ప్రైమ్ వీడియోలోకి అర్జున్ రెడ్డి భామ నటించిన మ్యూజికల్ వెబ్ సిరీస్.. స్ట్రీమింగ్ డేట్ ఇదే
అర్జున్ రెడ్డి మూవీతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన శాలినీ పాండే నటించిన మరో వెబ్ సిరీస్ రాబోతోంది. అమెజాన్ ప్రైమ్ వీడియోలోకి వస్తున్న ఈ మ్యూజికల్ డ్రామెడీ పేరు బ్యాండ్వాలే. ఆ విశేషాలేంటో చూడండి.
'అర్జున్ రెడ్డి', 'మహారాజ్' సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న శాలిని పాండే, శశి కపూర్ మనవడు జహాన్ కపూర్ జంటగా నటించిన మ్యూజికల్ డ్రామెడీ సిరీస్ 'బ్యాండ్వాలే' (Bandwaale). అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదల కానున్న ఈ సిరీస్ విశేషాలు, స్ట్రీమింగ్ తేదీ వివరాలు ఇక్కడ చూడండి.

బ్యాండ్వాలే వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ డేట్
మ్యూజిక్, కామెడీ, ఎమోషన్ కలగలిపిన జోనర్ 'మ్యూజికల్ డ్రామెడీ'. ఈ జోనర్లో అమెజాన్ ప్రైమ్ వీడియో నుంచి సరికొత్త హిందీ వెబ్ సిరీస్ రాబోతోంది. అదే 'బ్యాండ్వాలే'. ప్రముఖ సంగీతకారుడు, రచయిత స్వనంద్ కిర్కిరే కో క్రియేటర్గా వ్యవహరించిన ఈ వెబ్ సిరీస్ ఫిబ్రవరి 13 నుంచి స్ట్రీమింగ్ కానుంది.
ఈ వెబ్ సిరీస్ లో శాలిని పాండేతోపాటు జహాన్ కపూర్ (శశి కపూర్ మనవడు), స్వనంద్ కిర్కిరే, సంజన దీపు, ఆశిష్ విద్యార్థి, అనుపమ కుమార్ లాంటి వాళ్లు నటించారు. అక్షత్ వర్మ డైరెక్ట్ చేశాడు. సోషల్ మీడియాలో తన రీమిక్స్లతో సంచలనం సృష్టించిన యశరాజ్ ముఖాతే ఈ సిరీస్కు సంగీతం అందించడం విశేషం.
బ్యాండ్వాలే వెబ్ సిరీస్ కథేంటంటే..
మధ్యప్రదేశ్లోని రత్లామ్ నగరం నేపథ్యంలో ఈ కథ సాగుతుంది. మరియం (శాలిని పాండే) అనే యువ కవయిత్రి చుట్టూ ఈ సిరీస్ తిరుగుతుంది. తన భావాలను బయటకు చెప్పలేక, సోషల్ మీడియాలో అజ్ఞాతంగా కవితలు పోస్ట్ చేస్తుంటుంది. ఆమెకు తోడుగా రాబో, డీజే సైకో అనే ఇద్దరు స్నేహితులు (బ్యాండ్ మేట్స్) ఉంటారు. ఈ ముగ్గురి స్నేహం, సంగీతంతోపాటు మరియం తన ఆత్మవిశ్వాసాన్ని ఎలా పొందింది? తన గొంతును ప్రపంచానికి ఎలా వినిపించింది? అనేదే ఈ 8 ఎపిసోడ్ల వెబ్ సిరీస్ కథ.
స్వనంద్ కిర్కిరే ఏమన్నారంటే..
ఈ సిరీస్ గురించి రచయిత, నటుడు స్వనంద్ కిర్కిరే మాట్లాడుతూ.. "మనం నిత్య జీవితంలో చూసే చిన్న చిన్న విషయాలు, భావ వ్యక్తీకరణలో ఉండే సంకోచం నుంచే ఈ కథ పుట్టింది. స్నేహం, సంగీతం మనకు కష్టకాలంలో ఎలా బలాన్నిస్తాయో మరియం ప్రయాణం ద్వారా చూపించాం" అని తెలిపాడు. అంకుర్ తివారీ, స్వనంద్ కిర్కిరే వంటి సంగీత దిగ్గజాలు ఈ ప్రాజెక్టులో భాగం కావడంతో మ్యూజిక్ ఈ సిరీస్కు ప్రాణంగా నిలవనుంది.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్డేట్స్ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


