ఆంధ్రప్రదేశ్లో రాగల మూడు రోజుల్లో వాతావరణంలో కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో జూన్ 6వ తేదీ వరకు అక్కడక్కడా తేలికపాటి వర్షాలు, ఉరుములు, మెరుపులతో కూడిన పిడుగులు పడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం (IMD) హెచ్చరించింది.

తూర్పు మధ్యప్రదేశ్, దానికి ఆనుకుని ఉన్న ఛత్తీస్గఢ్ ప్రాంతాల్లో ఏర్పడిన ఆవర్తనం నుండి విదర్భ, తెలంగాణ, రాయలసీమ మీదుగా ఈశాన్య తమిళనాడు వరకు సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఒక ద్రోణి కొనసాగుతోంది. ఈ ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అధికారులు వెల్లడించారు.
ప్రస్తుత వాతావరణ పరిస్థితుల వల్ల రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉంది. గుంటూరు, బాపట్ల, పల్నాడు, మార్కాపురం, కర్నూలు, అనంతపురం, శ్రీ సత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతిలో వర్షాలు పడే అవకాశం ఉంది.
వీటితో పాటు రాష్ట్రంలోని మధ్య, ఉత్తర ప్రాంతాల్లోని ఒకటి రెండు చోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.
డైరెక్టరేట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ నివేదిక ప్రకారం.. మంగళవారం ఉదయం 8.30 నుండి సాయంత్రం 6 గంటల మధ్య పార్వతీపురం మన్యం జిల్లాలోని సీతంపేటలో రాష్ట్రంలోనే అత్యధికంగా 27.5 మి.మీ వర్షపాతం నమోదైంది. ప్రకాశం, అనకాపల్లి, అన్నమయ్య, విశాఖపట్నం, కాకినాడ, ఏలూరు జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిశాయి.
రాష్ట్రంలో కొన్నిచోట్ల వర్షాలు కురుస్తున్నప్పటికీ, మెజారిటీ ప్రాంతాల్లో ఎండ తీవ్రత తగ్గలేదు. ప్రజలు తీవ్రమైన ఉక్కపోత, ఎండదెబ్బతో అల్లాడిపోతున్నారు. మంగళవారం నెల్లూరు జిల్లా గూడూరులో అత్యధికంగా 45.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.
{{/usCountry}}రాష్ట్రంలో కొన్నిచోట్ల వర్షాలు కురుస్తున్నప్పటికీ, మెజారిటీ ప్రాంతాల్లో ఎండ తీవ్రత తగ్గలేదు. ప్రజలు తీవ్రమైన ఉక్కపోత, ఎండదెబ్బతో అల్లాడిపోతున్నారు. మంగళవారం నెల్లూరు జిల్లా గూడూరులో అత్యధికంగా 45.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.
{{/usCountry}}ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ ప్రకారం.. మంగళవారం 43 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువ ఉష్ణోగ్రత నమోదైన ప్రాంతాల వివరాలు:
- పిడుగురాళ్ల (పల్నాడు జిల్లా) – 44.9 డిగ్రీలు
- కొండపి (ప్రకాశం జిల్లా) – 44.6 డిగ్రీలు
- ఇంకొల్లు (బాపట్ల జిల్లా) – 43.5 డిగ్రీలు
- బోనుపల్లె (తిరుపతి జిల్లా) – 43.4 డిగ్రీలు
- కంబం (మార్కాపురం జిల్లా) – 43.3 డిగ్రీలు
- తొర్రగుడిపాడు (ఎన్టీఆర్ జిల్లా) – 43.3 డిగ్రీలు
ఎండ తీవ్రతతో ఇబ్బంది పడుతున్న ఏపీ ప్రజలకు వాతావరణ శాఖ ఒక తీపి కబురు అందించింది. వారం రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా గరిష్ట ఉష్ణోగ్రతలు 2 నుండి 3 డిగ్రీల సెల్సియస్ వరకు తగ్గే అవకాశం ఉందని ఐఎండీ స్పష్టం చేసింది. అయితే వర్షాలు పడే సమయంలో పిడుగులు పడే ప్రమాదం ఉన్నందున రైతులు, గొర్రెల కాపరులు, ప్రజలు చెట్ల కింద ఉండరాదని, సురక్షిత ప్రాంతాల్లో ఆశ్రయం పొందాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.