Gunde Ninda Gudi Gantalu Today Episode: చింతామణి భర్త దగ్గరే మీనా అప్పు.. నిండా మునిగిన పూలగంప.. ఈవెంట్ మేనేజర్ మోసం
Gunde Ninda Gudi Gantalu Serial July 17th Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్ జులై 17 ఎపిసోడ్ లో మీనా దారుణంగా మోసపోతుంది. చింతామణితో చేతులు కలిపిన ఈవెంట్ మేనేజర్ మీనాను మోసం చేస్తాడు. ఈ విషయం తెలిసి ప్రభావతి తెగ సంతోషిస్తుంది.
Gunde Ninda Gudi Gantalu Serial Today Episode: స్టార్ మా టాప్ సీరియల్ గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్ లో చింతామణి అన్నంత పని చేస్తుంది. ఈవెంట్ మేనేజర్ తో కలిసి మీనాను దారుణంగా మోసం చేస్తుంది. లక్ష అడ్వాన్స్ ఇచ్చి పది లక్షలు ఇచ్చినట్లుగా మేనేజర్ చెప్పడంతో మీనా లబోదిబోమంటుంది. అటు చింతామణి భర్త దగ్గరే ఆమె అప్పు చేయడం మరో పెద్ద ట్విస్ట్.

చింతామణి భర్త దగ్గరే మీనా అప్పు
గుండె నిండా గుడి గంటలు సీరియల్ శుక్రవారం (జులై 17) ఎపిసోడ్ ఫైనాన్షియర్ దగ్గరికి డబ్బు కోసం మీనా వెళ్లే సీన్ తో మొదలైంది. అసలు ట్విస్ట్ ఏంటంటే.. ఆ ఫైనాన్షియర్ చింతామణి భర్తే కావడం. డబ్బు విషయంలో చాలా కఠినంగా ఉండే ఆ వ్యక్తి.. మీనా చెప్పిన మాటలు, ఆమె కష్టం గురించి విని ఎలాంటి ష్యూరిటీ లేకుండానే రూ.లక్షలు డబ్బు ఇస్తాడు.
నీలాగా కష్టపడి పైకి ఎదిగిన వాళ్లంటే తనకు గౌరవమని అంటాడు. అయితే డబ్బు ఇచ్చేటప్పుడు తాను దేవుడిలా కనిపించినా.. అడిగేటప్పుడు మాత్రం రాక్షసుడిలా మారకుండా చూసుకోమని ముందే వార్నింగ్ ఇస్తాడు. తాను నష్టం వచ్చే వ్యాపారం చేయడం లేదని, జూదం కాదని, పూల డెకరేషన్ కావడంతో అనుకున్న సమయానికే డబ్బు వస్తుందని, తిరిగి ఇస్తానని చెప్పి వెళ్లిపోతుంది.
అదిరిపోయే డెకరేషన్ చేసిన మీనా
ఆ డబ్బుతో మీనా చెప్పినట్లే అదిరిపోయే డెకేషన్ చేస్తుంది. ఇప్పటి వరకూ తాను ఎప్పుడూ చేయని రీతిలో డెకరేషన్ తో అదరగొడుతుంది. ఆమెకు సాయం చేసిన వాళ్లు కూడా మీనాను తెగ మెచ్చుకుంటారు. ఏకంగా రూ.10 లక్షల ఆర్డర్ సంపాదించావ్.. నీ కష్టం ఇందులో స్పష్టంగా కనిపిస్తుందని అంటారు. ఇది అందరి కష్టం అంటూ వాళ్లతో కలిసి ఆ డెకరేషన్ ముందు మీనా సెల్ఫీ దిగుతుంది.
బాలుకి మీనా వీడియో కాల్
ఆ తర్వాత బాలుకి మీనా వీడియో కాల్ చేస్తుంది. డెకరేషన్ పూర్తయిందని, ఎలా వచ్చిందో చూడమని అంటుంది. అద్భుతంగా వచ్చిందని బాలు మెచ్చుకుంటాడు. తన భార్య చేసిన పని చూసి మురిసిపోతాడు. తన ట్రిప్ కూడా చాలా బాగా సాగుతోందని, తాను కూడా త్వరలోనే వస్తానని అంటాడు.
వెంటనే ఈవెంట్ మేనేజర్ దగ్గరికి వెళ్లి మిగిలిన డబ్బు తీసుకొని ఆ ఫైనాన్షియర్ కు ఇచ్చేసెయ్.. బిజినెస్ లో నమ్మకం చాలా ముఖ్యం అని మీనాకు చెబుతాడు బాలు. సరే అని మీనా అంటుంది. తాను ఉదయాన్నే మళ్లీ రావాలని, వెళ్తానని చెబుతుంది.
మీనాను మోసం చేసిన ఈవెంట్ మేనేజర్
ఉదయాన్నే ఈవెంట్ మేనేజర్ దగ్గరికి మీనా వెళ్తుంది. డెకరేషన్ అద్భుతంగా చేశావని, అది చూసి చాలా మంది నాకు కాల్స్ చేస్తున్నారని మెచ్చుకుంటాడు. ఇక తాను వెళ్తానని అనడంతో మిగిలిన డబ్బు ఇవ్వండని మీనా అడుగుతుంది. ఏం డబ్బు.. మొత్తం ముందే ఇచ్చేశాను కదా అని మేనేజర్ అనడంతో మీనా షాక్ తింటుంది.
లక్షే కదా ఇచ్చారు.. మిగిలిన డబ్బు డెకరేషన్ పూర్తయిన తర్వాత ఇస్తామన్నారు కదా అని మీనా అంటుంది. కానీ మేనేజర్ మాత్రం బుకాయిస్తాడు. అగ్రీమెంట్ పేపర్లలో లక్ష బదులు పది లక్షలుగా మార్చి దీనిపై సంతకం కూడా చేశావు కదా అంటూ ఆమె ముందు పెడతాడు. తాను సంతకం పెట్టినప్పుడు లక్షే ఉందని మీనా అంటుంది.
గట్టి దెబ్బే కొట్టిన చింతామణి
ఇదంతా పక్కనే ఉండి గమనిస్తున్న చింతామణి.. తన మనిషిని పంపిస్తుంది. ఆ వ్యక్తి రాగానే ఈవెంట్ మేనేజర్ ఆ అగ్రీమెంట్ ను చూపిస్తాడు. ఇందులో పది లక్షలు రాసి ఉంది కదా అని అతడు కూడా అంటాడు. మొత్తం డబ్బు తీసుకొని మోసం చేయాలని చూస్తున్నావా అని మేనేజర్ అనడంతో మీనా అతని కాలర్ పట్టుకుంటుంది.
అప్పు చేసి మరీ డబ్బు తీసుకొచ్చానని, తనతోపాటు చేసిన వాళ్లకు కూడా డబ్బు ఇవ్వాలని, తనను మోసం చేయొద్దని వేడుకుంటుంది. కానీ అతని మనసు కరగదు. మనుషులను పిలిపించి మీనాను బలవంతంగా బయటకు గెంటేస్తాడు. అది చూసి చింతామణి అసిస్టెంట్ మీరు చేసిన ప్లాన్ ఇదేనా అని అంటాడు.
ఆమె అవునని అంటుంది. మీనా ఇక ఎప్పటికీ డెకరేషన్ చేయదని, తనతో చేతులు కలపాలని ముందే ఆఫర్ ఇచ్చినా.. సొంతంగా ఎదుగుతానని గర్వంగా చెప్పిందని, ఇప్పుడిక కోలుకోలేదని అంటుంది. మేనేజర్ వచ్చి ఆ డబ్బు ఏం చేయమంటారని అడుగుతాడు. ప్రస్తుతానికి అలాగే ఉంచు.. తర్వాత చూద్దామని అంటుంది.
ప్రభావతికి చింతామణి ఫోన్.. గుడ్ న్యూస్ అంటూ..
ఆ వెంటనే ప్రభావతికి చింతామణి ఫోన్ చేస్తుంది. మీకో గుడ్ న్యూస్ అని చెబుతుంది. తాను అనుకున్నట్లే చేశానని, మీనా ఇక ఎప్పటికీ డెకరేషన్ చేయదని, ఇంట్లో కిచెన్ లోనే పడి ఉంటుందని అంటుంది. దీంతో ప్రభావతి తెగ సంతోషిస్తుంది. ఈరోజు ఉదయం లేచి ఎవరి ముఖం చూశానో కానీ.. తనకు అంతా మంచే జరుగుతోందని సంబరపడిపోతుంది. అసలు ఎలా జరిగిందని అడిగినా చింతామణి చెప్పదు. మీ కోడలు ఏడుస్తూ ఇంటికి వస్తుంది.. ఏం జరిగిందో ఆమెనే అడగండి అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది.
రవికి ప్రభావతి ఫోన్.. పండగ చేసుకోవాల్సిన రోజంటూ..
ఆ ఆనందంలో ప్రభావతి వెంటనే రవికి ఫోన్ చేస్తుంది. మీ హోటల్లో ఇవాళ ఏమేం వండారో అన్నీ పార్శిల్ తీసుకొని రా.. ఇవాళ ఎంతో సంతోషంగా ఉంది.. ఇంటి ఫుడ్ కాకుండా మీ హోటల్ ఫుడ్ కడుపు నిండా తినాలని ఉంది.. ఫుడ్ తోపాటు స్వీట్లు కూడా తీసుకురా.. ఇవాళ పండగ చేసుకోవాల్సిన రోజు అని అంటుంది. అసలు ఏం జరిగిందో అర్థం కాక రవి ఏమైందని అడుగుతాడు. అది తనకు మాత్రమే గుడ్ న్యూస్ అని, నువ్వయితే వచ్చేటప్పుడు ఫుడ్ అంతా పట్టుకురా అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది.
ఓనర్ను కలిసి మేనేజర్పై మీనా ఫిర్యాదు
ఇటు మీనా ఏడుస్తూ డెకరేషన్ లు చేసే ఓనర్ దగ్గరికి వెళ్తుంది. ఈవెంట్ మేనేజర్ పై ఫిర్యాదు చేస్తుంది. తాను ఎంతో కష్టపడి అప్పు తెచ్చి మరీ డెకరేషన్ చేశానని, మీ మేనేజర్ కేవలం లక్ష ఇచ్చి పది లక్షలు ఇచ్చినట్లు చెబుతున్నారని ఫిర్యాదు చేస్తుంది. దీంతో అతడు వెంటనే మేనేజర్ ను పిలుస్తాడు. ఆ అమ్మాయి అబద్ధం చెబుతోంది సార్.. ముందే మొత్తం డబ్బు ఇచ్చినట్లు అగ్రీమెంట్ పై సంతకం కూడా పెట్టిందని ఆ పేపర్లు చూపిస్తాడు.
అందులో లక్షకు మరో సున్నా జోడించి పది లక్షలుగా చేశారని, తాను కేవలం లక్షే తీసుకున్నానని మీనా చెబుతుంది. ఇద్దరూ గట్టిగా వాదించుకోవడంతో ఆ ఓనర్ చిరాకు పడతాడు. అయినా ఇలాంటి పనులు చింతామణికే ఇస్తావు కదా.. ఈమెకు ఎందుకు ఇచ్చావని మేనేజర్ ను అడగడంతో మీనా షాక్ తింటుంది. ఆమె కష్టం తెలిసి జాలి పడి ఇచ్చానని, ఇప్పుడిలా చేస్తోందని అతడు అంటాడు. కొత్త వాళ్లకు ఇచ్చే ముందు ఒకటికి పదిసార్లు ఆలోచించాలని ఓనర్ చెబుతాడు. మీనా అలా షాక్ లో ఉండిపోతుంది. అక్కడితో గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్డేట్స్ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


