నెలలో 4 ఫ్లాట్స్ అమ్మేసిన హీరో అక్షయ్ కుమార్, కోట్లల్లో విక్రయం- 92, 38 శాతం లాభాలు- ఆయన ఎప్పుడు, ఎంతకీ కొన్నారంటే?
Akshay Kumar Sells 4 Luxury Apartments: బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ ముంబైలో తనకున్న రెండు విలాసవంతమైన ఫ్లాట్లను రూ. 12.38 కోట్లకు విక్రయించారు. నెల క్రితం మరో రెండు ఫ్లాట్లను అమ్మేశారు. మొత్తం 4 ఫ్లాట్లను అమ్మడంతో 92, 38 శాతం లాభాలు వచ్చాయి. మరి వాటిని ఆయన ఎప్పుడు, ఎంతకీ కొన్నారో లుక్కేద్దాం.
Akshay Kumar Sells 4 Luxury Apartments: రియల్ ఎస్టేట్ పెట్టుబడుల్లో బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్ రూటే వేరు. కేవలం సినిమాలతోనే కాకుండా, రియల్ ఎస్టేట్ రంగంలో సరైన సమయంలో పెట్టుబడులు పెడుతూ ఆయన భారీగా లాభాలు గడిస్తున్నారు.

నగదుగా మార్చుకుంటూ
ముంబైలో లగ్జరీ గృహాలకు విపరీతంగా డిమాండ్ పెరుగుతున్న తరుణంలో, అక్షయ్ కుమార్ తన ఆస్తులను విక్రయించి నగదుగా మార్చుకుంటున్నారు. తాజాగా ముంబైలోని ములుంద్ ప్రాంతంలో ఉన్న తన రెండు విలాసవంతమైన అపార్ట్మెంట్లను భారీ ధరకు విక్రయించి అక్షయ్ కుమార్ మరోసారి వార్తల్లో నిలిచారు.
ములుంద్లో రూ. 12.38 కోట్ల డీల్
ప్రముఖ రియల్ ఎస్టేట్ డేటా అనలిటిక్స్ సంస్థ 'క్రెడిట్ మాట్రిక్స్' (CRE Matrix) సేకరించిన రిజిస్ట్రేషన్ పత్రాల ప్రకారం.. ములుంద్ వెస్ట్లోని ఎల్బీఎస్ రోడ్డులో ఉన్న ఒబెరాయ్ రియాల్టీకి చెందిన ప్రీమియం ప్రాజెక్ట్ 'ఒబెరాయ్ ఎనిగ్మా'లో అక్షయ్కు రెండు ఫ్లాట్లు ఉన్నాయి. పై అంతస్తుల్లో ఉన్న ఈ రెండు ఫ్లాట్లను అక్షయ్ కుమార్ రూ. 12.38 కోట్లకు అమ్మేశారు. ఒక్కో ఫ్లాట్ ధర మార్కెట్లో రూ. 6.19 కోట్లు పలికింది.
ఈ లగ్జరీ అపార్ట్మెంట్లు ఒక్కొక్కటి 1,886 చదరపు అడుగుల కార్పెట్ ఏరియాను కలిగి ఉన్నాయి. వీటితో పాటు ఆరు కార్ పార్కింగ్ స్లాట్లు (ఒక్కో ఫ్లాట్కు మూడు చొప్పున) కూడా ఈ డీల్లో భాగమయ్యాయి. 'సన్నీ హోమ్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్' అనే సంస్థ ఈ రెండు ఫ్లాట్లను కొనుగోలు చేసింది.
ఈ లావాదేవీలకు సంబంధించి కొనుగోలుదారు ఒక్కో ఫ్లాట్కు రూ. 37.14 లక్షల చొప్పున మొత్తం రూ. 74.28 లక్షల స్టాంప్ డ్యూటీ చెల్లించారు. జూన్ 30, 2026న ఈ సేల్ డీడ్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయింది.
తొమ్మిదేళ్లలో 38 శాతం లాభం
అక్షయ్ కుమార్ ఈ ఆస్తులను 2017 అక్టోబర్లో కొనుగోలు చేశారు. అప్పట్లో ఒక్కో ఫ్లాట్ను సుమారు రూ. 4.49 కోట్లకు (రెండు కలిపి రూ. 9 కోట్లు) కొన్నారు. ఇప్పుడు తొమ్మిదేళ్ల తర్వాత ఒక్కో ఫ్లాట్పై దాదాపు రూ. 1.70 కోట్ల అదనపు లాభంతో విక్రయించారు. అంటే ఆయన పెట్టిన పెట్టుబడిపై దాదాపు 38 శాతం లాభం లభించింది.
"ముంబై ప్రైమ్ లొకేషన్లలో సెలబ్రిటీల ప్రాపర్టీలకు ఎప్పుడూ క్రేజ్ ఉంటుంది" అని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. అయితే ఈ అమ్మకంపై అక్షయ్ కుమార్ టీమ్ కానీ, కొనుగోలు చేసిన సంస్థ కానీ అధికారికంగా స్పందించలేదు.
బోరివలిలోనూ కోట్ల విలువైన ఆస్తుల విక్రయం
అక్షయ్ కుమార్ ముంబై రియల్ ఎస్టేట్ మార్కెట్లో చాలా యాక్టివ్గా ఉంటున్నారు. జూన్ 2, 2026న ముంబై బోరివలి ఈస్ట్లోని ఒబెరాయ్ స్కై సిటీలో ఉన్న రెండు అపార్ట్మెంట్లను ఆయన రూ. 7.1 కోట్లకు అమ్మేశారు.
అందులో 1,101 చదరపు అడుగుల కార్పెట్ ఏరియా ఉన్న పెద్ద ఫ్లాట్ను సువర్ణ రూపేష్ కుమార్ సాక్పాల్ అనే మహిళ రూ. 5.75 కోట్లకు కొనుగోలు చేశారు. దీనికి రూ. 28.75 లక్షల స్టాంప్ డ్యూటీ చెల్లించారు. అదే అంతస్తులో ఉన్న మరో 252 చదరపు అడుగుల చిన్న ఫ్లాట్ను రూ. 1.35 కోట్లకు విక్రయించారు.
92 శాతం లాభం
ఈ బోరివలి ఫ్లాట్లను అక్షయ్ 2017 నవంబర్లో కేవలం రూ. 3.69 కోట్లకు కొనుగోలు చేశారు. అంటే కేవలం ఎనిమిదేళ్లలోనే ఈ ఆస్తులపై ఆయనకు ఏకంగా 92 శాతం లాభం రావడం విశేషం. గత ఏడాది కూడా ఇదే బిల్డింగ్లో ఉన్న పక్కపక్క ఫ్లాట్లను విక్రయించి అక్షయ్ కుమార్ భారీగా లాభాలు ఆర్జించారు.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్లో భాగంగా ఈటీవీ భారత్లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్తో సదరు వెబ్సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్టైన్మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


