జైలు నుంచి కమెడియన్‌ను విడిపించిన సల్మాన్ ఖాన్? నిజాలు చెప్పిన రాజ్‌పాల్ భార్య- వైరల్ అవుతున్న వీడియో వెనుక అసలు కథ!

రూ. 9 కోట్ల చెక్ బౌన్స్ కేసులో తీహార్ జైలులో ఉన్న స్టార్ కమెడియన్ రాజ్‌పాల్ యాదవ్ విడుదలయ్యారని, సల్మాన్ ఖాన్ ఆయనకు ఆర్థిక సాయం చేశారని వస్తున్న వార్తలపై నటుడి భార్య రాధ యాదవ్ స్పందించారు. రాజ్‌పాల్ యాదవ్ ఆరోగ్యం బాగానే ఉందని ఆయన భార్య వెల్లడించారు.

Feb 16, 2026, 13:13:40 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

బాలీవుడ్ ప్రముఖ కమెడియన్ రాజ్‌పాల్ యాదవ్ జైలు నుంచి విడుదలయ్యారంటూ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది. ముఖ్యంగా బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ చొరవ తీసుకుని కమెడియన్ రాజ్‌పాల్ యాదవ్ బకాయిలను తీర్చారని, అందుకే రాజ్‌పాల్ బయటకు వచ్చారని నెటిజన్లు చర్చించుకుంటున్నారు.

జైలు నుంచి కమెడియన్‌ను విడిపించిన సల్మాన్ ఖాన్? నిజాలు చెప్పిన రాజ్‌పాల్ భార్య- వైరల్ అవుతున్న వీడియో వెనుక అసలు కథ! (Instagram/@rajpalofficial)
జైలు నుంచి కమెడియన్‌ను విడిపించిన సల్మాన్ ఖాన్? నిజాలు చెప్పిన రాజ్‌పాల్ భార్య- వైరల్ అవుతున్న వీడియో వెనుక అసలు కథ! (Instagram/@rajpalofficial)

ఆయన ఇంకా జైలులోనే ఉన్నారు

అయితే, ఈ వార్తలపై రాజ్‌పాల్ యాదవ్ భార్య రాధ యాదవ్ ఎట్టకేలకు స్పందిస్తూ అసలు విషయాన్ని వెల్లడించారు. రాజ్‌పాల్ యాదవ్ విడుదలపై వస్తున్న పుకార్లను ఆయన భార్య రాధ యాదవ్ ఖండించారు.

"ప్రస్తుతానికి ఆయన (రాజ్‌పాల్ యాదవ్) తీహార్ జైలులోనే ఉన్నారు. విడుదలయ్యారన్న వార్తల్లో వాస్తవం లేదు. బెయిల్ పిటిషన్‌పై సోమవారం (ఫిబ్రవరి 16) విచారణ జరగనుంది" అని రాధ యాదవ్ బాంబే టైమ్స్‌తో పేర్కొన్నారు. జైలులో ఆయన ఆరోగ్యం బాగుందని, ఈ కష్ట సమయంలో సినీ పరిశ్రమ, అభిమానులు చూపిస్తున్న ప్రేమాభిమానాలకు తాము కృతజ్ఞులమని ఆమె తెలిపారు.

సల్మాన్ ఖాన్ వీడియో వెనుక అసలు కథ!

రాజ్‌పాల్ యాదవ్ జైలు నుంచి విడుదలయ్యారనే భ్రమ కలిగించడానికి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియోనే ప్రధాన కారణం. ఆ వీడియోలో రాజ్‌పాల్ యాదవ్ మీడియా ముందు మాట్లాడుతూ.. "సల్మాన్ భాయ్ నాకు అన్నలాంటి వారు. ఆయనతో కలిసి కూర్చోవడం చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు నాకు చాలా ఉపశమనంగా అనిపిస్తోంది" అని వ్యాఖ్యానించారు.

అయితే, ఈ వీడియోకు ప్రస్తుత కేసుకు ఎలాంటి సంబంధం లేదని తాజాగా తేలింది. అది పాత వీడియో అని, ఎవరో కావాలని ఇప్పుడు దానిని వైరల్ చేస్తూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని స్పష్టమైంది. సల్మాన్ ఖాన్ రాజ్‌పాల్ బకాయిలు తీర్చారనే వార్తల్లో కూడా ఎలాంటి అధికారిక సమాచారం లేదు.

అసలు రాజ్‌పాల్ యాదవ్ జైలుకు ఎందుకు వెళ్లారు?

ఈ వివాదం 2010లో మొదలైంది. రాజ్‌పాల్ యాదవ్ దర్శకుడిగా తన మొదటి సినిమా తీయడానికి రూ. 5 కోట్ల అప్పు తీసుకున్నారు. కానీ, ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలవడంతో ఆయన ఆ డబ్బును తిరిగి చెల్లించలేకపోయారు. దీనిపై కోర్టులో చెక్ బౌన్స్ కేసులు నమోదయ్యాయి. ఫలితంగా ఆ అప్పు వడ్డీతో కలిపి రూ. 9 కోట్లకు చేరింది.

2018లో మెజిస్ట్రేట్ కోర్టు రాజ్‌పాల్ దంపతులకు ఆరు నెలల జైలు శిక్ష విధించింది. 2026 ఫిబ్రవరి 5న ఢిల్లీ హైకోర్టు ఆదేశాల మేరకు ఆయన తీహార్ జైలు అధికారుల ముందు లొంగిపోయారు.

బెయిల్ విచారణపైనే

ప్రస్తుతం రాజ్‌పాల్ యాదవ్ తన శిక్షను అనుభవిస్తున్నారు. ఫిబ్రవరి 16న జరిగే బెయిల్ విచారణపైనే ఆయన భవిష్యత్తు ఆధారపడి ఉంది. అప్పటివరకు ఆయన జైలులోనే ఉండక తప్పదు.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More