ఫోక్ సాంగ్స్ నుంచి ఇడుపుకాయితం సినిమా వరకు.. తెలంగాణ పిల్ల నాగదుర్గ జర్నీ!
యూట్యూబ్లో తన క్లాసికల్, ఫోక్ స్టెప్పులతో కోట్లాది మంది హృదయాలను కొల్లగొట్టి, తాజాగా టాలీవుడ్లో హీరోయిన్గా ఎంట్రీ ఇస్తోంది నాగదుర్గ. ఇప్పటికే లవ్ ఓ లవ్ అనే తమిళ సినిమాలోనూ నటించింది.
తెలంగాణ మట్టి వాసనలు, జానపద కళలకు సోషల్ మీడియా తోడవడంతో ఎంతోమంది అద్భుతమైన ప్రతిభావంతులు వెలుగులోకి వస్తున్నారు. అలాంటి వారిలో అగ్రవరుసలో నిలిచే పేరు నాగదుర్గ. యూట్యూబ్లో మిలియన్ల కొద్దీ వ్యూస్ రాబడుతూ ఫోక్ స్టార్గా ఎదిగిన ఈ తెలంగాణ బిడ్డ.. ఇప్పుడు టాలీవుడ్లో క్రేజీ ప్రాజెక్ట్తో హీరోయిన్గా మారింది.

నాగదుర్గ స్వస్థలం తెలంగాణలోని నల్గొండ జిల్లా అడ్డగూడూరు. తల్లిదండ్రులు గుత్తా చలపతిరావు, వాసవి దంపతులు ఉద్యోగరిత్యా నల్గొండలో ఉన్నారు. నాగదుర్గ ప్రాథమిక విద్యాభ్యాసం ఇక్కడే సాగింది. పదో తరగతి వరకు నల్గొండలోనే చదువుకున్నది. చిన్నతనం నుంచే నాట్యంపై అమితమైన ఆసక్తి పెంచుకున్న ఆమెకు తల్లి అందించిన ప్రోత్సాహం మరువలేనిది.
నాగదుర్గ ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ హైదరాబాద్లో చేసింది. బీఏ జర్నలిజం పూర్తిచేసింది. పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ నుండి కూచిపూడిలో పీజీ చేసింది. నాట్యంతో పాటు సంగీతం కూడా నేర్చుకుంది. నాగదుర్గ కేవలం ఫోక్ డ్యాన్సర్ మాత్రమే కాదు, ఆమె ఒక ప్రొఫెషనల్ కూచిపూడి నృత్యకారిణి. కాకతీయుల కాలం నాటి పేరిణి నృత్య ప్రక్రియను కూడా ఆమె క్షుణ్ణంగా నేర్చుకున్నారు.
నల్గొండలో స్వయంగా ఒక డాన్స్ అకాడమీని స్థాపించి, ఎంతోమంది చిన్న పిల్లలకు క్లాసికల్ డాన్స్ నేర్పిస్తూ సంప్రదాయ కళలను కాపాడుతోంది. ఇప్పటివరకు ఆమె దేశవ్యాప్తంగా చాలా ప్రదర్శనలు ఇచ్చింది.
తిన్నాతిరం పడ్తలే..
కూచిపూడి కళాకారిణిగా ఉన్న నాగదుర్గ జీవితాన్ని కొవిడ్ లాక్డౌన్ పూర్తిగా మార్చేసింది. ఖాళీ సమయంలో సరదాగా యూట్యూబ్ జానపద గీతాలకు డ్యాన్స్ చేయడం ప్రారంభించిన ఆమె.. ‘తిన్నాతిరం పడ్తలే..’ అనే జానపద పాటతో సోషల్ మీడియా సెన్సేషన్గా మారిపోయింది. ఆమె హావభావాలు, ఎనర్జిటిక్ స్టెప్పులు నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఆ తర్వాత దాదాపు 70కి పైగా ప్రైవేట్ జానపద సాంగ్స్లో సోలో పర్ఫార్మెన్స్ ఇచ్చి ‘ఫోక్ క్వీన్’గా గుర్తింపు తెచ్చుకుంది.
సుకుమార్ నిర్మాణంలో.. ప్రియదర్శి సరసన హీరోయిన్గా లక్కీ ఛాన్స్!
తమిళంలో ‘లవ్ ఓ లవ్’ అనే సినిమాతో వెండితెరకు పరిచయమైన నాగదుర్గ.. ఇప్పుడు టాలీవుడ్లో గ్రాండ్ ఎంట్రీ ఇస్తోంది. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ (సుకుమార్ రైటింగ్స్), స్టార్ ప్రొడ్యూసర్ బన్నీ వాస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ‘ఇడుపు కాయితం’ అనే చిత్రంలో నాగదుర్గ హీరోయిన్గా నటిస్తోంది. వెర్సటైల్ యాక్టర్ ప్రియదర్శి ఈ సినిమాలో హీరో. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల నేపథ్యంలో సాగే ఈ ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామాలో నాగదుర్గ ‘శ్రీలత’ అనే పల్లెటూరి పాత్రలో కనిపించనుంది.
టాలీవుడ్ ప్రొడ్యూసర్కే 15 రూల్స్ పెట్టిన తెలుగమ్మాయి!
ఇటీవలే జరిగిన సినిమా పూజా కార్యక్రమంలో నిర్మాత బన్నీ వాస్.. నాగదుర్గపై చేసిన కామెంట్స్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారాయి. "సాధారణంగా పెద్ద బ్యానర్లో హీరోయిన్ ఛాన్స్ అనగానే ఎవరైనా ఎగిరి గంతేస్తారు. కానీ నాగదుర్గ మాత్రం సినిమా ఒప్పుకునే ముందు మాకు 15 రూల్స్ పెట్టింది. మొదట షాక్ తిన్నా.. ఒక తెలుగమ్మాయికి తన పరిధులు ఏంటో, ఏం చేయాలో, ఏం చేయకూడదో ఉన్న స్పష్టత చూసి ముచ్చటేసింది.' అని బన్నీ వాస్ చెప్పారు.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్ఎడిటర్గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్మెంట్లో భాగంగా ఈటీవీ భారత్కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్స్టైల్, ఎంటర్టైన్మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్సైట్స్ లాంచ్ టీమ్లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


