత సౌకర్యవంతంగా సేవలందించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) నిరంతరం ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా ‘శ్రీవాణి’ (SRIVANI) ట్రస్టుకు సంబంధించిన వీఐపీ బ్రేక్ దర్శన టికెట్ల కేటాయింపు నిబంధనలలో టీటీడీ పాలకమండలి కొన్ని కీలక మార్పులు చేస్తూ నిర్ణయం తీసుకుంది. భక్తుల రద్దీని క్రమబద్ధీకరించడంతో పాటు, స్వామివారికి పెద్ద ఎత్తున విరాళాలు ఇచ్చే దాతలకు ప్రాధాన్యత కల్పించేలా ఈ సరికొత్త విధానాన్ని రూపొందించింది.

తిరుమల శ్రీవారి ఆలయం
తిరుమల శ్రీవారి ఆలయం

ప్రస్తుతం అమల్లో ఉన్న నిబంధనల ప్రకారం.. టీటీడీ రోజుకు మొత్తం 1,500 శ్రీవాణి దర్శన టికెట్లను ఆన్‌లైన్ ద్వారా భక్తులకు అందుబాటులో ఉంచుతోంది. వీటిలో 500 దర్శన టికెట్లను మూడు నెలల ముందే అడ్వాన్స్ బుకింగ్ చేసుకునేలా ఆన్‌లైన్‌లో విడుదల చేస్తున్నారు. అదేవిధంగా, తిరుపతికి విమానాల్లో వచ్చే భక్తుల సౌకర్యార్థం రేణిగుంట (తిరుపతి) విమానాశ్రయంలో ఏర్పాటు చేసిన కరెంట్ బుకింగ్ కౌంటర్ ద్వారా ప్రతిరోజూ 200 శ్రీవాణి టికెట్లను జారీ చేస్తున్నారు.

దాతల కోసం ప్రత్యేక కోటా

మిగిలిన 800 శ్రీవాణి దర్శన టికెట్లను ప్రతిరోజూ కరెంట్ బుకింగ్ కోటా కింద తిరుమలలో కేటాయిస్తున్నారు. అయితే, ఈ 800 టికెట్లలో ఒక ముఖ్యమైన మార్పును టీటీడీ ప్రవేశపెట్టింది. ఇప్పటికే శ్రీవాణి ట్రస్ట్‌కు రూ.10 వేల విరాళం చెల్లించి, దర్శన టికెట్ కోసం వేచి చూస్తున్న దాతల కోసం ఈ కోటా నుంచి ప్రతిరోజూ ప్రత్యేకంగా 300 టికెట్లను కేటాయించాలని నిర్ణయించారు. ఈ సరికొత్త సదుపాయం గత సంవత్సరం (2025) మే 1వ తేదీ నుంచి విరాళాలు చెల్లించి…. అర్హులైన దాతలందరికీ వర్తించనుంది.

ఇవాళ్టి నుంచే అమలు.. దర్శన సమయాలు ఇవే!

అలా బుక్ చేసుకున్న భక్తులకు అదే రోజు సాయంత్రం 4 గంటలకే శ్రీవారి వీఐపీ బ్రేక్ దర్శనం కల్పించనుండటం ఇక్కడ విశేషం. ఒకవేళ నిర్ణీత మధ్యాహ్నం 1 గంట సమయానికి ఈ ప్రత్యేక కోటాలో టికెట్లు మిగిలిపోతే.. వాటిని తిరిగి సాధారణ కరెంట్ బుకింగ్ కోటాలోనే కలిపేస్తారు.

ఈ సరికొత్త మార్పుల విధానం రాబోయే 2027 మార్చి 31వ తేదీ వరకు నిరంతరాయంగా అమల్లో ఉంటుందని టీటీడీ అధికారికంగా స్పష్టం చేసింది. ఈ నిర్ణయం వల్ల విరాళాలు ఇచ్చిన దాతలకు వేచి ఉండే సమయం తగ్గి, అదే రోజు సాయంత్రానికే స్వామివారి దర్శన భాగ్యం కలుగుతుంది.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe