అమరావతిలో క్వాంటం వ్యాలీ భవన నిర్మాణానికి పునాది రాయి పడింది. కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ మంత్రి జితేంద్ర సింగ్తో కలిసి సీఎం చంద్రబాబు భవన నిర్మాణానికి శనివారం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ , రాష్ట్ర మంత్రులు నారా లోకేష్ , కందుల దుర్గేష్ , నారాయణతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఇదొక చారిత్రాత్మక రోజు - సీఎం చంద్రబాబు

ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ…. అమరావతి, ఆంధ్రప్రదేశ్తో పాటు భారత్కు కూడా ఇదొక చారిత్రాత్మక దినమన్నారు. ఐక్య రాజ్యసమితి కూడా ఈ ఏడాదిని ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ క్వాంటం సైన్స్ అండ్ టెక్నాలజీగా ప్రకటించిందని గుర్తు చేశారు. ఇది క్వాంటం ట్రాన్సిషన్ మూమెంట్ గా నిలిచిపోతుందని భావిస్తున్నానని చెప్పారు.
“ గతంలో వచ్చిన వ్యవసాయ, పారిశ్రామిక విప్లవాన్ని భారత్ అందిపుచ్చు కోలేకపోయింది. కానీ ఐటీ విప్లవంలో మనం ముందడుగు వేశాం. గతంలో హైదరాబాద్ లో ఐటీకి ప్రాధాన్యత ఇచ్చి హైటెక్ సిటీ ప్రారంభించాం. అది ఓ గేమ్ చేంజర్ గా మారి ఫలితాలను ఇస్తోంది. హైటెక్ సిటీ తరహాలోనే క్వాంటం టెక్నాలజీకి కేంద్రంగా అమరావతిని మారుస్తాం. భారత్ లో ఏర్పాటు చేస్తున్న తొలి అమరావతి క్వాంటం వ్యాలీని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ప్రారంభించారు. ఇది కూడా ఓ విప్లవంగా మారుతుంది” అని సీఎం చంద్రబాబు అభిప్రాయపడ్డారు.
క్వాంటం వ్యాలీ, గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీలకు కేంద్రంగా ఏపీ మారుతుందని సీఎం చంద్రబాబు అన్నారు. “ క్వాంటం డిజైన్స్, క్వాంటం ఉత్పత్తులు, ఇంటలెక్చువల్ ప్రాపర్టీస్కు అమరావతి కేంద్రం అవుతుంది. డిఫెన్స్, హెల్త్ కేర్, ఎనర్జీ , ఫైనాన్స్, క్లైమాట్ మోడలింగ్ కు అమరావతి క్వాంటం వ్యాలీలో పరిశోధనలు, ఆవిష్కరణలు జరుగుతాయి. ఇప్పటి వరకూ అంతా అమెరికాలోని సిలికాన్ వ్యాలీ గురించి మాట్లాడేవారు..ఇక నుంచి అమరావతిలోని క్వాంటం వ్యాలీ గురించి మాట్లాడుకుంటారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ల్యాండ్ పూలింగ్ విధానం ద్వారా రాజధాని నిర్మాణం చేస్తున్నాం దీనికి ఇక్కడున్న రైతులే ప్రధాన భాగస్వాములు. గ్రీన్ ఫీల్డ్ క్యాపిటల్ గా అమరావతి తయారవుతుంది. ప్రపంచశ్రేణి క్వాంటం టెక్నాలజీ నగరంగా అమరావతి మారుతుంది”అని ధీమా వ్యక్తం చేశారు.