ఏపీకి కేంద్రం శుభవార్త - ఆరు లైన్లతో భారీ కనెక్టివిటీ హైవే..! రూ.573 కోట్లు మంజూరు
ఏపీకి కేంద్ర ప్రభుత్వం శుభవార్తను అందించింది. మచిలీపట్నం పోర్ట్, నేషనల్ హైవే మధ్య కనెక్టివిటీ కోసం రహదారి నిర్మించనుంది. ఇందుకోసం ఏకంగా రూ. 573.77 కోట్లు మంజూరు చేసింది. ఇదే విషయాన్ని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు.
ఏపీకి కేంద్ర ప్రభుత్వం మరో శుభవార్తను చెప్పింది.మచిలీపట్నం పోర్ట్, నేషనల్ హైవే మధ్య కనెక్టివిటీ కోసం భారీ రహదారిని నిర్మించనుంది. ఆరు లైన్ల రోడ్డు నిర్మాణ కోసం ఏకంగా రూ. 573.77 కోట్లు మంజూరు చేసింది. ఇందుకు సంబంధించిన వివరాలను కేంద్ర రోడ్డు రవాణా మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు.

6 లైన్ల హైవే…
కేంద్రమంత్రి నితీన్ గడ్కరీ తెలిపిన వివరాల ప్రకారం…. NH-65, 216 జంక్షన్ నుంచి మచిలీపట్నం పోర్టుకు కనెక్టివిటీ రోడ్డు నిర్మాణానికి రూ.573.77 కోట్లు మంజూరు నిర్ణయాన్ని ఆమోదించారు . 6 వరుసల ప్రధాన హైవేతోపాటు, సర్వీస్ రోడ్లు, మూడు చోట్ల ఫ్లైఓవర్లు, ఓ రైల్వే వంతెన నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్ట్ మచిలీపట్నం పోర్టు - జాతీయ రహదారి కారిడార్ మధ్య అనువైన కెనక్టివిటీని ఏర్పాటవుతుంది. సరుకు రవాణా సమయం గణనీయంగా తగ్గుతుంది. ట్రాఫిక్ రద్దీని తగ్గించటంతో పాటు మొత్తం లాజిస్టిక్స్ సామర్థ్యాన్ని పెంచుతుంది.
కేంద్రం చేపట్టబోయే ఈ భారీ ప్రాజెక్ట్ ద్వారా భారీ కంటైనర్ల రాకపోకలు సులభతరం కానున్నాయి. ఫ్లైఓవర్లు, సర్వీస్ రోడ్ల వల్ల స్థానికంగా ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా సరుకు రవాణా సాగుతుంది. అలాగే ఈ అనుసంధానం ద్వారా మచిలీపట్నం ప్రాంతం ఒక ప్రధాన వాణిజ్య కేంద్రంగా ఎదిగే అవకాశం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
ఈ ప్రాజెక్ట్ ముఖ్య ప్రయోజనాలు:
- పోర్ట్కు నేషనల్ హైవే కారిడార్తో నేరుగా, నిరంతర అనుసంధానం
- సరుకు రవాణా సమయం గణనీయంగా తగ్గింపు
- ట్రాఫిక్ రద్దీ నియంత్రణ
- లాజిస్టిక్స్ సామర్థ్యం మరియు వాణిజ్య వేగం పెంపు
ఆమోదించిన పనుల పరిధి:
- 6-లేన్ ప్రధాన రహదారి
- సర్వీస్ రోడ్లు
- 3 ఆధునిక ఫ్లైఓవర్లు
- ఓవర్పాస్-కమ్-రైల్వే ఓవర్బ్రిడ్జ్ (ROB)
సీఎం చంద్రబాబు హర్షం…
కీలకమైన ఈ ప్రాజెక్టుకు ఆమోదం తెలపటంపై రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. కేంద్రమంత్రి గడ్కరీకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రాభివృద్ధిలో గ్రీన్ ఫీల్డ్ పోర్టుల కనెక్టివిటీపై దృష్టి పెట్టడంపై చాలా సంతోషంగా ఉందని చెప్పారు. మచిలీపట్నం పోర్టుకు కనెక్టివిటీ ప్రాజెక్ట్…. లోతట్టు ప్రాంతాలను పోర్టుకు అనుసంధానించడం సులభమవుతుందన్నారు. లాజిస్టిక్స్ ఖర్చును తగ్గించడంలో కీలకం అవుతుందని అభిప్రాయపడ్డారు. ఆంధ్రప్రదేశ్లో జాతీయ రహదారులను త్వరగా పూర్తి చేయడానికి రాష్ట్రప్రభుత్వం తరపున అన్ని రకాలుగా మద్దతుగా నిలుస్తామని ట్వీట్ చేశారు.
ఈ భారీ రోడ్డుకు నిధులు మంజూరుపై నితిన్ గడ్కరీకి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ధన్యవాదాలు తెలిపారు. మచిలీపట్నం పోర్టును జాతీయ రహదారితో కనెక్ట్ చేసేందుకు 6 లైన్ల రోడ్డు నిర్మించడం మంచి పరిణామమన్నారు. మంత్రి నారా లోకేష్ కూడా గడ్కరీకి ధన్యవాదాలు చెబుతూ ట్వీట్ చేశారు. “ఏపీ మౌలిక సదుపాయాలు, ఓడరేవు ఆధారిత వృద్ధికి మద్దతు ఇచ్చినందుకు ధన్యవాదాలు. మచిలీపట్నం పోర్టుకు ఈ 6-లేన్ల బాహ్య కనెక్టివిటీ రహదారి లాజిస్టిక్స్ సామర్థ్యాన్ని పెంచడంలో, రాష్ట్రానికి కొత్త ఆర్థిక అవకాశాలను తెరవడంలో మద్దతుగా నిలుస్తుంది" అని ట్వీట్ చేశారు. బీజేపీ ఎంపీ పురందేశ్వరి కూడా కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు.

E-Paper












