తిరుమల శ్రీవారికి రూ.100 కోట్ల విలువైన ఆస్తి ఇచ్చేసిన అలనాటి నటి.. ఎయిర్ హోస్టెస్ నుంచి స్టార్ హీరోయిన్గా ఎదిగి..
అలనాటి తెలుగు నటి కాంచన తిరుమల శ్రీవారి పట్ల తనకున్న భక్తిని చాటుకుంది. చెన్నైలో తనకు వారసత్వంగా వచ్చిన రూ.100 కోట్ల విలువైన భూమిని తిరుమల తిరుపతి దేవస్థానానికి విరాళంగా ఇవ్వడం విశేషం.
తెలుగు హీరోయిన్ కాంచన తెలుసా? కొన్ని దశాబ్దాల కిందట తెలుగు, తమిళ స్టార్ హీరోల సరసన నటించి గుర్తింపు తెచ్చుకుంది. ఆ మధ్య అర్జున్ రెడ్డి మూవీలో నటించింది. ఇక ఇప్పుడు ప్రభాస్ స్పిరిట్ మూవీలోనూ నటించనుంది. ఆమె ఇప్పుడు 86 ఏళ్ల వయసులో తన ఉదారతను చాటుకుంది. ఏకంగా రూ.100 కోట్ల విలువైన ఆస్తిని తిరుమల శ్రీవారి ఆలయానికి రాసిచ్చేసింది.

కాంచన విరాళం
వసుంధర దేవిగా 1939లో చెన్నైలో జన్మించిన నటి కాంచన. మొదట ఎయిర్ హోస్టెస్ అయిన ఆమె తర్వాత సినిమాల్లోకి వచ్చింది. చాలా రోజులుగా ఎవరి కంటా పడని ఆమె.. ఇప్పుడు టీటీడీకి భూరి విరాళంతో వార్తల్లో నిలిచింది. ఆమె తిరుమల తిరుపతి దేవస్థానానికి (TTD) ఏకంగా రూ. 100 కోట్ల విలువైన ఆస్తిని విరాళంగా రాసిచ్చింది. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిపై ఆమెకున్న అచంచలమైన భక్తే ఇందుకు కారణం. ఆ స్వామి సేవ కోసమే ఆమె పెళ్లి కూడా చేసుకోకుండా, ఆధ్యాత్మిక జీవనాన్ని గడుపుతోంది.
న్యాయ పోరాటం చేసి మరీ..
కాంచన, ఆమె సోదరి గిరిజా పాండేలకు చెన్నైలోని టీ నగర్, జీఎన్ చెట్టి రోడ్డులో అత్యంత విలువైన స్థలం వారసత్వంగా వచ్చింది. అయితే బంధువులు ఆ ఆస్తిని లాక్కోవడానికి ప్రయత్నించడంతో ఆమె సుదీర్ఘ న్యాయ పోరాటం చేయాల్సి వచ్చింది. ఆస్తి దక్కితే దేవుడికే ఇస్తానని మొక్కుకుంది. కోర్టులో గెలిచిన వెంటనే తన మాట తప్పకుండా ఆ స్థలాన్ని స్వామివారికి రాసిచ్చేసింది. అక్కడ వెంకటేశ్వర స్వామి, పద్మావతి అమ్మవార్ల ఆలయ నిర్మాణం కోసం ఈ ఆస్తిని టీటీడీకి అప్పగించింది. ప్రస్తుతం ఈ ఆస్తి విలువ రూ. 80 కోట్ల నుంచి 100 కోట్ల వరకు ఉంటుందని అంచనా.
ఎయిర్ హోస్టెస్ హీరోయిన్ వరకు..
సినిమాల్లోకి రాకముందు కాంచన ఎయిర్ హోస్టెస్ గా పనిచేసింది. ప్రముఖ దర్శకుడు సి.వి. శ్రీధర్ ఆమెను చూసి 'కాదలిక్క నేరమిల్లై' (తెలుగులో 'ప్రేమించి చూడు') సినిమాతో వెండితెరకు పరిచయం చేశాడు. ఆ తర్వాత ఆమె వెనుదిరిగి చూసుకోలేదు. 1960, 70లలో టాప్ హీరోయిన్గా వెలుగొందింది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో 200కు పైగా సినిమాల్లో నటించింది.
ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్ బాబు వంటి అగ్ర హీరోలందరి సరసన ఆడిపాడింది. చెన్నైలో ఒక తెలుగు కుటుంబంలో జన్మించిన కాంచన.. జీవితాంతం బ్రహ్మచారిణిగా ఉండిపోవాలని నిర్ణయించుకుంది. ప్రస్తుతం ఆమె తన చెల్లెలితో కలిసి ప్రశాంతమైన, ఆధ్యాత్మిక జీవితాన్ని గడుపుతోంది.














