Gunde Ninda Gudi Gantalu Today Episode: మీనా, బాలును దారుణంగా అవమానించిన శోభ.. గడ్డి పెట్టిన రోహిణి.. మనోజ్‌కు చూపు

Gunde Ninda Gudi Gantalu July 13th Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్ జులై 13 ఎపిసోడ్ లో ఇంటికి వచ్చి మరి బాలు, మీనాలను దారుణంగా అవమానిస్తుంది శృతి తల్లి శోభన. మరోవైపు మనోజ్ కు పోయిన చూపు తిరిగి వస్తుంది.

Published on: Jul 13, 2026, 07:21:06 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Gunde Ninda Gudi Gantalu Today Episode: స్టార్ మా టాప్ సీరియల్ గుండె నిండా గుడి గంటలు ఈరోజు ఎపిసోడ్ లో మనోజ్ కు చూపు తిరిగొచ్చిందని ఇంట్లో వాళ్లు సంతోషించేలోపే శోభన వచ్చి కొత్త గొడవ మొదలుపెడుతుంది. తన కూతురిని ఎందుకు పనికి పంపిస్తున్నారంటూ రచ్చ చేస్తుంది. బాలు, మీనాతోపాటు ఇంట్లో వాళ్లందరూ ఆమెకు కాస్త గట్టిగానే గడ్డి పెడతారు.

Gunde Ninda Gudi Gantalu Today Episode: మీనా, బాలును దారుణంగా అవమానించిన శోభ.. గడ్డి పెట్టిన రోహిణి.. మనోజ్‌కు చూపు
Gunde Ninda Gudi Gantalu Today Episode: మీనా, బాలును దారుణంగా అవమానించిన శోభ.. గడ్డి పెట్టిన రోహిణి.. మనోజ్‌కు చూపు

విద్యకు మీనా ప్రేమ పాఠాలు

రోహిణి ఫ్రెండ్ విద్య తన బాయ్‌ఫ్రెండ్ మురళీతో కలిసి గుడికి వెళ్లే సీన్ తో సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ మొదలైంది. అక్కడి నుంచే మీనాకు ఫోన్ చేసి ఏం చేయాలని అడుగుతుంది. ఇద్దరం ఒకరి ఇష్టాయిష్టాల గురించి రాసి ఇచ్చుకున్నామని చెబుతుంది. అయినా సరే ఇప్పుడే తొందర పడకు.. అతడు ప్రేమిస్తున్నానని చెప్పినా కాస్త టైమ్ తీసుకో అంటూ విద్యకు మీనా ప్రేమ పాఠాలు చెబుతుంది. ఆమె సరే అంటుంది.

మనోజ్ పాలు బాలు పొట్టలోకి..

ఇటు ఇంట్లో మనోజ్ కోసం రోహిణి పాలు తీసుకొస్తుంది. అవి వేడిగా ఉండటంతో తర్వాత తాగుతాను అక్కడ పెట్టి వెళ్లమనడంతో ఆమె వెళ్లిపోతుంది. ఈ టైమ్ లో అతడు కాస్త కునుకేస్తాడు. ఇంతలో బాలు వచ్చి ఆ పాలన్నీ తాగేస్తాడు. మనోజ్ నోటికి కాస్త పాలు అంటించి అతడే తాగినట్లుగా క్రియేట్ చేస్తాడు. పాలు చల్లారిపోయి ఉంటాయి.. తాగుదామని మనోజ్ చూస్తే అందులో పాలు ఉండవు. రోహిణి వచ్చి పాలు తాగేశావా ఇక వెళ్దామని అంటుంది. తాను తాగలేదని చెప్పినా వినదు.

ప్రభావతికి హ్యాండిచ్చిన మనోజ్

ఇంతలో ప్రభావతి కూడా వస్తుంది. తాను పాలు తాగలేదని చెప్పినా రోహిణి వినడం లేదని మనోజ్ అంటాడు. ఆమె కూడా పెద్దగా పట్టించుకోదు. కానీ తల్లి మాట వినగానే.. నిన్ను చూడకుండా ఇప్పటికే 24 గంటలపైనే అయింది.. అంటూ కాస్త సెంటిమెంట్ డైలాగులు చెప్పడంతో ఆమె కరిగిపోతుంది.

ప్రభావతి అక్కడి నుంచి వెళ్లిపోగానే నిజానికి మా అమ్మ కంటే నిన్ను చూడాలనే నా కళ్లు తహతహలాడుతున్నాయని రోహిణితో అంటాడు. ఏదో మా అమ్మను అలా ఐస్ చేశాను అని చెబుతాడు. ప్రభావతి అక్కడే ఉండటం చూసిన రోహిణి మనోజ్ ను వారిస్తున్నా అతడు వినడు. దీంతో ఆ మాటలు విని ఆమె రుసరుసలాడుతూ వెళ్లిపోతుంది.

బిచ్చగాడిని లోనికి తీసుకొచ్చిన మనోజ్

మరుసటి రోజు తన కోసం ఓ క్లైంట్ వస్తాడని, ఇంట్లోకి పిలిచి కూర్చోబెట్టు.. ఓ కాల్ మాట్లాడి వస్తానని మనోజ్ ను హాల్లో కూర్చోబెట్టి రోహిణి వెళ్తుంది. ఇంతలో ఇంటికి అడుక్కునే వాడు వచ్చి అమ్మా అని పిలిస్తే క్లైంట్ ఏమో అనుకొని బిచ్చగాడిని లోనికి పిలుస్తాడు మనోజ్. సార్ అంటూ మర్యాద చేస్తాడు. ఇదేదో కంటి ఆపరేషన్ బాపతులా ఉందనుకొని ఆ బిచ్చగాడు కూడా దర్జాగా కాలుమీద కాలేసుకొని కూర్చొంటాడు.

మీరేం బిజినెస్ చేస్తారని మనోజ్ అడుగుతాడు. అసలు ఇన్వెస్ట్‌మెంట్ లేని బిజినెస్.. డబ్బు వస్తూనే ఉంటుంది అని అతడు చెప్పడంతో మనోజ్ ఆశ పడతాడు. ఆ తర్వాత అందరూ వచ్చి చూసి ఏం చేస్తున్నావని మనోజ్ ను తిట్టి బిచ్చగాడిని వెళ్లగొడతారు. నీకు బాగా తెలిసిన బిజినెసే లేరా అంటూ మనోజ్ ను బాలు ఆట పట్టిస్తాడు.

మనోజ్‌తో ఆడుకున్న బాలు

అటు మనోజ్ తో బాలు మరోసారి ఆడుకుంటాడు. అతడు ఒక్కడే హాల్లోకి రావడంతో కుర్చీ అడ్డుగా పెట్టి కాలికి గాయమయ్యేలా చేస్తాడు. దేవుడి దగ్గరకు తీసుకెళ్లమంటే మరో చోటికి తీసుకెళ్లి దేవుడొచ్చాడు దండం పెట్టుకో అని అంటాడు. మనోజ్ ఎటో చూస్తూ తనలాంటి మంచి వాళ్లకు ఎందుకీ కష్టాలు.. త్వరగా చూపునివ్వు అని వేడుకుంటాడు. వీడు దేవుడితోనూ అబద్ధాలు ఆడుతున్నాడని బాలు అనుకుంటాడు.

ఆ తర్వాత మనోజ్ ను తీసుకెళ్లి కుర్చీలో కూర్చోబెట్టినట్లు చేసి కింద పడేస్తాడు. హాస్పిటల్లో నీ డబ్బేదో నేను తీసుకున్నానని ఆడిపోసుకున్నావు కదా.. ఇప్పుడు నాకు క్షమాపణ చెప్పు నీకు కళ్లు తిరిగి వస్తాయని బాలు అంటాడు. దేవుడిలాంటి బాలుని అపార్థం చేసుకున్నాను.. నన్ను క్షమించు అని చెప్పి లెంపలేసుకోమని మనోజ్ తో చెబుతాడు. అతడు అలాగే చేస్తాడు. నీకు కళ్లు వస్తాయిలే అని చెప్పి బాలు వెళ్లిపోతాడు. పక్కకెళ్లి నర్సుకు ఫోన్ చేసి ఇక కట్లు విప్పమని అంటాడు.

కట్లు విప్పిన నర్సు.. మనోజ్‌ను ఇరికించిన బాలు

అటు కాసేపటికి రోహిణి పరుగెత్తుకుంటూ వచ్చి పెద్ద గుడ్ న్యూస్ అంటూ మనోజ్ కు చెబుతుంది. నీ కళ్లు తిరిగి వస్తున్నాయి.. కట్లు విప్పడానికి నర్సు వస్తోందని చెబుతుంది. అది విని మనోజ్ సంతోషిస్తాడు. అయితే నర్సు వచ్చి కట్లు విప్పే సమయానికి మనోజ్ ను బాలు ఇరికిస్తాడు.

నీకు కళ్లు రాగానే ముందు ఎవరి ముఖం చూస్తావు.. అమ్మదా, నీ భార్యదా అని అనడంతో వీడు ఇరికించాడు కదా అని మనోజ్ మనసులో అనుకుంటాడు. ఇద్దరి ముఖాలు చూస్తానని మనోజ్ కవర్ చేసుకుంటాడు. ఆ తర్వాత నర్సు కట్లు విప్పుతుంది. మెల్లగా కళ్లు తెరవగానే ప్రభావతి, రోహిణి ఇద్దరూ మనోజ్ కు కనిపిస్తారు. అయితే మసకమసకగా ఉందంటూ మనోజ్ కంగారు పడతాడు. కళ్లు రాగానే సైట్ ఉందని మరచిపోతే ఎలా అంటూ కళ్లద్దాలు తెచ్చి పెడతాడు బాలు.

ఇంటికి వచ్చి గొడవ పెట్టుకున్న శోభన..

మనోజ్ ఎపిసోడ్ ముగియగానే ఇంటికి శృతి తల్లి శోభన వస్తుంది. వచ్చీ రాగానే ప్రభావతి, మీనాలతో గొడవ పెట్టుకుంటుంది. అప్పుడే బాలు, మనోజ్, రోహిణి కూడా వస్తారు. బ్లాంక్ చెక్కు తీసి ఇవ్వబోతుంది. నీకు ఇలా చెక్కులు తీసి పంచడం అలవాటా అని బాలు ఎగతాళి చేస్తాడు.

అయినా ఇప్పుడు మళ్లీ ఏమైందని అడుగుతాడు. తన కూతురిని రెస్టారెంట్లో పేట్లు కడిగే పని చేయిస్తారు.. మీ ఇంట్లో తిండికి కూడా గతి లేదని నాకు అర్థమైందని శోభన అనడంతో ఇంట్లో వాళ్లందరూ కలిసి కట్టుగా శోభకు క్లాస్ పీకుతారు. రోహిణి కూడా రంగంలోకి దిగుతుంది.

ఏనాడూ మా అత్తమామలు మేము సంపాదించిన డబ్బు అడగలేదు.. శృతి డబ్బు కోసం కాదు రవితో టైమ్ గడపడానికి వెళ్తోందని అంటుంది. తాను కూడా పార్లర్ కు వెళ్తానని, మీనా కూడా పూల డెకరేషన్ చేస్తుందని చెబుతుంది. నువ్వు చేసే పనిలో డిగ్నిటీ ఉంది కానీ.. పూలు అమ్ముకునే వాళ్లు, డ్రైవర్లతో తన కూతురిని పోల్చొద్దని బాలు, మీనాలను శోభన దారుణంగా అవమానిస్తుంది. అక్కడితో గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More