బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్, లెజెండరీ దర్శకుడు ప్రియదర్శన్ ద్వయం అంటేనే బాక్సాఫీస్ వద్ద నవ్వుల వర్షం. దాదాపు 15 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఈ కాంబినేషన్లో వస్తున్న 'భూత్ బంగ్లా' (Bhooth Bangla) ట్రైలర్ సోమవారం (ఏప్రిల్ 6) విడుదలైంది. 3 నిమిషాల నిడివి గల ఈ ట్రైలర్.. ఒకప్పటి సూపర్ హిట్ 'భూల్ భూలయ్యా' రోజులను గుర్తు చేస్తూ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది.
ఒక పల్లెటూరిలోని శాపగ్రస్తమైన పాత బంగ్లా నేపథ్యంలో భూత్ బంగ్లా మూవీ కథ సాగుతుంది. ఆ బంగ్లాలో ఏదో అతీత శక్తి ఉందని, అక్కడికి వెళ్లవద్దని అందరూ హెచ్చరిస్తున్నా.. "ఇంత పెద్ద బంగ్లాను వదిలేసి వెళ్లడానికి నేను పిచ్చోడిని కాదు" అంటూ అక్షయ్ కుమార్ చేసే సందడి ట్రైలర్లో హైలైట్గా నిలిచింది. అక్షయ్ మార్క్ కామెడీ టైమింగ్, హారర్ ఎలిమెంట్స్ తోడై సినిమాపై భారీ అంచనాలను పెంచేశాయి.
పాత టీమ్.. కొత్త జోష్..
ఈ సినిమాలో మరో విశేషం ఏమిటంటే.. అక్షయ్తో పాటు పరేష్ రావల్, రాజ్పాల్ యాదవ్ వంటి కామెడీ దిగ్గజాలు మళ్లీ ఒక్కటయ్యారు. వీరంతా కలిసి చేసే అల్లరి 'హేరా ఫేరి' సినిమాలను గుర్తుకు తెస్తోంది.
అంతేకాకుండా గతేడాది మరణించిన ప్రముఖ నటుడు అస్రానీ ఈ సినిమాలో కనిపించడం అభిమానులను భావోద్వేగానికి గురిచేస్తోంది. అతని మరణానంతరం విడుదలవుతున్న సినిమాల్లో ఇదీ ఒకటి కావడంతో ప్రాధాన్యత సంతరించుకుంది.
టబు సర్ప్రైజ్ ఎంట్రీ
ఈ భూత్ బంగ్లా ట్రైలర్లో అందరినీ ఆశ్చర్యపరిచిన విషయం నటి టబు ఎంట్రీ. సినిమా అంతా ఒక ఎత్తైతే, టబు క్యామియో రోల్ సినిమాకు వెన్నెముక అని దర్శకుడు ప్రియదర్శన్ ఇదివరకే పేర్కొన్నారు. వామికా గబ్బి, మిథిలా పాల్కర్ ఇతర కీలక పాత్రల్లో నటించగా.. ఏక్తా కపూర్, శోభా కపూర్ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మించారు.
భూత్ బంగ్లా విడుదల ఎప్పుడు?
మొదట ఏప్రిల్ 10న విడుదల కావాల్సిన ఈ సినిమా కొన్ని కారణాల వల్ల వారం రోజులు ఆలస్యంగా ఏప్రిల్ 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఏప్రిల్ 16 రాత్రి 9 గంటల నుంచే పెయిడ్ ప్రివ్యూలు ప్రారంభం కానున్నాయి.
ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ ట్రైలర్పై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. "అక్షయ్ - ప్రియదర్శన్ - పరేష్ రావల్ - రాజ్పాల్ యాదవ్.. బాలీవుడ్ కామెడీని కాపాడటానికి అసలైన టీమ్ తిరిగి వచ్చింది" అని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.