తిరుమలకు వచ్చే భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం ముఖ్యమైన అలర్ట్ ఇచ్చింది. భక్తుల సౌకర్యార్థం తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో (తిరుమల నుండి తిరుపతి వెళ్ళే కనుమ దారి) బీ.టీ రోడ్డు మారమ్మతు పనులు వేగంగా సాగుతున్నాయని తెలిపింది. ఈ నేపథ్యంలో వాహనదారులు మరింత అప్రమత్తంగా వాహనాలను నడపాలని విజ్ఞప్తి చేసింది.

శ్రీవారి భక్తులకు అసౌకర్యం కలగకుండా ఉండాలనే ఉద్దేశంతో ఘాట్ రోడ్డును మూసివేయకుండా నిర్దేశించిన సమయంలో మరమ్మతు పనులను పూర్తి చేసేందుకు టీటీడీ చర్యలు చేపట్టింది. భక్తులు వారి తిరుమల ప్రయాణాన్ని తదనుగుణంగా మార్చుకుని కనీసం గంట ముందుగా ప్రారంభించాలని కోరింది.
మరమ్మతుల కారణంగా వాహనదారులు నెమ్మదిగా అక్కడక్కడా కొద్ది సేపు ఆగుతూ ప్రయాణించాల్సి ఉంటుందనే విషయాన్ని గమనించాలని టీటీడీ స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో తిరుమల నుంచి రేణిగుంట విమానాశ్రయం, తిరుపతి రైల్వేస్టేషన్, ఆర్డీసీ బస్ స్టాండ్లు వెళ్ళే భక్తులు ముందస్తుగా ప్రయాణ ఏర్పాట్లు చేసుకోవాలని సూచించింది.
ఈ విషయాలను దృష్టిలో ఉంచుకుని వాహనదారులు, భక్తులు తమ తిరుమల ప్రయాణన్ని రూపొందించుకోవాలని టీటీడీ కోరింది. నిర్దేశించిన సమయంలో పనులు పూర్తి కావడానికి భక్తులు, వాహనదారులు సహకరించాలని కోరింది.
పౌర్ణమి గరుడసేవ రద్దు:
భక్తులకు టీటీడీ మరో అలర్ట్ కూడా ఇచ్చింది. శ్రీవారి ఆలయంలో ఏప్రిల్ 1వ తేదీన పౌర్ణమి గరుడసేవను రద్దు చేసింది. ప్రతినెలా పౌర్ణమి సందర్భంగా శ్రీవారికి గరుడ సేవ నిర్వహిస్తున్న విషయం విదితమే. శ్రీవారి వార్షిక వసంతోత్సవాలు జరుగుతున్న కారణంగా పౌర్ణమి గరుడసేవ రద్దయింది. ఈ విషయాన్ని భక్తులు గమనించాలని కోరింది.