ఇదో అర్థం లేని సినిమా.. వీడియో గేమ్ గ్రాఫిక్స్.. ఫ్రాంఛైజీలో అత్యంత చెత్త మూవీ ఇదే: అవతార్ 3కి షాకింగ్ రివ్యూలు

అవతార్ ఫైర్ అండ్ యాష్ మూవీకి దారుణమైన రివ్యూలు వస్తున్నాయి. ఇదో అర్థం లేని సినిమా అని, ఫ్రాంఛైజీలో అత్యంత చెత్త మూవీ అని రివ్యూలు ఇస్తుండటం గమనార్హం. వీడియో గేమ్ గ్రాఫిక్స్ తో సినిమా చాలా దారుణంగా ఉందని పలువురు చెప్పారు.

Published on: Dec 17, 2025, 13:46:14 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

జేమ్స్ కామెరాన్ ప్రతిష్టాత్మక మూవీ 'అవతార్: ఫైర్ అండ్ యాష్' (Avatar 3) ఫస్ట్ రివ్యూస్ చాలా నిరాశజనకంగా ఉన్నాయి. ఈ సినిమాకు 'రోటెన్ టొమాటోస్'లో ఈ ఫ్రాంచైజీలోనే అత్యల్ప రేటింగ్ (70%) వచ్చింది. బీబీసీ, గార్డియన్ వంటి అంతర్జాతీయ మీడియా సంస్థలు దీనిని “అర్థం లేని సినిమా”, "వీడియో గేమ్ గ్రాఫిక్స్" అంటూ ఘాటు విమర్శలు చేశాయి. అయితే యాక్షన్ ఎపిసోడ్స్ బాగున్నాయని కొందరు ప్రశంసించారు.

ఇదో అర్థం లేని సినిమా.. వీడియో గేమ్ గ్రాఫిక్స్.. ఫ్రాంఛైజీలో అత్యంత చెత్త మూవీ ఇదే: అవతార్ 3కి షాకింగ్ రివ్యూలు
ఇదో అర్థం లేని సినిమా.. వీడియో గేమ్ గ్రాఫిక్స్.. ఫ్రాంఛైజీలో అత్యంత చెత్త మూవీ ఇదే: అవతార్ 3కి షాకింగ్ రివ్యూలు

అవతార్ 3కి చెత్త రివ్యూస్, రేటింగ్స్

ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రియులు ఎంతగానో ఎదురుచూస్తున్న జేమ్స్ కామెరాన్ విజువల్ వండర్ 'అవతార్: ఫైర్ అండ్ యాష్' ఈ శుక్రవారం (డిసెంబర్ 19) ప్రేక్షకుల ముందుకు రానుంది. కానీ క్రిటిక్స్ నుంచి ఈ సినిమాకు ఊహించని షాక్ తగిలింది. మొదటి రెండు భాగాలతో ('అవతార్', 'అవతార్: ది వే ఆఫ్ వాటర్') పోలిస్తే.. మూడో భాగానికి నెగటివ్ రివ్యూలు ఎక్కువగా వస్తున్నాయి.

రోటెన్ టొమాటోస్‌లో దారుణంగా..

ప్రముఖ రివ్యూ అగ్రిగేటర్ సైట్ 'రోటెన్ టొమాటోస్' (Rotten Tomatoes)లో ఈ సినిమాకు కేవలం 70% స్కోర్ మాత్రమే వచ్చింది. అవతార్ సిరీస్‌లో ఇదే అత్యల్పం. అవతార్ (2009)కి 81%, అవతార్ 2కి (2022) 76%, అవతార్ 3 (2025)కి 70% వచ్చాయి.

“చెత్త సినిమా” అంటూ ఘాటు విమర్శలు

అంతర్జాతీయ మీడియా ఈ సినిమాపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. జేమ్స్ కామెరాన్ విజువల్ వండర్ అంటూ ప్రశంసలు పొందిన అవతార్ ఫ్రాంఛైజీ నుంచి వచ్చిన సినిమాకు ఇలాంటి కామెంట్స్ వస్తుండటం ఆశ్చర్యం కలిగిస్తోంది.

ది గార్డియన్ ఈ సినిమాకు కేవలం 2 స్టార్ రేటింగ్ ఇవ్వడమే కాకుండా.. దీన్నొక "మూడు గంటల నాన్సెన్స్" అని అభివర్ణించింది. "రెండో పార్ట్ లో నీళ్లు చూపించారు, ఇప్పుడు నిప్పు. బహుశా 4, 5 పార్టుల్లో గాలిని, భూమిని చూపిస్తారేమో" అంటూ సెటైర్లు వేసింది.

బీబీసీ అయితే కేవలం 1 స్టార్ రేటింగ్ ఇచ్చింది. ఈ ఫ్రాంచైజీలోనే ఇది "అత్యంత చెత్త సినిమా" అని తేల్చిపారేసింది. "197 నిమిషాల పాటు స్క్రీన్ సేవర్ గ్రాఫిక్స్ చూసినట్లుంది. పాత వీడియో గేమ్ ఆడిన ఫీలింగ్ తప్ప.. సినిమా చూసినట్లు లేదు" అని ఘాటుగా రాసింది.

ది టెలిగ్రాఫ్ కూడా 1 స్టార్ రేటింగ్ తోనే సరిపెట్టింది. "చేపల తొట్టెలో రూ. 3000 కోట్లు విలువ చేసే మెరుపులు కుమ్మరించినట్లు ఉంది తప్ప.. కథ లేదు" అని విమర్శించింది. ఇక ఇండీ వైర్ స్పందిస్తూ.. "ఇంతకుముందు చూసిందే మళ్ళీ చూసినట్లుంది. కొత్తదనం ఏమీ లేదు" అని పెదవి విరిచింది.

పాజిటివ్ పాయింట్స్ ఏంటంటే?

అవతార్ 3 మూవీకి మొత్తంగా నెగటివ్ రివ్యూలు ఏమీ రాలేదు. కొందరు జేమ్స్ కామెరాన్ పనితనాన్ని మెచ్చుకున్నారు.

ఎంపైర్ ఈ సినిమా 4 స్టార్ రేటింగ్ ఇస్తూ.. కామెరాన్ మరోసారి తన "బ్లాక్‌బస్టర్ మ్యాజిక్" చూపించారని, ఇదొక ఎపిక్ సినిమా అని ప్రశంసించింది. మూడు గంటల సమయం వృధా కాదని తెలిపింది.

డెడ్‌లైన్ తన రివ్యూలో.. దీన్ని ఒక “వార్ ఎపిక్”గా అభివర్ణించింది. మొదటి రెండు సినిమాలను కలిపినా రాని కిక్.. ఇందులో ఉన్న యుద్ధ సన్నివేశాల్లో ఉందని రాసింది.

ఐజీఎన్ స్పందిస్తూ.. కథ పాతదే అయినా.. విజువల్స్ పరంగా ఇదొక అద్భుతం అని పేర్కొంది. అవతార్ 3 మూవీ ప్రపంచవ్యాప్తంగా ఈ శుక్రవారం (డిసెంబర్ 19) ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More