'చంద్రబాబు గారూ… మీ క్రెడిట్ చోరీ స్కీమ్ చాలా బాగుంది' - ఇళ్ల నిర్మాణాలపై జగన్ ప్రశ్నలు
సీఎం చంద్రబాబుపై వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ విమర్శలు గుప్పించారు. వైసీపీ హయాంలోనే నిర్మాణంలో ఉన్నవాటిని పట్టుకుని తామే కట్టేశామని చెప్పటం దారుణమన్నారు. “చంద్రబాబ గారు మీ క్రెడిట్ చోరీ స్కీం చాలా బాగుంది” అంటూ జగన్ ఎద్దేవా చేశారు.
ఇళ్ల నిర్మాణంలో కూటమి ప్రభుత్వం చేసిందేమీ లేదంటూ వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ విమర్శలు గుప్పించారు. వైసీపీ హయంలోనే ఇళ్ల స్థలాలు ఇవ్వటంతో పాటు నిర్మాణాలు కూడా చేపట్టామని గుర్తించారు. కానీ సీఎం చంద్రబాబు… వారి ఖాతాలో వేసుకుంటా కథ, స్క్రీన్, ప్లే, దర్శకత్వం విజయవంతంగా నడిపిస్తున్నారని దుయ్యబట్టారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసిన జగన్… సీఎం చంద్రబాబుకు పలు ప్రశ్నలు సంధించారు.

మీ క్రెడిట్ చోరీ స్కీమ్ బాగుంది - జగన్ విమర్శలు
“చంద్రబాబు గారూ…. మీ కథ, స్క్రీన్, ప్లే, దర్శకత్వంలో విజయవంతంగా నడుస్తున్న “క్రెడిట్ చోరీ స్కీం’’ చాలా బాగుంది. పేదలకు ఇళ్లస్థలాలు ఇవ్వడానికి ఈ 18 నెలల కాలంలో ఒక్క గజం స్థలం కూడా సేకరించలేదు. ఒక్కరికి ఒక్క సెంటు స్థలం కూడా ఇవ్వలేదు. ఒక్కపైసా కూడా ఖర్చుచేయకుండా గత ప్రభుత్వం హయాంలోనే ఇచ్చిన ఇంటి స్థలాల్లోనే నిర్మించిన వాటిని పట్టుకొని“ఇళ్లన్నీ మేమే కట్టేశాం” అంటూ పచ్చి అబద్ధాలను కళ్లార్పకుండా చెబుతున్నారు. ఇతరుల కష్టాన్ని తన గొప్పతనంగా చెప్పుకునేవాడు నాయకుడు కాదు, నాటకాల రాయుడు అంటారు” అంటూ జగన్ విమర్శనాస్త్రాలను సంధించారు.
“మీరు ప్రారంభించామని చెప్పుకుంటున్న 3,00,092 ఇళ్లలో ఒక్క ఇంటి పట్టా కూడా మీరు ఇవ్వలేదు. ఒక్క ఇల్లు కూడా మంజూరు చేయించలేదు. ఆ 3,00,092 ఇళ్లలో 1,40,010 ఇళ్లు మా హయాంలోనే పూర్తయ్యే దశలో ఉన్నవే. మరో 87,380 ఇళ్లు శ్లాబ్ లెవల్ వరకూ మా హయాంలోనే కట్టించినవే. శ్లాబ్ కంటే కింద స్థాయిలో మరో 66,845 ఇళ్లు మా హయాంలో నిర్మాణంలో ఉన్నవే” అని వైఎస్ జగన్ వివరించారు.
మీ స్కీం చాలా హేయం - జగన్
“ఇవే కాకుండా అక్టోబరు 12, 2023న ఒకేసారి 7,43,396 ఇళ్లలో ఒకేరోజు గృహ ప్రవేశాలతో మా ప్రభుత్వం చరిత్ర సృష్టించింది. ఇన్ని వాస్తవాలు కళ్ళముందే ఉన్నా… అసలు వైయస్సార్సీపీ ప్రభుత్వం ఏమీ చేయనట్టుగా…. మీరే అన్నీ చేసినట్టుగా పచ్చి అబద్ధాలను ప్రచారం చేస్తున్న మీ స్కీం చాలా హేయం” అని జగన్ తన ప్రకటనలో పేర్కొన్నారు.
“మా హయాంలో 71.8 వేల ఎకరాల్లో 31.19 లక్షల ఇళ్ల పట్టాలను అక్కచెల్లెమ్మలకు ఇచ్చాం. వారి పేరు మీదే రిజిస్ట్రేషన్ చేయించాం. 21.75 లక్షల ఇళ్లను శాంక్షన్ చేయించి…కోవిడ్లాంటి మహమ్మారి ద్వారా తలెత్తిన సంక్షోభాన్ని ఎదుర్కొంటూ 9 లక్షలకుపైగా ఇళ్లను మా హయాంలోనే పూర్తి చేశాం. అన్నీ మీరే చేశారన్నట్టుగా మీరు చెప్పడమే కాకుండా… మీ ఎల్లోమీడియా ద్వారా ప్రచారం చేయించుకుని, ఆ క్రెడిట్ కొట్టేయాలనుకుంటున్న మీ స్కీం చాలా హేయం” అని జగన్ అన్నారు.
“చంద్రబాబు గారు… మేము 31.19 లక్షల ఇళ్ల పట్టాలను ఇచ్చి అందులో 21.75 లక్షల ఇళ్లు శాంక్షన్ చేయించి కట్టడం మొదలుపెట్టాం. మిగిలిన ఆ 10 లక్షల ఇళ్ల స్థలాల్లో పేదలకు ఇళ్లు కట్టించి ఇచ్చే కార్యక్రమానికి పూనుకోలేదు. పైగా ఆ ఖాళీ స్థలాలను లాక్కునే కార్యక్రమం చేస్తున్న మీరు సిగ్గుతో తలదించుకోవాల్సింది పోయి… నిస్సిగ్గుగా క్రెడిట్ చోరీకి పాల్పడ్డం అత్యంత హేయం” అంటూ జగన్ ఎద్దేవా చేశారు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

