జెమీమాకు థ్యాంక్స్ చెప్పిన స్టార్ హీరోయిన్.. గెలిపించినందుకు కాదు.. ఆ స్టోరీ షేర్ చేసినందుకు..
జెమీమా రోడ్రిగ్స్ కు థ్యాంక్స్ చెప్పింది బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకోన్. అయితే అది ఆస్ట్రేలియాపై గెలిపించినందుకు కాదు.. ఆ తర్వాత తన బలహీనతలను చెప్పుకుంటూ ఎలాంటి పరిస్థితులు అనుభవించానో చెప్పినందుకు దీపిక థ్యాంక్స్ చెప్పింది.
ఇండియన్ వుమెన్స్ క్రికెట్ టీమ్ బ్యాటర్ జెమీమా రోడ్రిగ్స్ ఓవర్నైట్ స్టార్ అయిపోయింది. వరల్డ్ కప్ లో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన సెమీఫైనల్లో సెంచరీతో టీమ్ ను గెలిపించిన ఆమెపై ప్రశంసల వర్షం కురుస్తోంది. అటు బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకోన్ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో జెమీమాను ప్రత్యేకంగా ప్రశంసించింది. ఆందోళనతో తాను ఎదుర్కొన్న కఠిన క్షణాలను, తన భావోద్వేగాలను నిస్సంకోచంగా బయటపెట్టినందుకు ధన్యవాదాలు చెప్పింది.

యాంగ్జైటీ గురించి చెప్పినందుకు..
ఆస్ట్రేలియాతో సెమీఫైనల్ ముగిసిన తర్వాత జెమీమా మీడియాతో మాట్లాడుతూ.. యాంగ్జైటీతో తాను బాధపడిన క్షణాల గురించి మాట్లాడింది. ఆ వీడియోను దీపికా తన ఇన్స్టా స్టోరీస్ లో షేర్ చేస్తూ ఆమెకు థ్యాంక్స్ చెప్పింది. ఆ వీడియోలో జెమీమా మాట్లాడుతూ.. ఆ కష్ట సమయాలలో అండగా నిలిచిన స్నేహితులు, తోటి క్రీడాకారిణులకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలిపింది.
మానసిక ఆరోగ్య సమస్యలతో తాను పడిన వేదన గురించి ఎప్పుడూ బహిరంగంగా మాట్లాడే దీపికా.. ఈ వీడియోను పోస్ట్ చేస్తూ.. “థాంక్యూ జెమీమా రోడ్రిగ్స్.. మీరు మీ బలహీనతను అంగీకరించినందుకు, మీ కథను పంచుకున్నందుకు” అంటూ ఆమె జెమీమాను అభినందించింది.
జెమీమా రోడ్రిగ్స్ ఏం చెప్పిందంటే?
సెమీఫైనల్లో అద్భుతమైన ఇన్నింగ్స్తో 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు గెలుచుకున్న జెమీమా.. మ్యాచ్ అనంతరం మాట్లాడే సమయంలో భావోద్వేగానికి లోనయింది. తల్లి, స్నేహితుల ముందు తాను ఏడ్చేసిన క్షణాలను, ఆందోళనతో తాను పడిన వేదనను గురించి ఆమె వివరించింది. ఈ టోర్నమెంట్ మొత్తం తనకు మద్దతుగా నిలిచిన తోటి క్రీడాకారిణులకు ధన్యవాదాలు తెలిపింది.
“నేను ఇక్కడ చాలా నిజాయతీగా మాట్లాడుతున్నా. ఎందుకంటే నా మాటలు వింటున్న ఎవరైనా ఇదే పరిస్థితిని ఎదుర్కొంటుంటే, వారికి ఉపయోగపడాలని నేను అనుకుంటున్నాను. బలహీనతల గురించి మాట్లాడటానికి ఎవరూ ఇష్టపడరు” అని జెమీమా చెప్పింది.
“ఈ టోర్నమెంట్ ప్రారంభంలో నేను చాలా యాంగ్జైటీకి గురయ్యాను. కొన్ని మ్యాచ్లకు ముందు కూడా మా అమ్మకు ఫోన్ చేసి చాలా ఏడ్చేదాన్ని. నా బాధనంతా బయటపెట్టేదాన్ని. ఎందుకంటే ఆందోళనలో ఉన్నప్పుడు మొద్దుబారినట్లు అనిపిస్తుంది. ఏం చేయాలో తెలియదు. మామూలుగా ఉండాలని ప్రయత్నిస్తాం. ఆ కష్టకాలంలో మా అమ్మానాన్న చాలా మద్దతు ఇచ్చారు” అని వివరించింది.
ప్రతిరోజు తాను అరుంధతి రెడ్డి ముందు ఏడ్చేదాన్నని జెమీమా చెప్పింది. ఇక స్మృతి మంధానా కూడా తనకు సాయం చేసిందని, రాధా యాదవ్ కూడా తనను బాగా చూసుకుందని జెమీమా తెలిపింది. జట్టు నుంచి తనను తప్పించినప్పుడు పరిస్థితులు మరింత దిగజారాయని ఆమె పంచుకుంది.
“అది నన్ను నిజంగా బాధించింది. జట్టు నుంచి తప్పించినప్పుడు చాలా సందేహాలు వస్తాయి. నేను ఎప్పుడూ జట్టుకు నా వంతు సహకారం అందించాలని కోరుకుంటాను. కానీ ఆ రోజు బయట కూర్చుని నేను ఏమీ చేయలేకపోయాను. ఆ తర్వాత తిరిగి జట్టులోకి వచ్చినప్పుడు గత నెలలో జరిగిన వాటన్నిటితో ఒత్తిడి మరింత ఎక్కువైంది” అని చెప్పింది.
మ్యాచ్ విషయానికి వస్తే జెమీమా 134 బంతుల్లో 127 పరుగులతో అజేయంగా నిలిచింది. భారత్ మహిళల వన్డే చరిత్రలోనే అత్యధిక చేజింగ్ను నమోదు చేసింది. 339 పరుగుల లక్ష్యాన్ని ఐదు వికెట్లు, తొమ్మిది బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది. భారత్ ఇప్పుడు నవంబర్ 2 నాడు జరిగే ఫైనల్ పోరులో సౌతాఫ్రికాతో తలపడనుంది.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్డేట్స్ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


