శ్రీవారి సేవను మరింత బలోపేతం చేసేందుకు చర్యలు చేపట్టాలని టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ అధికారులను ఆదేశించారు. తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలోని ఈవో ఛాంబర్ లో శ్రీవారి సేవపై అధికారులతో సమీక్షించారు.

ఈ సందర్భంగా ఈవో సింఘాల్ మాట్లాడుతూ…. శ్రీవారి సేవకులకు మెరుగైన శిక్షణ ఇవ్వడం ద్వారా తిరుమలకు వచ్చే వేలాది మంది భక్తులకు చక్కటి సేవలు అందించవచ్చని ఆయన అన్నారు. అదేవిధంగా ఐఐఎం మరియు రాష్ట్ర ప్రభుత్వ ప్లానింగ్ శాఖకు సంబంధించిన ముఖ్యమైన శిక్షకులతో వచ్చే నవంబర్ నెలలో శిక్షణకు సంబంధించి ఆడియో, వీడియో విజువల్స్, ట్రైనింగ్ మెటీరియల్ సిద్ధం చేయాలన్నారు. ఇదివరకే ఆన్ లైన్ ద్వారా బుక్ చేసుకున్న గ్రూప్ సూపర్వైజర్లు, ట్రైనర్లకు డిసెంబర్, జనవరి మాసాల్లో ట్రైనింగ్ ఇవ్వాలన్నారు.
ఈ ట్రైనింగ్ లో శ్రీ వేంకటేశ్వర వైభవం, తిరుమల సమాచారం, మన సనాతన ధర్మం, విలువలు, మేనేజ్మెంట్, లీడర్ షిప్, సేవ తత్పరత తదితర అంశాలపై శిక్షణ ఇవ్వాల్సిన అవసరముందన్నారు.
తిరుపతి, తిరుమలలో ఉన్న టీటీడీ ఆస్పత్రుల్లో ముఖ్యంగా అశ్వినీ ఆసుపత్రి, ఆయుర్వేద, స్విమ్స్, బర్డ్, చిన్న పిల్లల ఆసుపత్రుల్లో రోగులకు సేవ చేసేందుకు శ్రీవారి వైద్య సేవను త్వరలోనే ప్రారంభించాలని టీటీడీలోని వివిధ ఆస్పత్రుల డైరెక్టర్లకు సూచించారు. ఇందుకు సంబంధించి శ్రీవారి వైద్య సేవా సెల్ ను ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలన్నారు.
ఎస్వీ గోసంరక్షణశాలలో కూడా శ్రీవారి సేవకులు గోసేవను చేయడానికి వీలుగా తగు చర్యలు తీసుకోవాలని టీటీడీ ఈవో సూచించారు. దేశంలోని టీటీడీ ఆలయాల్లో శ్రీవారి సేవా సేవకులతో భక్తులకు సేవలు అందించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ముఖ్యంగా చెన్నై, హైదరాబాద్, వైజాగ్, కన్యా కుమారి, బెంగుళూరు లాంటి ప్రాంతాల్లో ఉన్న శ్రీవారి ఆలయాల్లో మొదటి విడతగా శ్రీవారి సేవ ప్రారంభించాలని…. తదనంతరం మిగతా ఆలయాల్లో కూడా దశలవారీగా శ్రీవారి సేవను ప్రారంభించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని దిశానిర్దేశం చేశారు.