శ్రీ వేంకటేశ్వరస్వామి వారు తన దేవేరులతో కలిసి పాల్గొనే కలహ శృంగార భరితమైన ప్రణయ కలహోత్సవం జనవరి 4వ తేదీ తిరుమలలో జరుగనుంది. ఏటా వైకుంఠ ఏకాదశి ముగిసిన ఆరు రోజుల తర్వాత శ్రీవారి ప్రణయకలహోత్సవం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. అందులో భాగంగా ఈ ఉత్సవాన్ని వైభవంగా నిర్వహించేందుకు టీటీడీ అన్ని ఏర్పాట్లు చేసింది.

ఈ ఉత్సవాన్ని పురస్కరించుకొని సాయంత్రం 4 గంటలకు స్వామివారు, అమ్మవార్ల ఉత్సవమూర్తులు బంగారు పల్లకీలపై వేరువేరుగా వైభవోత్సవ మండపం నుండి ఊరేగింపుగా బయలుదేరి శ్రీ వరాహస్వామి ఆలయం వద్ద ఒకరికొకరు ఎదురేగుతారు.
ఇక్కడ అర్చకులు స్వామి, అమ్మవార్ల తరఫున వేరువేరుగా ఆళ్వారు దివ్యప్రబంధంలోని పాశురాలను స్తుతిస్తారు. ఆ తరువాత అమ్మవార్లు స్వామివారిని నిందాస్తుతి చేసిన అనంతరం ఒకరిపై ఒకరు పూల బంతులను విసరడం, స్వామివారు పుష్పఘాతం నుండి తప్పించుకోవడం వంటి ఆసక్తికరమైన సన్నివేశాలతో చాలా ప్రత్యేకంగా ఈ ప్రణయకలహ మహోత్సవం నిర్వహిస్తారు. ఈ వేడుకను చూసేందుకు భక్తులు ఎక్కువ సంఖ్యలోనే తరలివస్తుంటారు.
గరుడ వాహనంపై శ్రీ గోవిందరాజస్వామి:
తిరుపతి శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయంలో పౌర్ణమి సందర్భంగా శనివారం రాత్రి 7 గంటలకు గరుడ వాహన సేవ ప్రారంభమైంది. సర్వాలంకార భూషితుడైన గోవిందుడు గరుడునిపై ఆలయ మాడ వీధుల్లో విహరించి భక్తులను కటాక్షించారు. భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.
మరోవైపు శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో శనివారం రాత్రి గరుడసేవ అత్యంత వైభవంగా జరిగింది.
పౌరాణిక నేపథ్యంలో 108 వైష్ణవ దివ్యదేశాలలోనూ గరుడసేవ అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది. గరుడవాహనం ద్వారా స్వామివారు దాసానుదాస ప్రపత్తికి తాను దాసుడని తెలియజేస్తున్నారు . జ్ఞానవైరాగ్య ప్రాప్తికోరే మానవులు జ్ఞానవైరాగ్య రూపాలైన రెక్కలతో విహరించే గరుడుని దర్శిస్తే సర్వపాపాలు తొలగుతాయని భక్తకోటికి తెలియజేస్తారు.