తెలుగు సినిమా ఇండస్ట్రీని చూసి ఎంతో నేర్చుకోవాలి.. చాలా క్రమశిక్షణతో ఉంటారు.. ఇలాంటి సినిమా చేయలేదు: బాలీవుడ్ నటి
తెలుగు సినిమా ఇండస్ట్రీపై ప్రశంసల వర్షం కురిపించింది బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా. సుధీర్ బాబుతో కలిసి జటాధర మూవీలో నటించిన ఆమె.. హిందీ, సౌత్ ఇండస్ట్రీల మధ్య ఉన్న తేడా ఏంటో చెప్పింది. తెలుగు ఇండస్ట్రీ నుంచి నేర్చుకోవాలని అనడం విశేషం.
బాలీవుడ్ ప్రేక్షకులకు సుపరిచితురాలైన నటి సోనాక్షి సిన్హా ఇప్పుడు తెలుగు సినిమా రంగంలోకి అడుగుపెడుతోంది. అభిషేక్ జైస్వాల్, వెంకట్ కళ్యాణ్ దర్శకత్వం వహిస్తున్న సూపర్ నేచురల్ థ్రిల్లర్ ‘జటాధర’తో ఆమె టాలీవుడ్లోకి ఎంట్రీ ఇస్తోంది. ఈ సినిమాలో సుధీర్ బాబు ప్రధాన పాత్ర పోషిస్తుండగా, శిల్పా శిరోద్కర్ కూడా ఒక కీలక పాత్రలో కనిపించనుంది. 'దబంగ్', 'లూటేరా', 'అకీరా' వంటి సినిమాలతో గుర్తింపు పొందిన సోనాక్షి సిన్హా.. ఈ బైలింగ్వల్ మూవీలో 'ధనపిశాచిని' అనే ప్రతినాయక పాత్రను పోషిస్తుండటం విశేషం. ఈ సినిమా నవంబర్ 7న విడుదల కానుంది.

కథ నచ్చడంతోనే తెలుగు అరంగేట్రం
తన తెలుగు అరంగేట్రం గురించి సోనాక్షి సిన్హా పీటీఐతో మాట్లాడింది. "కథ నన్ను బాగా ఆకర్షించింది. ఇది చాలా డార్క్, లేయర్డ్గా ఉంది. నేను ఇంతకుముందు చేసిన సినిమాల కంటే ఇది చాలా భిన్నంగా ఉంది" అని తన అనుభవాన్ని పంచుకుంది. ప్రాంతీయ సినిమాను, కొత్త టీమ్ను, ప్రేక్షకులను ఎక్స్ప్లోర్ చేయడానికి తాను చాలా ఉత్సాహంగా ఉన్నానని ఆమె తెలిపింది.
"నేను గతంలో ఒక తమిళ చిత్రం ('లింగ') చేశాను. ఇప్పుడు ఈ తెలుగు చిత్రం చేస్తున్నాను. ప్రాంతీయ చిత్రాలలో నటించడానికి నేను ఎప్పుడూ సిద్ధంగానే ఉంటాను. కాకపోతే, ఇంతకుముందు నా షెడ్యూల్స్ అనుకూలించలేదు" అని సోనాక్షి చెప్పింది.
తెలుగు సినీ పరిశ్రమ క్రమశిక్షణ అద్భుతం
హిందీ, తెలుగు సినీ పరిశ్రమల పని సంస్కృతిని పోలుస్తూ సోనాక్షి సిన్హా దక్షిణాది చిత్ర పరిశ్రమ క్రమశిక్షణను, సమయపాలనను ప్రశంసించింది. "పెద్ద తేడాలు ఏమీ లేవు. కానీ వారి టైమింగ్స్ చాలా బాగుంటాయి. చాలా పద్ధతిగా ఉంటాయి. అక్కడ వర్క్, లైఫ్ బ్యాలెన్స్ అద్భుతంగా ఉంది. ఇది మనం కచ్చితంగా నేర్చుకోవాల్సిన విషయం" అని ఆమె అభిప్రాయపడింది.
సెట్లో వారు పాటించే క్రమశిక్షణ తనను బాగా ఆకట్టుకుందని సోనాక్షి పేర్కొంది. "మీరు తొమ్మిది గంటలకు షూటింగ్కు వస్తే, సాయంత్రం ఆరు గంటల తర్వాత షూటింగ్ చేయరు. అసలు దానికి వీలుండదు. ఇది ఇక్కడి పరిశ్రమలో నాకు నిజంగా నచ్చిన విషయం. చెప్పాలంటే ఇది కొంచెం క్రమశిక్షణతో కూడిన ఇండస్ట్రీ" అని ఆమె వివరించింది. హిందీ ఇండస్ట్రీలో షూటింగ్లు తరచుగా అర్ధరాత్రి వరకు సాగుతాయని, ఇది మారితే బాగుంటుందని సోనాక్షి తెలిపింది.
'ధనపిశాచిని' పాత్రలో పూర్తి స్వేచ్ఛ
'జటాధర' సినిమాలో సోనాక్షి సిన్హా ఇంతకుముందు తాను పోషించిన పాత్రల మాదిరిగా కాకుండా చాలా భిన్నమైన పాత్రలో కనిపిస్తుంది. అనంత పద్మనాభ స్వామి ఆలయం చుట్టూ ఉన్న రహస్యాల నేపథ్యంతో ఈ కథ నడుస్తుంది. ఇది పౌరాణిక అంశాలను, సూపర్నేచురల్ అంశాలను కలగలిపి ఉంటుంది. ఈ పాత్రను తనకు నచ్చినట్లుగా మలచుకునేందుకు దర్శకుడు వెంకట్ కళ్యాణ్ పూర్తి స్వేచ్ఛ ఇచ్చాడని సోనాక్షి చెప్పింది.
"మొదటి షాట్ పూర్తైనప్పుడు అతని (దర్శకుడి) కళ్లలో చిన్నపిల్లవాడిలాంటి సంతోషాన్ని చూశాను. 'ఇదే నా ధనపిశాచిని' అని ఆయన అన్నారు" అంటూ ఆ అనుభవాన్ని సోనాక్షి గుర్తు చేసుకుంది. భిన్నమైన భాషలు, జానర్లను ఎక్స్ప్లోర్ చేయడాన్ని తాను కొనసాగించాలని కోరుకుంటున్నట్లు సోనాక్షి సిన్హా తెలిపింది. 'దహాద్', 'హీరామండి' వంటి వెబ్ సిరీస్లతో పాటు సినిమాల్లో కూడా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న ఈ నటి, బలమైన దర్శకులు, విభిన్నమైన కథలతో పనిచేయడంపైనే తన దృష్టి ఉంటుందని స్పష్టం చేసింది. సుధీర్ బాబు లీడ్ రోల్లో నటించిన ఈ 'జటాధర' మూవీ తెలుగు, హిందీ భాషల్లో నవంబర్ 7న విడుదల కానుంది.

E-Paper












