Brahmamudi August 5 Episode: బ్రహ్మముడి.. ఇందుతో ఐశ్వర్య గొడవ.. వెంకీని నిలదీసిన నందు.. రాజును అడ్డంగా బుక్ చేసిన అపర్ణ
Brahmamudi Serial August 5th Episode: బ్రహ్మముడి సీరియల్ ఆగస్ట్ 5 ఎపిసోడ్ లో ఇందుతో ఐశ్వర్య గొడవ పడుతుంది. అటు వెంకీని నందు నిలదీస్తుంది. మరోవైపు రాజును అపర్ణ అడ్డంగా బుక్ చేస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో చూడండి.
Brahma Mudi Serial Today Episode: స్టార్ మా సీరియల్ బ్రహ్మముడి ఈరోజు ఎపిసోడ్ లో అమ్మమ్మ, తాతయ్యలకు మాటిచ్చి రాజు అడ్డంగా బుక్కవుతాడు. అటు డబ్బు కోసం ఇందుతో ఐశ్వర్య మరోసారి ఫైట్ చేస్తుంది. తన ప్రతాపం ఏంటో చూపిస్తానని శపథం చేస్తుంది. మరోవైపు నందుకి వెంకీ రెడ్ హ్యాండెడ్గా దొరికిపోతాడు.

ఇందుకి పాట పాడుతూ సారీ చెప్పిన రాజు..
ఇందుకి రాజు సారీ చెప్పే సీన్ తో సీరియల్ బుధవారం (ఆగస్ట్ 5) ఎపిసోడ్ ప్రారంభమైంది. ఇందు ఎంతకీ తగ్గకపోవడంతో రాజు పాట పాడతాడు. జాబిలమ్మ నీకు అంత కోపమా అంటూ ఇందుని బతిమాలుతాడు. ఆమె ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్లి సారీ చెబుతాడు. అమ్మమ్మను సాయం చేయమని అడిగితే.. ఆమె పట్టించుకోకుండా వెళ్లిపోతుంది.
కరగని ఇందు.. రాజుకి పస్తులు
రాజు ఎంత చేసినా ఇందు మాత్రం కరగదు. చివరికి రాజుకు భోజనం కూడా పెట్టదు. తన కోసం చికెన్ చేశావా.. వెజ్ కర్రీస్ చేశావా అంటూ గిన్నెలన్నీ చూసినా వాటిలో ఏమీ ఉండవు. దీంతో రాజు పస్తులు ఉండాల్సి వస్తుంది. కోపం ఉంటే నన్ను తిట్టు, కొట్టు కానీ.. ఇలా పస్తులు ఉంచకు అని రాజు అంటాడు.
తన మాట విననప్పుడు తాను మాత్రం ఎందుకు వంట చేయాలి.. చేయను అని ఇందు తేల్చి చెబుతుంది. మొగుళ్లపై అలగడం చూశాను కానీ.. ఇలా అద్దె మొగుళ్లపైనా అలుగుతారా అని రాజు అంటాడు. మొగుళ్లందరూ ఇలాంటోళ్లే అనుకున్నాను కానీ.. అద్దె మొగుళ్లు కూడా ఇలాగే ఉంటారా అని ఇందు కౌంటర్ వేస్తుంది.
తన వంట తానే చేసుకున్న రాజు
ఇక చేసేది లేక రాజు తన వంట తానే చేసుకుంటానని వెళ్తాడు. నువ్వు చేయకపోతే నాకు రాదనుకున్నావా.. నా వంట నేనే చేసుకుంటాను.. మగాళ్లకు వంట చేసుకోవడం వచ్చు.. టైమ్ మేనేజ్ మెంట్ కూడా తెలుసు.. ఓవైపు అన్నం వండుతూనే మరోవైపు కర్రీ కూడా చేస్తాను అని పంతాలకు పోతాడు. కూరగాయలు కట్ చేసుకుంటాడు. అది చూసిన అపర్ణ తన మనవడిని ఎందుకు ఇబ్బంది పెడుతున్నావ్ అని ఇందుతో అపర్ణ అంటుంది. తాను వెళ్తానన్నా అడ్డుకుంటుంది.
చేయి కాల్చుకున్న రాజు.. అపర్ణ ఎమోషనల్.. బిర్యానీ పెట్టి..
చివరికి అన్నం గిన్నెపై రాజు చేయి కాల్చుకుంటాడు. అది చూసి అపర్ణ పరుగెత్తుకొని వెళ్తుంది. వెంటనే వెన్న తీసి వేళ్లకు రాస్తుంది. ఆమె ఎమోషనల్ అయిపోతుంది. అది చూసి ఇందు కూడా ముచ్చటపడుతుంది. తనకు చెబితే వంట చేసి పెడతాను కద.. నువ్వెందుకు చేస్తున్నావని రాజుతో అంటుంది. అయినా నీకోసం స్పెషల్ గా బిర్యానీ చేశాను కదా అని చెబుతుంది. అవునా మరి ఇందు చెప్పలేదని రాజు అంటాడు. దాని ముఖం.. అది చెప్పేదేంటి.. నేను పెడతాను రా అని రాజుని తీసుకెళ్లి వడ్డిస్తుంది.
అపర్ణ కన్నీళ్లు.. సారీ చెప్పిన రాజు
అమ్మమ్మ చేసిన బిర్యానీ తింటూ రాజు మురిసిపోతాడు. నీ చేతి వంట అద్భుతమని పొగుడుతాడు. ఇంతలో స్వాతి కూడా వచ్చి రాజుని ఎగతాళి చేస్తుంది. ఇందు, స్వాతి కలిసి రాజుతో ఆడుకుంటుండంతో అపర్ణ అతనికి అండగా నిలుస్తుంది. ఇంతలో రాజుకు పొలమారుతుంది. వెంటనే అతనికి నీళ్లు అందిస్తుంది అపర్ణ.
రాజుకి పొలమారితే అపర్ణ కళ్లలో నీళ్లు తిరుగుతాయి. అది చూసి ఏమైందని స్వాతి అడుగుతుంది. తాను పూజకు రాలేదని అమ్మమ్మ బాధపడుతున్నట్లుంది.. సారీ అమ్మమ్మ అని రాజు అంటాడు. ఇక నుంచి అమ్మమ్మ, తాతయ్య ఏం చెబితే అది చేస్తాను అని రాజు మాటిస్తాడు.
ఇందుతో ఐశ్వర్య గొడవ
మరోవైపు ఇందు దగ్గరికి వెళ్తుంది ఐశ్వర్య. తనకు రూ.2 లక్షలు కావాలని అడుగుతుంది. ఇస్తాను కానీ.. ఎందుకో కారణం చెప్పాలని ఇందు అడుగుతుంది. కానీ ఐశ్వర్య మాత్రం చెప్పదు. పైగా ఇందుతో గొడవకు దిగుతుంది. మిమ్మల్ని అడుక్కుంటానని చెప్పి మీకు అలుసైపోయాను కదా.. అయినా కుక్కిన పేనులా పడి ఉండేదాన్ని తీసుకెళ్లి సీఈవోను చేసిన రేఖ ఆంటీని అనాలి.. ఆమెకు ఏం మందు పెట్టావో కానీ.. నువ్వు ఏం చేసినా ఏమీ అనడం లేదు.. ఏదో ఒక రోజు నేనేంటో నీకు చూపిస్తాను అని కోపంగా ఐశ్వర్య వెళ్లిపోతుంది.
వెంకీని నిలదీసిన నందు
అటు వెంకీకి నందు మళ్లీ ఫోన్ చేస్తుంది. కానీ అతడు తీయడు. పదే పదే చేస్తూనే ఉంటుంది. కానీ వెంకీ మాత్రం పట్టించుకోడు. ఇంతలో ఆమె తన ముందు ప్రత్యక్షమవవడంతో అతడు షాక్ తింటాడు. ఎందుకు తన ఫోన్ లిఫ్ట్ చేయడం లేదని, ఎందుకు పట్టించుకోవడం లేదని నిలదీస్తాడు. ఇంటికి వచ్చి వెళ్లినా కూడా ఎందుకు ఫోన్ చేయలేదని అడుగుతుంది. బిజీగా ఉన్నానని చెప్పి వెంకీ తప్పించుకోబోయినా నందు మాత్రం వదలదు. దీంతో వెంకీ పూర్తిగా బుక్కయిపోతాడు.
రేఖకు రాజు టార్చర్
రేఖకు రోజురోజుకీ టార్చర్ పెరిగిపోతూ ఉంటుంది. తన తల్లి గురించి తెలిసిందా అని లక్కీ అడుగుతాడు. అతడు వెళ్లిపోయిన తర్వాత రాజు వచ్చి నిజం నీ నోటితోనే చెప్పిస్తానని రేఖకు ఛాలెంజ్ చేస్తాడు. దీంతో ఆమె షాక్ తింటుంది.
అటు ఇందు మెడలో నల్లపూసలు వేయాలని అపర్ణ, సుభాష్ రాజుకు చెబుతారు. మీరు ఏం చెప్పినా చేస్తానని మాట ఇవ్వడంతో రాజు ఆలోచనలో పడతాడు. వాళ్ల చేతుల్లో అడ్డంగా బుక్కవుతాడు.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్డేట్స్ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


