Gunde Ninda Gudi Gantalu Today Episode: మనోజ్కు యాక్సిడెంట్ - కళ్లు కోల్పోయి - శపించిన బాలు - గుండె పగిలిన ప్రభావతి
Gunde Ninda Gudi Gantalu July 7th Episode: గుండె నిండా గుడి గంటలు సీరియ్ జులై 7 ఎపిసోడ్ లో మనోజ్ కు జరిగిన యాక్సిడెంట్ అతని కుటుంబాన్ని మొత్తం షాక్కు గురి చేస్తుంది. నీ కళ్లు పోతాయ్ అని బాలు శపించిన కాసేపటికే అతనికి ప్రమాదం జరగడంతో ప్రభావతి అతన్నే నిందిస్తుంది.
Gunde Ninda Gudi Gantalu Today Episode: స్టార్ మా టాప్ సీరియల్ గుండె నిండా గుడి గంటలు ఈరోజు ఎపిసోడ్ లో ఊహించని ట్విస్ట్ ఎదురైంది. బాలు శపించడం, మనోజ్ ప్రమాదంలో కళ్లు కోల్పోవడం, ప్రభావతి, సత్యం గుండెలు పగిలేలా ఏడవడం ఈ ఎపిసోడ్ ను ఎమోషనల్ గా మార్చేశాయి.

సత్యంను అవమానించిన మనోజ్.. చితకబాదిన బాలు
లేటెస్ట్ ఎపిసోడ్ మొదట్లోనే మనోజ్ తన నేమ్ ప్లేట్ ను మరోసారి బిగించడానికి ప్రయత్నిస్తుంటాడు. ఇంతలో మణికంఠ వస్తాడు. తన చెల్లెలు డిగ్రీ చేయాలనుకుంటోందని, అందుకే నువ్వు చదివిన డిగ్రీలు కాకుండా మరేదైనా డిగ్రీ చదివించడానికి నీ నేమ్ ప్లేట్ చూసి వెళ్దామని వచ్చానని చెప్పడంతో మనోజ్ కు మండుతుంది.
లోనికి వెళ్లిన తర్వాత బాలుతో గొడవ జరుగుతుంది. తాను కాబట్టి ఇన్ని డిగ్రీలు చదివానని గొప్పలు చెప్పుకుంటాడు. నాన్న చదివించకపోతే చదివే వాడివా అని బాలు అంటాడు. ఆయనకు చదువు రాదు.. డ్రైవింగ్ వచ్చు కాబట్టి డ్రైవర్ గా ఉద్యోగం వచ్చింది.. నాకు టాలెంట్ ఉంది కాబట్టి ఇన్ని డిగ్రీలు చదవగలిగాను అని గొప్పలు చెప్పుకోవడం బాలుకు మండుతుంది. అదే నేమ్ ప్లేట్ తో అతన్ని చితకబాదుతాడు.
అన్నను శపించిన బాలు
దీంతో ఇంట్లో వాళ్లందరూ వస్తారు. మనోజ్ ఏం చేశాడో బాలు, మీనా చెబుతారు. అది విని రవి కూడా అతన్ని తిడతాడు. అందరి ముందే బాలు మరోసారి అతన్ని బాదుతాడు. అంతేకాదు నాన్నను ఆ మాట అన్నందుకు నీ కళ్లు పోతాయ్.. సర్వ నాశనం అవుతావని శపిస్తాడు. దీంతో రోహిణి అతన్ని తీసుకొని వెళ్లిపోతుంది. తర్వాత ప్రభావతితోనూ బాలు గొడవ పడతాడు.
నీవల్లే వాడు ఇలా తయారయ్యాడు.. ఇంకా వాడిని వెనకేసుకొస్తున్నావ్.. అసలు మనిషివేనా అని తిడతాడు. నీ ఇంటి సొమ్ము తెచ్చి వాడిని చదివించావా.. నాన్న కష్టార్జితంతోనే చదివించాడని బాలు అంటాడు. మరోసారి కళ్లు పోతాయ్ అంటూ శపించడంతో సత్యం వారిస్తాడు. సుందరి పెళ్లి కోసం ఏదైనా ఫర్నీచర్ తీసుకుందామనుకున్నాం కదా.. వెళ్దాం పద అని అతన్ని తీసుకొని వెళ్తాడు.
షాపులో రోహిణి, మనోజ్ గొడవ
అటు షాపుకి వెళ్లిన తర్వాత కూడా మనోజ్ కోపంగానే ఉంటాడు. ఆ కోపాన్ని పనివాళ్ల మీద చూపిస్తాడు. దీంతో రోహిణి వారిస్తుంది. ఆమెతోనూ మనోజ్ గొడవ పడతాడు. అందరికీ నేను చేసిందే తప్పుగా అనిపిస్తుంది.. నేను మాట్లాడితే తప్పంటారు అంటూ అక్కడి నుంచి వెళ్లిపోతాడు.
షాపుకి వచ్చి రోహిణికి షాకిచ్చిన మేక మామ
మనోజ్ వెళ్లిపోగానే షాపులోకి హెల్మెట్ పెట్టుకొని మేక మామ వస్తాడు. అతన్ని చూసి రోహిణి షాక్ తింటుంది. తన అక్క కొడుకు పెళ్లి ఉందని, ఏదైనా గిఫ్టుగా ఇద్దామని వచ్చినట్లు చెబుతాడు. తనకు ఇంత సాయం చేశావ్.. నీకు ఈమాత్రం చేయలేనా అంటూ ఫర్నీచర్ చూపిస్తుంది రోహిణి. ఓ బీరువా సెలెక్ట్ చేసి వెళ్లిపోతుంటే బాలు, సత్యం వస్తారు.
మాణిక్యంను చూసి బాలు డౌట్.. రోహిణి కంగారు
దీంతో మాణిక్యం హెల్మెట్ పెట్టుకొని వెళ్లిపోతుంటాడు. అతన్ని చూసి బాలుకి డౌట్ వస్తుంది. అతని ఫోన్ అక్కడే వదిలేసి వెళ్తుండటంతో బాలు పిలుస్తాడు. దీంతో రోహిణి, మాణిక్యం భయపడతారు. ఫోన్ మరచిపోయారని చెబుతాడు. షాపులోనూ హెల్మెట్ ఎందుకు పెట్టుకున్నావని అడిగినా.. అతడు తనకు దుమ్ముంటే పడదని ఏదో కవర్ చేసి వెళ్లిపోతాడు. తర్వాత బాలు, సత్యం అక్కడ ఫర్నీచర్ చూస్తారు.
విల్లా విజయ్ వెంట పడుతూ మనోజ్కు యాక్సిడెంట్
మనోజ్ కారులో వెళ్తూ తల నొప్పిగా ఉందంటూ ట్యాబ్లెట్ కోసమని దిగుతాడు. ఇంతలో రోడ్డుపై అతనికి తనను రూ.30 లక్షలు ముంచిన విల్లా విజయ్ కనిపిస్తాడు. దీంతో తన డబ్బు ఏదంటూ అతని వెంట పడతాడు. అతడు పారిపోతుండటంతో రోడ్డుపై అలాగే అతని వెంట పడతాడు మనోజ్. ఈ క్రమంలో ఓ వ్యాను అతన్ని ఢీకొడుతుంది. ముందు అద్దం పగిలి అతని కళ్లకు ప్రమాదం జరుగుతుంది. అక్కడుతున్న వాళ్లందరూ అది చూసి మనోజ్ ను హాస్పిటల్ కు తీసుకెళ్తారు.
మనోజ్కు సర్జరీ.. ప్రభావతి, సత్యం కంటతడి
మనోజ్ యాక్సిడెంట్ విషయం ప్రభావతికి ఫోన్ చేసి చెబుతుంది రోహిణి. దీంతో ఆమె గుండె పగిలేలా ఏడుస్తుంది. అప్పుడే ఇంటికి వచ్చిన బాలునే దీనికి కారణమని నిందిస్తుంది. అందరూ కలిసి హాస్పిటల్ కు వెళ్తారు. మనోజ్ కు సర్జరీ అని తెలియగానే ప్రభావతి మరింత ఏడుస్తుంది. అటు సత్యం కూడా కంటతడి పెడతాడు. అతడు ఎన్ని తప్పులు చేసినా గుండెల్లో పెట్టుకున్నానని, మనోజ్ కు ఏమీ కాకూడదని బాలుతో అంటాడు.
తన ప్రాణం అడ్డేసి అయినా అతన్ని కాపాడుతానని బాలు అంటాడు. సర్జరీ పూర్తయి మనోజ్ బయటకు రాగానే అందరూ వెళ్లి ఏం జరిగిందని అడుగుతాడు. అద్దం పగిలి ఆ గాజు పెంకులు కళ్లలో గుచ్చుకున్నాయని, సర్జరీ చేసి వాటిని తీసేసినట్లు డాక్టర్ చెప్పడంతో అందరూ షాక్ తింటారు. అక్కడితో గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్డేట్స్ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


