శ్రీతేజ్కు మరింత సాయం చేసిన అల్లు అర్జున్.. దిల్ రాజుతో కలిసి చిన్నారి తండ్రి వీడియో.. మరో ఆరు నెలలు చికిత్స
సంధ్య థియేటర్ తొక్కిసలాట బాధితుడు చిన్నారి శ్రీతేజ్కు మరింత సాయం చేయడానికి అల్లు అర్జున్ ముందుకు వచ్చినట్లు దిల్ రాజు వెల్లడించాడు. ఆ బాబు తండ్రి భాస్కర్ తో కలిసి ఓ వీడియో రిలీజ్ చేశాడు.
'పుష్ప 2' సినిమా ప్రీమియర్ సందడిలో జరిగిన విషాద ఘటనకు ఏడాది పూర్తయిన వేళ.. బాధితుడి కుటుంబం ఆర్థిక సాయం కోసం ఎదురుచూస్తోందన్న వార్తలు సంచలనం సృష్టించాయి. అల్లు అర్జున్ టీమ్ స్పందించడం లేదని శ్రీతేజ్ తండ్రి భాస్కర్ ఆవేదన వ్యక్తం చేసిన నేపథ్యంలో.. తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ (FDC) ఛైర్మన్, ప్రముఖ నిర్మాత దిల్ రాజు నేరుగా రంగంలోకి దిగాడు. భాస్కర్ను కలిసి పరిస్థితిని చక్కదిద్దాడు.

దిల్ రాజు భేటీ.. లెక్కలన్నీ బయటపెట్టిన టీమ్
గురువారం (డిసెంబర్ 4) నాడు దిల్ రాజు, శ్రీతేజ్ తండ్రి భాస్కర్ను కలిసి మాట్లాడారు. అనంతరం అల్లు అర్జున్ టీమ్ మీడియాతో ఒక వీడియోను పంచుకుంది. ఇందులో ఇప్పటివరకు బాధిత కుటుంబానికి అందిన సాయం వివరాలను స్పష్టంగా వెల్లడించారు.
అల్లు అర్జున్ ఆ కుటుంబానికి ఇప్పటికే మొత్తం రూ. 3.20 కోట్లు సాయం అందించారని టీమ్ తెలిపింది. ఇందులో రూ. 1.5 కోట్లు శ్రీతేజ్ పేరు మీద ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు. "అల్లు అర్జున్ ఇచ్చిన రూ. 2 కోట్లను మేము డిపాజిట్ చేశాం. దానిపై వచ్చే వడ్డీ ద్వారా ఆ కుటుంబానికి ప్రతి నెలా రూ. 75,000 అందుతున్నాయి. వారి జీవన వ్యయాలు, వైద్య ఖర్చుల కోసం ఈ ఏర్పాటు చేశాం" అని దిల్ రాజు వివరించాడు.
బాబు వైద్యం కోసం, భవిష్యత్తు కోసం అదనంగా రూ. 70 లక్షలు కూడా చెల్లించినట్లు తెలిపారు. "శ్రీతేజ్ కోలుకుంటున్నాడు, కానీ అదనపు సాయం కావాలి" అని భాస్కర్ కోరడంతో, తాను వెంటనే అల్లు అరవింద్ తో మాట్లాడి సాయం చేస్తానని దిల్ రాజు హామీ ఇచ్చాడు.
శ్రీతేజ్ తండ్రి భాస్కర్ ఏమన్నారంటే?
అల్లు అర్జున్ టీమ్ స్పందించడం లేదని ఆరోపించిన భాస్కర్.. దిల్ రాజుతో భేటీ తర్వాత ఆందోళన వీడారు. ఆ వీడియోలో ఆయన మాట్లాడుతూ.. ప్రమాదం జరిగినప్పటి నుంచి అల్లు అర్జున్ కుటుంబం తమకు అండగానే ఉందని, అయితే ఇప్పుడు బాబు రీహాబిలిటేషన్ కోసం మరింత సాయం అవసరమైందని చెప్పారు.
"నాకు కావాల్సిన అదనపు సాయం గురించి గత వారం దిల్ రాజు గారికి వివరించాను. నా బిడ్డ పూర్తిగా కోలుకోవడానికి కనీసం ఆరు నెలల రీహాబిలిటేషన్ అవసరం. దానికి అల్లు అర్జున్ గారు ఒప్పుకున్నారు. మొత్తం వైద్య ఖర్చులను పూర్తిగా భరిస్తామని మాటిచ్చారు" అని భాస్కర్ తెలిపారు. దీనికి దిల్ రాజు స్పందిస్తూ, "ఆరు నెలలు కాదు.. సంవత్సరం పట్టినా సరే, మేం మీకు అండగా ఉంటాం" అని భరోసా ఇచ్చారు.
గతేడాది డిసెంబర్ 4న హైదరాబాద్లోని సంధ్యా థియేటర్ వద్ద 'పుష్ప 2' ప్రీమియర్ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో రేవతి మరణించగా, ఆమె ఎనిమిదేళ్ల కొడుకు శ్రీతేజ్ తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటనలో అల్లు అర్జున్పై కేసు నమోదు కాగా అతడు ప్రస్తుతం బెయిల్పై ఉన్నాడు.














