Gunde Ninda Gudi Gantalu Today Episode: మీనా శపథం.. సంజూతో క్షమాపణ చెప్పిస్తానని పంతం.. బాలుని అవమానించి పంపిన మౌనిక

Gunde Ninda Gudi Gantalu Serial September 2nd Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్ సెప్టెంబర్ 2 ఎపిసోడ్ లో బాలుకి రాఖీ కట్టకుండా మౌనిక దారుణంగా అవమానించి పంపిచేస్తుంది. దీంతో వాళ్లతో బాలుకి క్షమాపణ చెప్పిస్తానని మీనా శపథం చేస్తుంది.

Published on: Sep 2, 2026, 07:06:27 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Gunde Ninda Gudi Gantalu Serial Today Episode: స్టార్ మా సీరియల్ గుండె నిండా గుడి గంటలు ఈరోజు ఎపిసోడ్ ఎమోషనల్ గా సాగింది. చెల్లెలి చేత రాఖీ కట్టించుకోవడానికి బాలు వేచి చూడటం, చివరికి ఆమె వచ్చి అతన్ని అవమానించి పంపించడం, అది తెలిసి మీనా శపథం చేయడంలాంటి సీన్లతో సాగిపోయింది.

Gunde Ninda Gudi Gantalu Today Episode: మీనా శపథం.. సంజూతో క్షమాపణ చెప్పిస్తానని పంతం.. బాలుని అవమానించి పంపిన మౌనిక
Gunde Ninda Gudi Gantalu Today Episode: మీనా శపథం.. సంజూతో క్షమాపణ చెప్పిస్తానని పంతం.. బాలుని అవమానించి పంపిన మౌనిక

అన్నలకు రాఖీ కడతానని బతిమాలిన మౌనిక

మౌనిక చేత రాఖీలు కట్టించుకోవడానికి బాలు, మనోజ్, రవి సంజూ ఇంటి ముందు వేచి చూసే సీన్ తో సీరియల్ బుధవారం (సెప్టెంబర్ 2) ఎపిసోడ్ మొదలైంది. వాళ్లను లోనికి రానీయొద్దని సెక్యూరిటీకి చెబుతారు సంజూ, నీలకంఠం. కానీ మౌనిక బయటకు వచ్చి తన అన్నలకు రాఖీలు కట్టి పంపిస్తానని వాళ్లను వేడుకుంటుంది. కానీ వాళ్లు మాత్రం వినరు.

మౌనికను కూడా బయటకు పంపించడానికి అంగీకరించరు. బలవంతంగా లోనికి తీసుకెళ్లమని భార్యకు చెబుతాడు నీలకంఠం. ఆమె బాధగా లోనికి వెళ్లడం గేటు బయట నుంచి బాలు చూస్తాడు.

నీలకంఠంతో బాలు గొడవ

దీంతో రవి, మనోజ్ లను తీసుకొని లోనికి వెళ్లడానికి బాలు ప్రయత్నిస్తాడు. సెక్యూరిటీతోపాటు పార్టీ వాళ్లు అతన్ని అడ్డుకుంటారు. తన చెల్లితో రాఖీ కట్టించుకోవడానికి ఎవరి అనుమతి అవసరం లేదని, లోనికి వెళ్తానని బాలు మొండికేస్తాడు. అప్పుడే నీలకంఠం అక్కడికి వస్తాడు.

నువ్వు లోనికి వస్తే ఏదో ఒక సమస్య.. పార్టీ వాళ్ల ముందు మా పరువు పోతుంది.. అందుకే లోనికి రావద్దంటాడు నీలకంఠం. గొడవ చేయడానికి రాలేదని, దయచేసి రాఖీ కట్టించుకొని వెళ్లిపోతాను.. లోనికి వెళ్లనివ్వండి అని బాలు వేడుకుంటాడు. దీంతో నీలకంఠం సరే అంటూ.. ఐదు నిమిషాల్లో రావాలని స్పష్టం చేస్తాడు.

బాలును అడ్డుకున్న సంజూ

ముగ్గురూ లోనికి వెళ్తుండగా.. సంజూ వచ్చి బాలుని అడ్డుకుంటాడు. నువ్వు జరిగినవన్నీ మరచిపోయి సిగ్గు లేకుండా వచ్చినా.. నేను మరిచిపోలేదు.. నిన్ను నా ఇంట్లోకి అడుగుపెట్టనీయను.. కావాలంటే మీ ఇద్దరూ వెళ్లండి అని రవి, మనోజ్ లతో సంజూ అంటాడు. బాలుని మాత్రం వెళ్లనీయడు.

దీంతో కనీసం మీరైనా వెళ్లి రాఖీలు కట్టించుకోండి.. ఒకవేళ మౌనిక బయటకు వచ్చి రాఖీ కడతానంటే చెప్పండి.. ఇక్కడే వేచి చూస్తుంటాను అని బాలు వాళ్లను పంపిస్తాడు. వీడిని ఎట్టి పరిస్థితుల్లోనూ లోనికి రానీయొద్దని సెక్యూరిటీకి సంజూ చెప్పి వెళ్తాడు.

మనోజ్, రవిలకు రాఖీ కట్టిన మౌనిక

లోపల మనోజ్, రవిలకు మౌనిక రాఖీ కడుతుంది. బాలు అన్నయ్య రాలేదా అని అడుగుతుంది. అన్నయ్యను రానీయడం లేదు అని రవి చెబుతాడు. వాళ్లకు సంతోషంగా రాఖీ కట్టి ఆశీర్వాదం తీసుకుంటుంది మౌనిక. రవి డబ్బులు ఇచ్చి మంచి చీర కొనుక్కోమని చెబితే.. మనోజ్ మాత్రం కక్కుర్తి పడుతూ తన షాప్ విజిటింగ్ కార్డు ఇచ్చి మీ ఇంట్లో ఫర్నీచర్ కొంటే 5 శాతం డిస్కౌంట్ ఇస్తానంటాడు. అంతేకాదు అక్కడున్న వాళ్లందరికీ తన కార్డులు ఇచ్చి పబ్లిసిటీ చేసుకుంటాడు. అటు మౌనిక బాలుకి రాఖీ కట్టడానికి బయటకు వెళ్తుంటే సంజూ అడ్డుకుంటాడు.

మౌనిక రాఖీ కోసం బాలు నిరీక్షణ.. ఇంటి ముందు ధర్నా

గేటు బయట మౌనిక కోసం బాలు నిరీక్షిస్తుంటాడు. రవి, మనోజ్ బయటకు రాగానే ఆశగా మౌనిక వస్తోందా అని వాళ్ల చేతులకు కట్టిన రాఖీలు చూసి అడుగుతాడు. మౌనికను రానీయడం లేదని వాళ్లు చెబుతారు. దీంతో ఆమె వచ్చేంత వరకూ ఇక్కడి నుంచి కదలనంటూ ఇంటి ముందు ధర్నాకు దిగుతాడు.

ఓ తాడుకు దూది పింజ ఉండే ఆ రాఖీ కోసం ఇంత సీన్ ఎందుకు క్రియేట్ చేస్తావ్.. ఎందుకంత సెంటిమెంట్ అని మనోజ్ అంటాడు. దీంతో బాలు ఎమోషనల్ అవుతాడు. నీలాంటోడికి రాఖీ అంటే అదే రా.. కానీ ఆ రాఖీ పవిత్రమైన అన్నాచెల్లెళ్ల బంధానికి ప్రతీక.. ఈ దేశంలో ఎంతో మంది అన్నతమ్ముళ్లు లేక ఆడపిల్లలు.. అక్కాచెల్లెళ్లు లేక మగవాళ్లు బాధపడుతున్నారు.. మన ముగ్గురికి ఉన్న ఒకే ఒక్క చెల్లెలు మౌనికతో రాఖీ కట్టించుకోకపోతే ఎలా అంటూ బాలు ఎమోషనల్ అవుతాడు.

బాలుని తిట్టి పంపించేసిన మౌనిక

దీంతో మనోజ్ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. బాలు మాత్రం అక్కడే ధర్నాకు దిగడంతో సంజూ, నీలకంఠం వస్తారు. ఆమె బయటకు వచ్చి రాఖీ కడతామంటే మాకేమీ అభ్యంతరం లేదు.. కడుతుందేమో చూడండి అని మౌనికను పిలుస్తాడు సంజూ. ఆమె బయటకు రాగానే.. తన కోసం తీసుకొచ్చిన చీరను చూపిస్తూ బాలు రాఖీ కట్టమని అడుగుతాడు.

కానీ మౌనిక మాత్రం ఎందుకు వచ్చావ్ అంటూ బాలుని తిడుతుంది. ఈయన చీర కోసం ఎవరూ వేచి చూడటం లేదు.. రవి అతన్ని తీసుకువెళ్లు.. మళ్లీ ఎప్పుడూ నా ఇంటికి రావద్దు అని మౌనిక నిర్దయగా మాట్లాడుతుంది. ఎందుకలా మాట్లాడుతున్నావ్ అని బాలు అడుగుతున్నా సమాధానం చెప్పదు.

బాలుని జైలుకి పంపిస్తానని బెదిరించడంతో..

కానీ అంతకుముందే బాలుకి రాఖీ కట్టడానికి వెళ్తున్న మౌనికను సంజూ అడ్డుకుంటాడు. ఒకవేళ బాలుకి రాఖీ కట్టావంటే మీ అన్నను జైలుకి పంపిస్తాను.. ఇంటి ముందు న్యూసెన్స్ చేస్తున్నాడని చెబుతాను.. ఏవేవో కేసు పెట్టి ఎప్పటికీ జైల్లో ఉండేలా చేస్తాను అని సంజూ బెదిరిస్తాడు.

దీంతో మౌనిక అలా చేయొద్దంటూ బతిమాలుతుంది. అలా అయితే బయటకు వచ్చి ఆ బాలుగాడి మనసు విరిగేలా మాట్లాడి వెళ్లాలని సంజూ చెబుతాడు. దీంతో చేసేది లేక సంజూ చెప్పినట్లే మౌనిక చేస్తుంది.

క్షమాపణ చెప్పిస్తానని మీనా శపథం

ఇంటికి వచ్చిన తర్వాత రాఖీలు కట్టించుకున్నారా అని మీనా అడుగుతుంది. బాలు అన్నయ్యకు మాత్రం కట్టినీయలేదు అని రవి చెబుతాడు. అవమానించి పంపించారని అంటాడు. దీంతో మీనా శపథం చేస్తుంది. వాళ్లకు వాళ్లుగా ఈ ఇంటికి వచ్చి మీకు క్షమాపణ చెప్పిస్తాను.. అంతేకాదు మౌనికతో కూడా రాఖీ కట్టిస్తాను అని అంటుంది. శపథం చేస్తున్నావా అని ప్రభావతి అంటే అవును అని మీనా స్పష్టం చేస్తుంది. అక్కడితో గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More