తిరుమల భక్తులకు అలర్ట్.. సెప్టెంబర్ నెల శ్రీవారి దర్శనం, ఆర్జిత సేవల ఆన్‌లైన్ కోటా షెడ్యూల్ విడుదల

సెప్టెంబర్ 2026 నెలకు గాను వివిధ దర్శనాలు, సేవలు, వసతి కేటాయింపుల కోసం ఆన్‌లైన్ కోటా షెడ్యూల్‌ను టీటీడీ విడుదల చేసింది. భక్తులు అర్జిత సేవలు, దర్శన టిక్కెట్లు, వసతిని కేవలం టీటీడీ అధికారిక వెబ్‌సైట్‌లో మాత్రమే బుక్ చేసుకోవాలని తెలిపింది.

Updated on: Jun 13, 2026, 13:40:19 IST
By , Tirumala
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

కలియుగ వైకుంఠం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవాలని ప్లాన్ చేస్తున్న భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం(TTD) కీలక అప్‌డేట్ ఇచ్చింది. 2026 సెప్టెంబర్ నెలకు సంబంధించిన వివిధ రకాల దర్శన టికెట్లు, ఆర్జిత సేవలు, వసతి గదుల ఆన్‌లైన్ కోటా విడుదల తేదీల షెడ్యూల్‌ను టీటీడీ అధికారికంగా ప్రకటించింది.

తిరుమల సెప్టెంబర్ ఆన్‌లైన్ కోటా షెడ్యూల్ విడుదల
తిరుమల సెప్టెంబర్ ఆన్‌లైన్ కోటా షెడ్యూల్ విడుదల

శ్రీవారి దర్శన భాగ్యం కోసం ఎదురుచూసే భక్తులు టికెట్లు బుక్ చేసుకోవడానికి ఏ రోజు ఏ కోటా విడుదలవుతుందో క్షుణ్ణంగా తెలుసుకోవడం ముఖ్యం. పూర్తి షెడ్యూల్, సమయాల వివరాలు ఇక్కడ చూడండి.

శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల లక్కీ డిప్ షెడ్యూల్

సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన వంటి అత్యంత ప్రాధాన్యత కలిగిన ఆర్జిత సేవల టికెట్ల కోటాను జూన్ 18వ తేదీ ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు. భక్తులు ఈ సేవలకు సంబంధించిన ఎలక్ట్రానిక్ డిప్ (లక్కీ డిప్) కోసం జూన్ 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చు. లక్కీ డిప్‌లో టికెట్లు పొందిన భక్తుల జాబితాను జూన్ 20న విడుదల చేస్తారు. లక్కీ డిప్‌లో పేరు వచ్చిన వారు జూన్ 20 నుండి జూన్ 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు టికెట్ డబ్బులు చెల్లించి తమ బుకింగ్‌ను కన్ఫర్మ్ చేసుకోవాల్సి ఉంటుంది.

ఇతర ఆర్జిత సేవలు, వర్చువల్ సేవల కోటా

శ్రీవారి కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవా టికెట్లను జూన్ 22వ తేదీ ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు. వర్చువల్ సేవలు, వాటికి సంబంధించిన దర్శన స్లాట్ల కోటాను జూన్ 22వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచుతారు.

అంగప్రదక్షిణం, శ్రీవాణి ట్రస్ట్, వృద్ధుల కోటా

సెప్టెంబర్ నెల అంగప్రదక్షిణం టోకెన్ల కోటా జూన్ 23వ తేదీ ఉదయం 10 గంటలకు విడుదలవుతుంది. శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శన టికెట్ల కోటాను జూన్ 23వ తేదీ ఉదయం 11 గంటలకు విడుదల చేస్తారు. వృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారికి ప్రత్యేక దర్శన టోకెన్ల కోటాను జూన్ 23వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో ఉంచుతారు.

రూ. 300 ప్రత్యేక ప్రవేశ దర్శనం, వసతి గదుల కోటా

భక్తులు ఎంతగానో ఎదురుచూసే రూ. 300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా జూన్ 24వ తేదీ ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల కానుంది. తిరుమల, తిరుపతిలో వసతి గదుల కోటాను జూన్ 24వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు.

భక్తులు దళారులను నమ్మి మోసపోవద్దని, శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శన టికెట్లు, వసతి గదులను కేవలం టీటీడీ అధికారిక వెబ్‌సైట్ అయిన ttdevasthanams.ap.gov.in ద్వారా మాత్రమే బుక్ చేసుకోవాలని అధికారులు స్పష్టం చేశారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More