‘హలో ఇండియా.. ఏపీలోని అరటి రైతుల కష్టాలు చూడండి’ - వైఎస్ జగన్
కూటమి ప్రభుత్వంపై వైఎస్ జగన్ ఫైర్ అయ్యారు. గిట్టుబాటు ధరలేక అరటి రైతుల తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ‘హలో ఇండియా, ఆంధ్రప్రదేశ్ వైపు ఒక్కసారి చూడండి’ అంటూ కొన్ని ఫొటోలను పోస్ట్ చేశారు.
అరటి రైతుల సమస్యలపై వైఎస్ జగన్ స్పందిస్తూ… కూటమి ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గిట్టుబాట ధరలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. 'హలో ఇండియా, ఆంధ్రప్రదేశ్ వైపు ఒక్కసారి చూడండి! ఒక కిలో అరటిపండ్లు కేవలం 50 పైసలు మాత్రమే" అంటూ ఓ పోస్ట్ కూడా చేశారు.

కూటమి ప్రభుత్వ పాలనలో విపత్తుల సమయంలో ఉచిత పంట బీమా లేదని… ఇన్పుట్ సబ్సిడీలు కూడా లేవని విమర్శించారు. పెట్టుబడి సహాయం కింద చేసిన హామీలు.. ఇవన్నీకూడా మోసాలేనని నిర్ధారణ అయ్యిందని దుయ్యబట్టారు.నెలల తరబడి కష్టపడి సాగు చేసే రైతులకు ఇలాంటి ధర రావడం కన్నీళ్లు తెప్పించే పరిస్థితులకు దారి తీసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు కొన్ని ఫొటోలను వైఎస్ జగన్ తన పోస్టుకు జత చేశారు.
ఏ రైతులకు గిట్టుబాటు ధర లేదు - వైఎస్ జగన్
"హలో ఇండియా, ఆంధ్రప్రదేశ్ వైపు ఒక్కసారి చూడండి! ఒక కిలో అరటిపండ్లు కేవలం 50 పైసలు మాత్రమే! అవును, మీరు విన్నది నిజమే. ఆంధ్రప్రదేశ్లో అరటి రైతులు పడుతున్న కష్టాలు ఇవి. ఒక అగ్గిపెట్టెకన్నా, ఒక్క బిస్కెట్ కన్నా చవక. లక్షల రూపాయలు పెట్టి, నెలల తరబడి కష్టపడి సాగు చేసే రైతులకు ఇలాంటి ధర రావడం కన్నీళ్లు తెప్పించే విషయమే.
అరటి మాత్రమే కాదు ఉల్లి నుంచి టమోటా వరకూ… ఇలా ఏ పంటకూ గిట్టుబాటు ధర లేదు. రైతులకు తగిలిన అతిపెద్ద దెబ్బ ఇది. విపత్తుల సమయంలో ఉచిత పంట బీమా లేదు, ఇన్పుట్ సబ్సిడీలు లేవు. పెట్టుబడి సహాయం కింద చేసిన హామీలు.. ఇవన్నీకూడా మోసాలేనని నిర్ధారణ అయ్యింది.
మా పాలనలో, టన్ను అరటికి సగటున రూ. 25,000 ధర లభించింది. రేట్లు తగ్గిపోయిన పక్షంలో రైతులు నష్టపోకుండా ప్రత్యేక రైళ్లు నేరుగా ఆంధ్రప్రదేశ్ నుంచి ఢిల్లీ వరకు నడిపించాం. అంతేకాకుండా రాష్ట్రవ్యాప్తంగా కోల్డ్ స్టోరేజ్లు నిర్మించాం. దీనివల్ల లక్షలాది రైతుల కుటుంబాలను ఆదుకున్నాం. కానీ నేడు, వ్యవసాయం కూలిపోతుంటే… రైతులు నష్టాల్లో మునిగిపోతుంటే సీఎం చంద్రబాబు చోద్యం చూస్తున్నారు. కిలో ఆహారం 50 పైసలైతే… ఆ ఆహారాన్ని పండించే రైతుల శ్రమకు కట్టే విలువ ఎంత..?" అని వైఎస్ జగన్ తన పోస్టులో ప్రస్తావించారు.













