పోలవరం ప్రాజెక్టు సమీపంలో గోదావరి నదికి ఇరువైపులా పర్యాటక ప్రాజెక్టులు

పోలవరానికి పర్యాటక శోభను తీసుకొచ్చేందు ప్రణాళికలు వేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. ప్రాజెక్టుతో పాటు గోదావరి తీరంలో టూరిజం అభివృద్దికి మాస్టర్ ప్లాన్ చేస్తోంది.

Published on: Jul 15, 2026, 06:06:18 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఆంధ్రప్రదేశ్‌లో పోలవరానికి పర్యాటక శోభను తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం భారీ ప్రణాళికలు రచిస్తోంది. పోలవరం డ్యామ్‌తోపాటు గోదావరి నదీ తీరాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దే ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టిపెట్టారు. ఇందులో భాగంగా ప్రాజెక్టు ప్రాంతంతోపాటు ప్రాజెక్టు దిగువన, ఎగువన టూరిజం డెవల్మెంట్‌కు మాస్టర్ ప్లాన్ సిద్ధం చేస్తున్నారు. ఈ అంశంపై సీఎం క్యాంప్ కార్యాలయంలో ఇరిగేషన్, టూరిజం శాఖ అధికారలుతో పాటు ఏజెన్సీలతో ముఖ్యమంత్రి సమావేశం అయ్యారు.

గోదావరి పర్యాటక ప్రాజెక్టులు
గోదావరి పర్యాటక ప్రాజెక్టులు

నదీతీరం వెంట టూరిజం ప్రాజెక్టులతో ఈ ప్రాంతాన్ని అభివృద్ది చేయాలని సీఎం సూచించారు. ప్రాజెక్టు వద్ద కేబుల్ బ్రిడ్జ్ డిజైన్, స్పిల్ వే బ్యూటిఫికేషన్ సహా మాస్టర్ ప్లాన్‌పై చర్చించారు. టూరిజం ప్రాజెక్టుల అభివృద్దిలో అనుభవం ఉన్న నిప్పాన్ కోయి సంస్థ ప్రతినిధులు ముఖ్యమంత్రికి ప్రజెంటేషన్ ఇచ్చారు. పోలవరం ప్రాజెక్టు సమీపంలో నదికి ఇరువైపులా పర్యాటక ప్రాజెక్టులు ఏర్పాటుపై చర్చించారు.

పోలవరం ప్రాజెక్టు ఎగువున భద్రాచలం సమీపం వరకు ఏపీ భూభాగంలో టూరిజం అభివృద్ధికి అనేక అవకాశాలు ఉన్నాయని సీఎం చంద్రబాబు అభిప్రాయపడ్డారు. సమృద్ధిగా నీటి వనరులు, పచ్చని కొండలు, అటవీ ప్రాంతాలతో మంచి పర్యాటక ప్రాంతంగా పోలవరం మారుతుందని సీఎం అన్నారు. ఎకో టూరిజం, రాక్ క్లైంబింగ్, వెల్‌నెస్ సెంటర్స్, డెస్టినేషన్ వెడ్డింగ్స్ వంటి వాటికి అనుకూలంగా మార్చాలని సీఎం సూచించారు. ఈ నేపథ్యంలో పలు ప్రాజెక్టులు చేపట్టడం ద్వారా పర్యాటక రంగంలోనూ పోలవరాన్ని ప్రత్యేకంగా నిలపేలా చేయాలన్నారు.

ఇంజనీరింగ్ టూరిజం, రివర్ ఫ్రంట్ టూరిజం, అడ్వెంచర్ టూరిజం డెవల్మెంట్‌కు ఈ ప్రాంతం అత్యంత అనుకూలమన్న ఏజెన్సీ.. వాటర్ స్పోర్ట్స్‌కు సమృద్ధిగా అవకాశాలు ఉన్నాయని వివరించింది. స్పిల్ వే దిగువున నది మధ్యలో 500 ఎకరాల ఐ లాండ్ స్థలాన్ని అభివృద్ది చేసే విషయంలో పలు డిజైన్లు ప్రతిపాదనలను అందించారు. అలాగే మధ్యలో ఉండే వాటర్ బాడీలు, కొండలను పర్యాటక ప్రాంతాలుగా మార్చేందుకు ఉన్న అవకాశాలను సంస్థ ప్రతినిధులు వివరించారు. స్పిల్ వే దిగువన కేబుల్ బ్రిడ్జ్ డిజైన్లపైనా ప్రజెంటేషన్ ఇచ్చారు. ఐలాండ్‌గా ఉన్న ప్రాంతంతో పాటు చుట్టుపక్కల మొత్తం 1,500 ఎకరాల్లో తీసుకురాదగిన ప్రాజెక్టులపై నిప్పాన్ కోయి సంస్థ ప్రజెంటేషన్‌లో పలు ప్రతిపాదనలు చేసింది.

ప్రాజెక్టుతో లక్షల ఎకరాలకు నీరు ఇవ్వడంతో పాటు...పర్యాటకంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ది చేయడం ద్వారా రాష్ట్రానికి ఆదాయం వస్తుందని, స్థానికంగా ఎంతోమందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని సీఎం చంద్రబాబు అన్నారు. ప్రజెంటేషన్ సందర్భంగా సీఎం పలు సూచనలు చేశారు. అఖండ గోదావరి ప్రాజెక్టు కింద ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున పర్యాటక ప్రాజెక్టులు తీసుకువస్తామని సీఎం స్పష్టం చేశారు. అధికారులు ఆమేరకు ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More