...
...
Next Story

హాస్పిటల్లో ధర్మేంద్ర వీడియో తీసిన వ్యక్తి అరెస్ట్.. సోషల్ మీడియాలో వీడియో వైరల్ కావడంతో..

ధర్మేంద్ర హాస్పిటల్ బెడ్ పై కదల్లేని స్థితిలో పడుకున్న వీడియో తీసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. అక్కడున్న ఎవరికీ తెలియకుండా వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది వైరల్ గా మారిన విషయం తెలిసిందే.

Published on: Nov 13, 2025, 21:45:52 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

బాలీవుడ్ లెజెండరీ నటుడు ధర్మేంద్ర (89) ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్న విషయం తెలిసిందే. ఈ కష్ట సమయంలో అతని కుటుంబం ప్రైవసీ కోరుతుండగా.. అతడు చికిత్స పొందుతున్న వీడియో బయటకు రావడం సంచలనం రేపింది. ఆ వీడియో తీసిన బ్రీచ్ క్యాండీ హాస్పిటల్ వ్యక్తిని పోలీసులు ఇప్పుడు అరెస్ట్ చేయడం గమనార్హం. నవంబర్ 12న అతడు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడు.

వీడియో రికార్డు చేసిన ఉద్యోగి అరెస్ట్

హాస్పిటల్లో ధర్మేంద్ర వీడియో తీసిన వ్యక్తి అరెస్ట్.. సోషల్ మీడియాలో వీడియో వైరల్ కావడంతో.. (Instagram)
హాస్పిటల్లో ధర్మేంద్ర వీడియో తీసిన వ్యక్తి అరెస్ట్.. సోషల్ మీడియాలో వీడియో వైరల్ కావడంతో.. (Instagram)

వైరల్ అయిన ఈ క్లిప్ బ్రీచ్ క్యాండీ ఆసుపత్రి ఐసీయూ లోపల నుంచి లీక్ అయింది. అందులో ధర్మేంద్ర కదల్లేని స్థితిలో బెడ్‌పై పడుకుని ఉన్నాడు. అతని చుట్టూ అతని కుమారులు బాబీ డియోల్, సన్నీ డియోల్, ఇతర కుటుంబ సభ్యులు, కరణ్ డియోల్, రాజ్‌వీర్ డియోల్ ఉన్నారు. వాళ్లంతా చాలా బాధలో కనిపించారు. ధర్మేంద్ర మొదటి భార్య ప్రకాశ్ కౌర్ కూడా అతని పక్కనే కూర్చుని ఉంది.

డియోల్ కుటుంబానికి సంబంధించిన ఈ అత్యంత వ్యక్తిగత క్షణాన్ని రికార్డు చేసి, సోషల్ మీడియాలో షేర్ చేసిన ఆసుపత్రి ఉద్యోగిని అరెస్టు చేసినట్లు హిందుస్థాన్ టైమ్స్ సిటీకి ప్రత్యేక సమాచారం అందింది. దీనికి సంబంధించిన మరింత సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది.

కుటుంబం అధికారిక ప్రకటన

బుధవారం ఉదయం 7:30 గంటలకు ధర్మేంద్ర ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయి ఇంటికి చేరుకున్నాడు. ఆ తర్వాత కుటుంబం ఒక అధికారిక ప్రకటన విడుదల చేసింది. “ధర్మేంద్ర ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇంట్లోనే తన ఆరోగ్య సంరక్షణను కొనసాగిస్తారు.

మీడియా, ప్రజలు ఇకపై ఎటువంటి ఊహాగానాలు చేయవద్దని, ఈ సమయంలో ఆయన, కుటుంబం ప్రైవసీని గౌరవించాలని మేము అభ్యర్థిస్తున్నాము. ఆయన త్వరగా కోలుకోవడానికి, మంచి ఆరోగ్యానికి, దీర్ఘాయుష్షు కోసం అందరి ప్రేమ, ప్రార్థనలు, శుభాకాంక్షలకు మేము కృతజ్ఞులం. దయచేసి ఆయనను గౌరవించండి. ఎందుకంటే ఆయన మిమ్మల్ని ప్రేమిస్తారు” అని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

ధర్మేంద్ర చనిపోయాడన్న పుకార్లు

అతడు బాగానే ఉన్నాడని, చికిత్సకు స్పందిస్తున్నాడని అతని ఫ్యామిలీ తెలిపింది. రెండు రోజుల తర్వాత హాస్పిటల్ నుంచి ఇంటికి తీసుకెళ్లారు. అయితే ఇప్పటికీ అతని ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉన్నట్లు తెలుస్తోంది.

మీడియాపై సన్నీ డియోల్ ఆగ్రహం

ఇక ధర్మేంద్ర పెద్ద కొడుకు, నటుడు సన్నీ డియోల్ గురువారం (నవంబర్ 13) మీడియాపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న వీడియో కూడా ఒకటి బయటకు వచ్చింది. అందులో ఇంట్లోకి వెళ్తున్న అతన్ని వీడియో తీస్తున్న కొందరిపై సన్నీ కోప్పడ్డాడు. మీ ఇంట్లో కూడా తల్లి, తండ్రి, అక్కా చెల్లెళ్లు ఉంటారు కదా.. కాస్తయినా సిగ్గు తెచ్చుకోండి.. ఇలా వీడియో తీస్తే ఎలా అని అతడు అనడం ఆ వీడియోలో వినిపిస్తోంది.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe