Gunde Ninda Gudi Gantalu Today Episode: మీనా జీవితం తలకిందులు.. పండగ చేసుకున్న ప్రభావతి.. మేనేజర్‌ను పొడిచిన బాలు!

Gunde Ninda Gudi Gantalu Serial July 20th Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్ జులై 20 ఎపిసోడ్ లో మీనా జీవితం పూర్తిగా తలకిందులు కావడం చూడొచ్చు. డబ్బు మోసపోయి, ఆ విషయం ఇంట్లో చెప్పలేక ఆమె తీవ్రంగా సతమతమవుతుంది. అటు ప్రభావతి మాత్రం పండగ చేసుకుంటుంది.

Published on: Jul 20, 2026, 07:09:26 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Gunde Ninda Gudi Gantalu Serial Today Episode: స్టార్ మా టాప్ సీరియల్ గుండె నిండా గుడి గంటలు ఈరోజు ఎపిసోడ్ లో మీనా పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోవడం, అది చూసి ప్రభావతి తన శాడిజం చూపించడం, బాలుకి నిజం చెప్పినట్లు, అతడు వెళ్లి మేనేజర్ ను పొడిచేసినట్లు మీనా కలగనడంలాంటి సీన్లతో సాగిపోయింది. మొత్తానికి ఈ ఎపిసోడ్ లో మీనా జీవితం తలకిందులవడం చూడొచ్చు.

Gunde Ninda Gudi Gantalu Today Episode: మీనా జీవితం తలకిందులు.. పండగ చేసుకున్న ప్రభావతి.. మేనేజర్‌ను పొడిచిన బాలు!
Gunde Ninda Gudi Gantalu Today Episode: మీనా జీవితం తలకిందులు.. పండగ చేసుకున్న ప్రభావతి.. మేనేజర్‌ను పొడిచిన బాలు!

మీనాను పట్టించుకోని ఓనర్

తనను మేనేజర్ మోసం చేశాడంటూ ఓనర్ దగ్గర మీనా వేడుకునే సీన్ తో సీరియల్ సోమవారం (జులై 20) ఎపిసోడ్ మొదలవుతుంది. కానీ మేనేజర్ మాత్రం అక్కడ కూడా బుకాయిస్తాడు. చింతామణికి తానంటే పడదని, ఇతనితో కలిసి ఆమెనే ఇలా చేసిందని మీనా చెబుతుంది.

ఇప్పుడు మరో అబద్ధం ఆడుతోందంటూ మేనేజర్ అంటాడు. దీంతో ఆ ఓనర్ చిరాకు పడుతూ ఇది మీ ఇద్దరూ చూసుకోవాల్సిన సమస్య.. నన్ను లాగొద్దు.. ఇక నుంచి కొత్త వాళ్లకు ఆర్డర్లు ఇచ్చే ముందు పూర్తిగా వెరిఫై చేసుకో అని చెప్పి వెళ్లిపోతాడు. మీనా ఎంత బతిమాలినా వినాడు.

బాలు వీడియో కాల్.. మీనా ఎమోషనల్

అప్పుడే మీనాకు బాలు వీడియో కాల్ చేస్తాడు. మీనా ఎమోషనల్ అవుతుంది. అసలు విషయం చెప్పేయాలని అనుకుంటుంది. కానీ తాను ట్రిప్ కు తీసుకెళ్లిన వాళ్లను పరిచయం చేస్తాడు బాలు. వాళ్లు తన గురించి, నీ గురించి ఎంతలా పొగిడారా తెలుసా అంటూ చెప్పి మురిసిపోతాడు.

వాళ్లు కూడా నిన్ను కలవాలని అనుకుంటున్నారని బాలు చెబుతాడు. దీంతో మీనా ఇక్కడ జరిగిన మోసం గురించి బాలుకి చెప్పదు. అయితే తాను తర్వాత చేస్తానని ఫోన్ పెట్టేయడంతో మీనా ఎప్పుడూ ఇలా చేయదు.. ఏదో జరిగిందని బాలు అనుమానిస్తాడు.

మీనా ఇంటికి రాగానే ప్రభావతి సంతోషం.. అబద్ధం చెప్పి..

ఇటు ఇంట్లో రవి, శృతి.. ప్రభావతి చెప్పినట్లే హోటల్ నుంచి బిర్యానీ తీసుకొస్తారు. ఎందుకు తీసుకురమ్మన్నావని రవి అడుగుతాడు. అప్పుడే మీనా ఇంట్లోకి వస్తుంది. ఇవాళ నేను చాలా సంతోషంగా ఉన్నాను.. లక్షలు సంపాదిస్తున్నానని విర్రవీగిన వాళ్లు నేల మీదికి వచ్చారు.. ఇక ఇంట్లోనే కూర్చొంటారు అంటూ పరోక్షంగా మీనా గురించి అంటుంది. ఎవరి గురించి మాట్లాడుతున్నావని సత్యం అడగడంతో తనకు పోటీగా డ్యాన్స్ స్కూల్ పెట్టిన మీనాక్షి ఆ స్కూల్ మూసేసిందని ప్రభావతి అబద్ధం చెబుతుంది.

దీనిని పైశాచికానందం అంటారని సత్యం, శృతి అంటారు. ఆ తర్వాత అందరూ బిర్యానీ తినడానికి రెడీ కాగా.. మీనా మాత్రం డల్లుగా కూర్చొని తనకు ఆకలిగా లేదని అంటుంది. రవి, శృతి బతిమాలినా రాదు. ప్రభావతి, రోహిణి, మనోజ్ పీకలదాకా మెక్కుతారు. కానీ మీనాకు ఏదో జరిగింది.. ఏమైందో అడుగుదామని సత్యం, రవి, శృతి ఆమె దగ్గరికి వెళ్తారు.

మీనా ఇక ఆర్డర్లు తీసుకోదని రోహిణికి చెప్పిన ప్రభావతి

ఆ తర్వాత ఉండబట్టలేక అసలు ఏం జరిగిందని ప్రభావతిని అడుగుతుంది రోహిణి. ఇక నిజం దాచలేక ఇదంతా మీనా ఓడిపోయిన సంతోషంలో చేసినట్లు ప్రభావతి చెబుతుంది. ఆమె ఇక జీవితంలో కొత్త ఆర్డర్లు తీసుకోదని, ఇక ఇంటికే పరిమితమవుతుందని అంటుంది.

లక్షలు సంపాదిస్తున్నానని విర్రవీగింది కదా.. ఇప్పుడిక ఆమె పనైపోయినట్లే అని చెబుతుంది. ఈ విషయం మీకెలా తెలుసని అడిగితే.. చింతామణి చెప్పిందని అంటుంది. ప్రభావతి సంతోషం చూసి రోహిణి కంగారు పడుతుంది. ఏ తప్పూ చేయని మీనాకే ఇలా జరిగితే.. తనకు ఏం జరుగుతుందో అని రోహిణి లోలోపల భయపడుతుంది.

సత్యం, రవి దగ్గర నిజం దాచిన మీనా

అటు సత్యం, రవి, శృతి కలిసి మీనా దగ్గరికి వెళ్తారు. తినమంటే తినలేదు.. ఇలా ఒంటరిగా పైకి వచ్చి ఎందుకు బాధపడుతున్నావని అడుగుతారు. కానీ మీనా మాత్రం నిజం చెప్పదు. పని ఎక్కువైంది కదా తలనొప్పిగా ఉందని అబద్ధం చెబుతుంది. సత్యం, రవి పదేపదే అడగడంతో కాస్త చిరాకు పడుతుంది. ఏమీ కాలేదని చెబితే వినరేంటని అంటుంది. సరే కానీ.. ఇలా ఎక్కువసేపు ఒంటరిగా ఉండకు అని చెప్పి వెళ్లిపోతారు.

ప్రభావతిని నిలదీసిన సత్యం

కిందికి వచ్చిన తర్వాత ప్రభావతిని సత్యం నిలదీస్తాడు. మీనా బాధగా ఉంది.. నువ్వు సంతోషంగా ఉన్నావు.. నువ్వేమైనా అన్నావా అని అడుగుతాడు. నాకెప్పుడూ అదే పనా అని బుకాయించి ప్రభావతి వెళ్లిపోతుంది. ఆ తర్వాత రవి, శృతిలోనూ అదే అనుమానం కలుగుతుంది. అమ్మే వదినను ఏదో అన్నట్లుంది అని రవి అంటాడు.

మీనాకు పీడకల.. మేనేజర్‌ను పొడిచేసిన బాలు

ఆ తర్వాత మీనాకు ఓ పీడకల వస్తుంది. అందులో బాలు ఇంటికి రాగానే మీనా నిజం చెప్పి ఏడుస్తుంది. నువ్వే తప్పూ చేయలేదు.. తప్పు చేసిన వాడిని తన్నయినా సరే డబ్బు వసూలు చేసుకుందాం అని ధైర్యం చెబుతాడు. మరుసటి రోజు ఉదయమే మేనేజర్ దగ్గరికి ఆవేశంగా వెళ్లిన బాలు అతన్ని చితకబాదుతాడు.

మా ఆవిడను మోసం చేస్తావా అంటూ నిలదీస్తే.. అదే మోసగత్తె అని మేనేజర్ అంటాడు. దీంతో అక్కడే ఉన్న కత్తి తీసి అతన్ని పొడుస్తాడు బాలు. మీనా ఉలిక్కి పడి నిద్ర లేస్తుంది. కల కావడంతో ఊపిరి పీల్చుకుంటుంది.

మీనాకు బాలు ఫోన్.. నిజం చెప్పని మీనా

అప్పుడే మీనాకు బాలు ఫోన్ చేస్తాడు. ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయడం లేదని అడుగుతాడు. ఇంట్లో పనులు ఆలస్యం కావడంతో చూసుకోలేదని చెబుతుంది. మిగిలిన పేమెంట్ వచ్చేసిందా.. అందరికి ఇవ్వాల్సింది ఇచ్చేశావా అని అడుగుతాడు. ఇంకా రాలేదు.. రేపు ఇస్తానన్నారు అని మీనా అబద్ధం చెబుతుంది. సరే డబ్బు రాగానే అందరికీ ఇవ్వు.. మనల్ని నమ్మి వచ్చిన వాళ్లకు ఆలస్యం చేయొద్దని చెబుతాడు బాలు.

మీనాకు సింగరాజు ఫోన్.. డబ్బు గురించి డిమాండ్

అటు ఉదయమే మీనాకు చింతామణి భర్త, ఫైనాన్షియర్ అయిన సింగరాజు ఫోన్ చేస్తాడు. డెకరేషన్ పూర్తయినా ఇంకా డబ్బు ఎందుకు ఇవ్వలేదని అడుగుతాడు. వాళ్లు ఇంకా ఇవ్వలేదని, ఇవ్వగానే మీ డబ్బు తిరిగి ఇచ్చేస్తానని మీనా అంటుంది. నీమీద నమ్మకంతో ఇచ్చానని, ఆ నమ్మకం నిలబెట్టుకుంటే మరెప్పుడు అవసరం అయినా ఇస్తానని అంటాడు.

అతనికి డబ్బు ఎలా ఇవ్వాలా అని బాధపడుతూ కూర్చొంటుంది మీనా. అప్పుడే ఆమె దగ్గర పని చేసిన వాళ్లు కూడా వస్తారు. తన కూతురిని హాస్పిటల్లో చేర్చామని, తనకు రావాల్సిన డబ్బు ఇవ్వమని ఆమె అడుగుతుంది. దీంతో ఏం చేయాలో తోచక మీనా ఆలోచనలో పడుతుంది. అక్కడితో గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More