ఒంటిమిట్ట వార్షిక బ్రహ్మోత్సవాలు : మోహిని అలంకారంలో పల్లకిపై విహరించిన కోదండరాముడు

Vontimitta annual Brahmotsavams : ఒంటిమిట్ట కోదండరాముడి వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. స్వామివారు మోహిని అలంకారంలో పల్లకిపై విహరించారు.

Published on: Mar 31, 2026, 12:43:45 IST
By , Vontimitta
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదో రోజు మంగళవారం ఉదయం స్వామివారు మోహిని అలంకారంలో పల్లకిపై ఊరేగుతూ భక్తులకు కనువిందు చేశారు. ఉదయం 8 నుండి 10 గంటల వరకు ఈ వాహనసేవ భక్తి భావంతో వైభవంగా జరిగింది. భజన బృందాల హారతులు, కోలాటాల మధ్య స్వామివారు నాలుగు మాడవీధుల్లో విహరించారు. భక్తులు అడుగడుగునా కర్పూర నీరాజనాలు సమర్పిస్తూ స్వామివారిని దర్శించుకున్నారు.

ఒంటిమిట్ట వార్షిక బ్రహ్మోత్సవాలు
ఒంటిమిట్ట వార్షిక బ్రహ్మోత్సవాలు

'మోహిని అవతార వృత్తాంతం భాగవతంలో ఎంతో రమణీయంగా వర్ణించారు. సురాసురులు అమృతం కోసం క్షీరసాగరాన్ని మథిస్తారు. చివరికి అమృతం లభించినప్పుడు దానిని పంచుకునే విషయంలో కలహం చెలరేగుతుంది. ఆ కలహాన్ని నివారించి అసురులను మోహింపజేసి దేవతలకు అమృతాన్ని అందించేందుకు శ్రీహరి మోహిని రూపంలో అవతరించారు. తన భక్తులు కానివారు మాయకు లోనవుతారని, భక్తులు మాత్రం ఆ మాయను సులభంగా అధిగమించగలరని ఈ మోహిని రూపం ద్వారా స్వామివారు సూచిస్తున్నారని పురాణాలు తెలియజేస్తున్నాయి.' అని టీటీడీ ప్రకటనలో తెలిపింది.

వాహనసేవ అనంతరం ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు స్నపన తిరుమంజనం వేడుకగా నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనం, కొబ్బరి నీటితో సీతా లక్ష్మణ సమేత శ్రీ కోదండరాములవారి ఉత్సవమూర్తులకు అభిషేకం నిర్వహించారు. రాత్రి 7 గంటల నుండి 8.30 గంటల వరకు అత్యంత వైభవంగా గరుడసేవ ఉంటుంది.

ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవో ప్రశాంతి, సూపరింటెండెంట్ హనుమంతయ్య, టెంపుల్ ఇన్స్పెక్టర్ నవీన్, ఆలయ అర్చకులు పాల్గొన్నారు.

హనుమంత వాహన సేవ

ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా రాత్రి విశేషమైన హనుమంత వాహన సేవ వైభవంగా జరిగింది. శ్రీ సీతారామలక్ష్మణులు తమ ప్రియ భక్తుడైన హనుమంతుని వాహనాన్ని అధిరోహించి పురవీధుల్లో భక్తులకు దర్శనమిచ్చారు. రాత్రి 7 గంటల నుంచి కేరళం డ్రమ్స్‌, భక్తజన బృందాల చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తూ, మంగళ వాయిద్యాల నడుమ వాహనసేవ ఘనంగా కొనసాగింది. భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించి భక్తిశ్రద్ధలతో స్వామివారిని దర్శించుకున్నారు.

త్రేతాయుగంలో రామభక్తునిగా, భగవద్భక్తులలో అగ్రగణ్యుడిగా ప్రసిద్ధిగాంచిన హనుమంతుడు దాసభక్తికి ప్రతీకగా నిలిచారు. రాముడు హనుమంతునికి ఆత్మతత్వాన్ని బోధించినట్లు ప్రాచీన వాఙ్మయం ద్వారా తెలుస్తోంది. భక్తులకు ఆత్మోన్నతిని ప్రసాదించే హనుమంతుని సేవాభావాన్ని స్మరించుకుంటూ స్వామివారు హనుమంత వాహనంపై ఊరేగారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More