మా విడాకుల పుకార్లు నా కూతురు ఆరాధ్యకు తెలియదు.. ఆమెకు ఫోన్ కూడా లేదు.. గూగుల్లో సెర్చ్ చేయదు: అభిషేక్ బచ్చన్ కామెంట్స్
అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్ విడాకులు అంటూ అప్పట్లో పెద్ద ఎత్తున పుకార్లు వచ్చిన విషయం తెలుసు కదా. వీటి గురించి తమ కూతురు ఆరాధ్యకు తెలియదని, ఆమెకు కనీసం మొబైల్ కూడా లేదని అభిషేక్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు.
బాలీవుడ్ స్టార్ కపుల్ అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్ విడిపోతున్నారనే వార్తలు గత కొంతకాలంగా ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారాయి. సోషల్ మీడియాలో దీనిపై రకరకాల చర్చలు జరుగుతున్నాయి. అయితే ఈ గొడవలన్నీ తమ కూతురు ఆరాధ్య బచ్చన్ దృష్టికి వెళ్లాయా? ఆమె వీటిని ఎలా చూస్తోంది? అనే ప్రశ్నలకు అభిషేక్ బచ్చన్ తాజాగా 'పీపింగ్ మూన్' ఇంటర్వ్యూలో సమాధానమిచ్చాడు.

ఆరాధ్యకు ఫోన్ లేదు.. రూమర్స్ తెలియవు
అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్ విడాకుల పుకార్లు ఇప్పటివి కావు. గత రెండేళ్లుగా వార్తల్లో ఉంటూ వస్తున్నాయి. వీటిపైనే తాజాగా మరోసారి అభిషేక్ స్పందించాడు. మీ విడాకుల వార్తల గురించి ఆరాధ్యకు తెలుసా అని అడిగినప్పుడు.. అభిషేక్ ఆసక్తికరమైన విషయాలు చెప్పాడు.
"ఆమెకు ఆ వార్తలు తెలియవని అనుకుంటున్నాను. ఆరాధ్య చాలా మెచ్యూర్డ్ అమ్మాయి. ఐశ్వర్య ఆమెను చాలా అద్భుతంగా పెంచింది. ఆరాధ్యకు ఈ విషయాలపై ఆసక్తి ఉంటుందని నేను అనుకోను. అసలు విషయం ఏంటంటే.. ఆమెకు ఇంకా సొంత మొబైల్ లేదు. ఆమె వయసు ఇప్పుడు 14 ఏళ్లు. ఆమె ఫ్రెండ్స్ ఎవరైనా మాట్లాడాలంటే, ఐశ్వర్య ఫోన్కే కాల్ చేయాలి. ఈ నిర్ణయాన్ని మేము చాలా కాలం క్రితమే తీసుకున్నాం" అని అభిషేక్ వివరించాడు.
హోం వర్క్ తప్ప గూగుల్ చేయదు
ఆరాధ్యకు ఇంటర్నెట్ యాక్సెస్ ఉన్నప్పటికీ, ఆమె తన తల్లిదండ్రుల గురించి గూగుల్లో వెతకదని అభిషేక్ నమ్మకంగా చెప్పాడు. "ఆమెకు స్కూల్ అంటే ఇష్టం. ఎక్కువ సమయం హోం వర్క్ మీద, చదువు మీదే పెడుతుంది. చదివిన ప్రతిదీ నమ్మకూడదని ఐశ్వర్య ఆమెకు బాగా నేర్పింది. మా ఇంట్లో అందరం ఒకరితో ఒకరు నిజాయితీగా ఉంటాం. కాబట్టి ఎవరూ ఎవరినీ ప్రశ్నించాల్సిన అవసరం రాదు" అని అభిషేక్ స్పష్టం చేశాడు.
విడాకుల వార్తలను అభిషేక్ "చెత్త, విషపూరితమైనవి" అని కొట్టిపారేశాడు. జనం కల్పిత కథలు అల్లుతున్నారని మండిపడ్డాడు. ఇటీవల రెడ్ సీ ఫిల్మ్ ఫెస్టివల్లో ఐశ్వర్య కూడా మాట్లాడుతూ.. ఆరాధ్య సోషల్ మీడియాలో లేదని స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.
అభిషేక్, ఐశ్వర్య గురించి..
2006-07లో 'ఉమ్రావ్ జాన్', 'గురు' సినిమాల సమయంలో ప్రేమలో పడ్డ అభిషేక్, ఐశ్వర్య 2007లో పెళ్లి చేసుకున్నారు. 2011లో ఆరాధ్య పుట్టింది. అయితే ఈ ఏడాది అంబానీ ఇంట జరిగిన పెళ్లి వేడుకకు బచ్చన్ ఫ్యామిలీ మొత్తం ఒకవైపు, ఐశ్వర్య-ఆరాధ్య విడిగా మరోవైపు రావడంతో విడాకుల వార్తలు గుప్పుమన్నాయి.
ఐశ్వర్య చివరగా మణిరత్నం 'పొన్నియిన్ సెల్వన్'లో నందినిగా మెప్పించింది. అభిషేక్ ఈ ఏడాది 'బీ హ్యాపీ', 'హౌస్ఫుల్ 5' చిత్రాల్లో నటించాడు. త్వరలో షారుఖ్ ఖాన్ సినిమా ‘కింగ్’లో కనిపించనున్నాడు.














