బ్రహ్మముడి జూన్ 20 ఎపిసోడ్: పార్టీలో రాజు వీడియో.. మీకు పెళ్లి కాలేదా అంటూ నిలదీసిన రేఖ.. పార్టీకి చలపతి, లక్ష్మి
Brahmamudi Serial June 20th Episode: బ్రహ్మముడి సీరియల్ జూన్ 20 ఎపిసోడ్ లో రాజు, ఇందు కొంప ముంచుతుంది ఐశ్వర్య. అతడు తాగి నిజం వాగేసిన వీడియోను పార్టీలో అందరి ముందూ ప్లే చేయడంతో రాజును రేఖ నిలదీస్తుంది.
Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్ లో రాజు, ఇందు పీకల్లోతు కష్టాల్లో పడతారు. ఐశ్వర్య వాళ్ల కొంప ముంచుతుంది. మరోవైపు రాజును వెతుక్కుంటూ దుగ్గిరాల ఇంటికి వస్తారు చలపతి, లక్ష్మి. దీంతో అన్ని వైపుల నుంచి అతడు చిక్కుల్లో పడతాడు.

లక్కీని నిలదీసిన చలపతి, లక్ష్మి..
బ్రహ్మముడి సీరియల్ శనివారం (జూన్ 20) ఎపిసోడ్ లో రాజు ఎక్కడ అంటూ లక్కీని చలపతి, లక్ష్మి నిలదీసే సీన్ తో మొదలవుతుంది. తనకూ తెలియదని, చాలా రోజులుగా మాట్లాడలేదని, ఫోన్ చేసినా తీయడం లేదని లక్కీ చెబుతాడు. కావాలంటే చూడండి అంటూ తన ఫోన్ చూపిస్తాడు.
అబద్ధం చెప్పి అడ్డంగా బుక్కయిన లక్కీ
అప్పుడే రాజు అతనికి కాల్ చేయడంతో అది చూసి చలపతి, లక్ష్మి షాక్ తింటారు. స్పీకర్ ఆన్ చేసి మాట్లాడు అంటూ చలపతి హుకుం జారీ చేస్తాడు. ఫోన్ లిఫ్ట్ చేయగానే ఎక్కడున్నావ్ రా.. ఈరోజు పార్టీ ఉందని చెప్పాను కదా.. త్వరగా వచ్చెయ్ అని చెప్పి రాజు పెట్టేస్తాడు. ఏంటా పార్టీ, ఎక్కడ.. లొకేషన్ పంపించమని లక్కీని అడుగుతాడు చలపతి. చేసేది లేక లొకేషన్ పంపిస్తాడు.
కొత్త సీఈవోను అనౌన్స్ చేసిన రేఖ
అటు పార్టీ మొదలవుతుంది. స్టేజ్ పైకి ఇందుని తీసుకెళ్లిన రేఖ.. ఆమెను కొత్త సీఈవోగా అనౌన్స్ చేస్తుంది. అదే సమయంలో సీతారామయ్య ఈ కంపెనీని ప్రారంభించినప్పటి విషయం చెబుతూ ఆ తర్వాత రాజ్, కావ్య స్వరాజ్ గ్రూపును ఎలా ముందుకు తీసుకెళ్లారో చెబుతుంది. అనుకోని ప్రమాదంలో వాళ్లు కన్ను మూయడంతో తప్పనిసరి పరిస్థితుల్లో తాను కంపెనీ బాధ్యతలు తీసుకున్నట్లు చెబుతుంది.
రేఖను పొగుడుతూ ఇందు స్పీచ్
ఆ తర్వాత ఇందు మాట్లాడుతుంది. ఆమె రేఖను పొగుడుతూ తన స్పీచ్ మొదలుపెట్టడంతో అందరూ షాక్ తింటారు. కంపెనీ బాగా ముందుకు తీసుకెళ్తానని అంటుంది. మీకు అనుభవం లేదు కదా అని ఒకరు ప్రశ్నిస్తే.. మా రేఖ ఆంటీ ట్రైనింగ్ ఇచ్చిందని చెబుతుంది. ఎంతో పరిణతితో ఆమె మాట్లాడుతుంది. దీంతో అందరూ ఆమెను చూసి ఇంప్రెస్ అవుతారు.
స్టేజ్పైనే తొలి డీల్ కొట్టేసిన ఇందు
ఇందు మాటలు విన్న హర్ష అనే వ్యక్తి తాను మళ్లీ స్వరాజ్ గ్రూపుతో డీల్ చేసుకుంటానని అనౌన్స్ చేస్తాడు. గతంలో చాలా కాలం బిజినెస్ చేశానని, రేఖపై నమ్మకం లేక ఆపేశానని అంటాడు. మళ్లీ ఇందు మాటలపై నమ్మకంతో తాను డీల్ కు సిద్ధంగా ఉన్నట్లు చెబుతాడు. దీంతో అందరూ సంతోషిస్తారు.
పార్టీకి వచ్చిన చలపతి, లక్ష్మి.. చూసిన అపర్ణ
ఇటు లక్కీ పంపిన లొకేషన్ వెతుక్కుంటూ చలపతి, లక్ష్మి పార్టీకి వస్తారు. ఎవరో పెద్దింటి వాళ్ల పార్టీలా ఉందని లోనికి వెళ్లడానికి కంగారు పడతారు. రాజును వెతుక్కుంటూ మెల్లగా లోపలికి వెళ్తారు. అప్పుడే అపర్ణ వాళ్లను చూస్తుంది. రాజు తల్లిదండ్రులు కదా అని దగ్గరికి వెళ్లి పలకరిస్తుంది. ఇందుతో పెళ్లి విషయం దాచి పెడుతుంది. రాజు ఇక్కడే ఉన్నాడని, పంపిస్తానని చెప్పి వెళ్తుంది.
అమ్మానాన్నను చూసి రాజు షాక్
అటు రాజు వాళ్లను చూసి షాక్ తింటాడు. కంగారు పడుతూ వెళ్లి వాళ్లను పక్కకు తీసుకెళ్తాడు. ఇక్కడికి ఎందుకు వచ్చారు.. నేను ఇక్కడ ఉన్నట్లు ఎవరు చెప్పారు అని నిలదీస్తాడు. కానీ వాళ్లు మాత్రం నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావ్.. నీ పక్కన ఇందు ఎందుకు ఉంది అని అడుగుతారు.
పెళ్లి విషయం వీళ్లకు తెలియలేదని ఊపిరి పీల్చుకున్న రాజు.. ఇందుతో కలిసి తాను బిజినెస్ చేస్తున్నానని, దుగ్గిరాల ఫ్యామిలీతోనే డీల్ నడుస్తోందని అంటాడు. మిగతా విషయాలన్నీ ఇంటికి వచ్చి చెబుతానని, మీరు ముందు ఇక్కడి నుంచి వెళ్లిపోండని కంగారుగా వాళ్లను పంపించేస్తాడు.
వాళ్లు ఎవరు అని నిలదీసిన రేఖ
అయితే రేఖ వాళ్లను చూసేస్తుంది. రాజు దగ్గరికి వెళ్లి వాళ్లు ఎవరు అని నిలదీస్తుంది. మా అమ్మానాన్న అని అతడు చెబుతాడు. మరి లోనికి తీసుకురాకుండా ఎందుకలా పంపించేస్తున్నావని అడుగుతుంది. ఏదో కవర్ చేసి రేఖను అక్కడి నుంచి తీసుకెళ్తాడు రాజు.
పార్టీలో రాజు వీడియో
ఇటు పార్టీలో బిగ్ స్క్రీన్ పై రాజు తాగి తనకు ఇందుతో పెళ్లి కాలేదని లక్కీతో చెప్పిన వీడియోను ఐశ్వర్య ప్లే చేస్తుంది. అది చూసి అందరూ షాక్ తింటారు. నువ్వు అద్దె మొగుడివా.. ఇందుతో పెళ్లి కాలేదా అని రాజును రేఖ నిలదీస్తుంది. దీంతో ఏం చెప్పాలో తెలియక రాజు బిక్కమొహం వేస్తాడు. అక్కడితో బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్డేట్స్ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


