Singer: చావు కోసం నేను రెడీ.. నేను ఎక్కడ చనిపోతే అక్కడే పాతి పెట్టండి.. లైవ్ కాన్సర్ట్లో స్టార్ సింగర్ కంటతడి
Singer Lucky Ali: బాలీవుడ్ సింగర్ లక్కీ అలీ తాజాగా తన చావు గురించి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. తాను ఎప్పుడూ చావుకు సిద్ధంగా ఉన్నానని, తాను ఎక్కడ చనిపోతే అక్కడే పాతి పెట్టేయండని అనడం గమనార్హం.
Singer Lucky Ali: "ఓ సనమ్", "ఏక్ పల్ కా జీనా", "నా తుమ్ జానో నా హమ్" లాంటి క్లాసిక్ చార్ట్బస్టర్ పాటలతో తరాల తరబడి మ్యూజిక్ లవర్స్ హృదయాలను ఏలుతున్న పాప్ ఐకాన్ లక్కీ అలీ (67) చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఇటీవల జరిగిన ఒక లైవ్ కాన్సర్ట్లో చావు, అంతిమ ప్రయాణం గురించి ఆయన మాట్లాడిన మాటలు విన్న అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతికి గురవుతున్నారు.

మరణం అనేది జీవితంలో తప్పనిసరి అని, దానికి తాను ఎప్పుడూ సిద్ధంగానే ఉంటానని లక్కీ అలీ వ్యాఖ్యానించారు. ఈ కాన్సర్ట్కి సంబంధించిన వీడియోను ఆయన స్వయంగా తన అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేయడంతో అది కాస్తా క్షణాల్లో వైరల్గా మారింది.
ప్రయాణాల్లో అంతిమ వస్త్రం 'ఇహ్రామ్'.. కంటతడి పెట్టిస్తున్న వీడియో
లైవ్ స్టేజ్పై అభిమానుల కోలాహలం మధ్య సింగర్ లక్కీ అలీ మాట్లాడుతూ.. "మీరంటే నాకు ఎంతో ప్రేమ. కానీ ఏదో ఒక రోజు నేను ఈ లోకాన్ని విడిచి వెళ్లాల్సిందే కదా. మిమ్మల్ని మానసికంగా సిద్ధం చేయడానికి నేను ఈ మాటలు చెప్పడం లేదు, నిజానికి నా చావుకి నేను ఎప్పుడో సిద్ధపడ్డాను" అని పేర్కొన్నారు.
అంతేకాకుండా తన పర్సనల్ లైఫ్కి సంబంధించిన ఒక సంచలన విషయాన్ని బయటపెట్టారు. "నేను ఎక్కడ ప్రయాణం చేసినా నా వెంట 'ఇహ్రామ్' (ముస్లింలు అంత్యక్రియల సమయంలో ఉపయోగించే తెల్లటి వస్త్రం) ఉంచుకుంటాను. నేను ప్రపంచంలో ఏ మూల చనిపోయినా, నన్ను అక్కడే పాతిపెట్టేయండి" అని చెప్పారు. ఒక దిగ్గజ గాయకుడి నోటి నుంచి ఈ మాటలు విన్న స్టేడియంలోని ప్రేక్షకులు, నెటిజన్లు ఎమోషనల్ అవుతున్నారు.
"90ల నాటి రోజులు గుర్తుకొస్తున్నాయి".. ఎమోషనల్ అవుతున్న ఫ్యాన్స్
లక్కీ అలీ పోస్ట్ చేసిన వీడియో కింద నెటిజన్లు, ఆయన అభిమానులు వేలాదిగా కామెంట్లు పెడుతున్నారు. "మీరు చెప్పే నిజం మేము తట్టుకోలేకపోతున్నాం. మేము ఇప్పటికీ 90ల కాలంలోనే ఉండిపోయాం. దూరదర్శన్లో మీ 'ఓ సనమ్' పాట చూస్తూ పెరిగిన మాకు మిమ్మల్ని ఇలా చూడటం కష్టంగా ఉంది" అని ఒక అభిమాని కామెంట్ చేశారు.
మరొక నెటిజన్ స్పందిస్తూ.. "ఎల్లప్పుడూ అంతిమ వస్త్రాన్ని వెంట ఉంచుకోవడం మీ ఆధ్యాత్మిక విశ్వాసానికి నిదర్శనం. అల్లా మీకు సుదీర్ఘమైన, ఆరోగ్యకరమైన ఆయుష్షు ప్రసాదించాలి" అని ఆకాంక్షించారు. జీవితంలో ఎదురయ్యే మరణాన్ని ఇంత సహజంగా స్వీకరించడం కేవలం లక్కీ అలీకే సాధ్యమని నెటిజన్లు కొనియాడుతున్నారు.
బాలీవుడ్కి ఎందుకు దూరమయ్యారు?
కేవలం గాయకుడిగానే కాకుండా 'సుర్', 'కాంటే' లాంటి సినిమాలతో నటుడిగానూ లక్కీ అలీ తన ముద్ర వేశారు. అయితే 2015 తర్వాత ఆయన బాలీవుడ్ చిత్ర పరిశ్రమకు, ప్లేబ్యాక్ సింగింగ్కి పూర్తిగా దూరమయ్యారు. గతంలో ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన, ఇండస్ట్రీని వదిలేయడానికి గల అసలు కారణాలను వెల్లడించారు.
తండ్రి, ప్రముఖ హాస్య నటుడు మహమూద్ మరణం తర్వాత బాలీవుడ్లో తనకు ఎలాంటి ఆత్మీయులు మిగలలేదని చెప్పారు. "పరిశ్రమలో కల్చర్ మారిపోయింది. కొందరు నా పట్ల ప్రవర్తించిన తీరు బాధించింది. అంతకంటే ఎక్కువగా అక్కడి వాతావరణంలో రొటీన్ పెరిగిపోయింది. నాకంటూ ఒక క్రియేటివ్ ఫ్రీడమ్ కావాలనిపించి ఇండిపెండెంట్ మ్యూజిక్ వైపు వచ్చేశాను" అని లక్కీ అలీ వివరించారు.
శ్యామ్ బెనెగల్ దర్శకత్వంలో 'త్రికాల్', 'భారత్ ఏక్ ఖోజ్' లాంటి ప్రాజెక్ట్లలో పనిచేసి నసీరుద్దీన్ షా, షబానా అజ్మీ, ఓం పురీ లాంటి దిగ్గజాల నుంచి నటన నేర్చుకున్నట్లు ఆయన గుర్తుచేసుకున్నారు. ప్రస్తుతం ఇండిపెండెంట్ మ్యూజిక్ చేస్తూ ప్రపంచవ్యాప్తంగా కాన్సర్ట్లు నిర్వహిస్తున్న లక్కీ అలీ.. తన మార్క్ గొంతుతో తరాలు మారినా సంగీతాభిమానులను అలరిస్తూనే ఉన్నారు.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్డేట్స్ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


