Gunde Ninda Gudi Gantalu Today Episode: సంజూని వీడియోతో కొట్టిన మీనా.. కాళ్ల బేరానికి నీలకంఠం.. బాలుకి మౌనిక రాఖీ

Gunde Ninda Gudi Gantalu Serial September 3rd Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్ సెప్టెంబర్ 3 ఎపిసోడ్ లో మీనా శపథం చేసి మరీ సంజూ, నీలకంఠం మెడలు వంచుతుంది. ఓ వీడియోతో సంజూని కొట్టి మౌనికను ఇంటికి రప్పిస్తుంది.

Published on: Sep 3, 2026, 07:09:08 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Gunde Ninda Gudi Gantalu Serial Today Episode: స్టార్ మా సీరియల్ గుండె నిండా గుడి గంటలు ఈరోజు ఎపిసోడ్ లో మీనా పవరేంటో మరోసారి తెలిసొచ్చింది. ఆమె సత్తా చూసి అత్త ప్రభావతి నోరు మూత పడటమే కాదు.. కొమ్ములు తిరిగిన సంజూ, నీలకంఠం కూడా దిగి వచ్చారు. దీనికోసం ఆమె వేసిన ప్లాన్ ఈ ఎపిసోడ్ లో హైలైట్ అని చెప్పొచ్చు.

Gunde Ninda Gudi Gantalu Today Episode: సంజూని వీడియోతో కొట్టిన మీనా.. కాళ్ల బేరానికి నీలకంఠం.. బాలుకి మౌనిక రాఖీ
Gunde Ninda Gudi Gantalu Today Episode: సంజూని వీడియోతో కొట్టిన మీనా.. కాళ్ల బేరానికి నీలకంఠం.. బాలుకి మౌనిక రాఖీ

అవమాన భారంతో ఇంటికి బాలు

బాలుని మౌనిక నానా మాటలు అనే సీన్ తో సీరియల్ గురువారం (సెప్టెంబర్ 3) ఎపిసోడ్ మొదలైంది. బాలు తెచ్చిన చీర చూసి ఇది మా ఇంట్లో పని మనిషి కూడా కట్టదంటూ సంజూ విసిరి కొడతాడు. దానిని తీసుకొని బాలు అవమాన భారంతో ఇంటికి వస్తాడు. రాఖీ ఏదీ అని మీనా అడుగుతుంది. అప్పుడే తీసేశారా అని మీనా అంటే.. ఒక రోజంతా ఉంచుకుంటావు కదరా అని సత్యం చెబుతాడు.

అప్పుడు రవి స్పందిస్తూ మౌనిక కేవలం తమకు మాత్రమే రాఖీ కట్టింది.. బాలు అన్నయ్యను లోనికి కూడా రానివ్వలేదు అని చెబుతాడు. మౌనికనే అన్నయ్యను తిట్టి పంపించేసింది అని అంటాడు. అది విని మీనా, సత్యం షాకవుతారు. నేను అందుకే ముందే చెప్పాను వెళ్లొద్దని.. వాళ్ల స్థాయి ఏంటి నీ స్థాయి ఏంటి అని ప్రభావతి ఎగతాళి చేస్తుంది.

బాలుకి అవమానంపై మీనా ఆక్రోశం.. శపథం చేసి..

దీంతో మీనా ఆవేశంతో రగిలిపోతుంది. స్థాయిల గురించి మాట్లాడొద్దు.. ఎవరి చరిత్ర ఏంటో అంతా తెలుసు.. బయటపెట్టాలన్న కసి వస్తోంది.. అయినా కడుపుకు అన్నం తినేవాళ్లెవరూ అన్నాచెల్లెళ్ల మధ్య స్థాయిని చూడరు అని అత్తను కడిగి పారేస్తుంది. అటు శృతి కూడా మీరు అసలు కడుపుకు అన్నమే తింటున్నారా అని నోరు తెరవడానికి వెళ్లగా రవి అడ్డుకుంటాడు.

ఆ తర్వాత బాలుకి జరిగిన అవమానానికి తాను కచ్చితంగా బదులు తీర్చుకుంటానని మీనా అంటుంది. వాళ్లకు వాళ్లుగా ఇంటికి వచ్చి మా ఆయనకు క్షమాపణ చెప్పేలా.. మౌనికతో రాఖీ కట్టించేలా చేస్తాను అని శపథం చేస్తుంది. మరింత గొడవ అవుతుందేమో అని సత్యం అంటే.. అదేమీ జరగకుండా నేను చూసుకుంటానని మీనా హామీ ఇస్తుంది. ప్రభావతి మళ్లీ నోరు జారుతుండగా.. ఆమెకు గట్టిగా క్లాస్ పీకి మీనా ఆవేశంతో బయటకు వెళ్లిపోతుంది.

మౌనికను రప్పించేలా మీనా, శృతి ప్లాన్.. వీడియో తీసి..

ఇంటి బయటకు వెళ్లి ఆలోచనలో పడుతుంది. బాలుకి జరిగిన అవమానాన్ని తలుచుకుంటుంది. శృతి వెళ్లి ఈ పాటికి రెండు కత్తులతో ఆ ఇంటికి వెళ్లావనుకున్నాను అని అంటుంది. ఆడపడుచు సౌభాగ్యం గురించి ఆలోచించకపోతే వాళ్లను దారికి తీసుకురావడానికి రెండు ఇటుకలు చాలు అని మీనా అంటుంది. వాళ్లను వెనక్కి తగ్గేలా చేయడానికి మనం వాళ్ల రూట్లోనే వెళ్లాలి అని చెబుతుంది. శృతిని ఓ వీడియో చేసిపెట్టమని అడుగుతుంది. ఆ వీడియోలో తానే మాట్లాడుతుంది.

మౌనిక ఇంటికి మీనా, శృతి.. సంజూకి రాఖీ కట్టి..

ఆ తర్వాత మీనా, శృతి కలిసి మౌనిక ఇంటికి వెళ్తారు. అప్పుడే అక్కడ రాఖీ పౌర్ణమి గొప్పతనం, అన్నాచెల్లెళ్ల బంధం గురించి భారీ డైలాగులు కొడుతూ వీడియో షూట్ చేస్తుంటాడు సంజూ. అది విని మీనా, శృతి చప్పట్లు కొడుతూ సీన్ లోకి ఎంట్రీ ఇస్తారు. వాళ్లను చూసిన డైరెక్టర్.. వీళ్లు చాలా బాగా నటిస్తున్నారు అని అంటాడు. సంజూ అన్నయ్యకి అసలైన చెల్లెళ్లం మేము ఉన్నాం కదా.. మాతో రాఖీ కట్టించుకోండి అని వాళ్లు అంటారు.

ఇదేదో బాగుంది.. వీడియో మరింత బాగా వస్తుంది అని డైరెక్టర్ అనడంతో సంజూకి బొట్టు పెట్టి రాఖీ కడుతుంది మీనా. రాఖీ కట్టే సమయంలో.. మౌనికతో వాళ్ల అన్నయ్యకు రాఖీ కట్టించకుండా చేసి కెమెరా ముందు మాత్రం రాఖీ గొప్పతనం గురించి చెబుతావా.. చెబుతా నీ సంగతి అని అంటుంది. తర్వాత శృతి కూడా సంజూకి రాఖీ కడుతుంది. ఇద్దరూ కలిసి సంజయ్ అని అంటే.. చుట్టూ ఉన్న వాళ్లు జై కొడతారు.

సంజూ, నీలకంఠంలకు మీనా, శృతి వార్నింగ్

ఆ తర్వాత సంజూ, నీలకంఠం ఇద్దరినీ మీనా, శృతి బయటకు తీసుకెళ్తారు. ఇద్దరికీ గట్టి వార్నింగ్ ఇస్తారు. అసలు మీకు సిగ్గు, శరం ఏమైనా ఉన్నాయా అని మీనా కడిగి పారేస్తుంది. మా ఆయనను ఇంట్లోకి రానివ్వకుండా అవమానిస్తారా? నువ్వు అసలు మనిషివేనా.. ఇప్పుడేమో అదే రాఖీ కట్టించుకొని యువ నాయకుడిగా చెలామణి అవుతున్నావా.. నీ రాజకీయ జీవితం మొగ్గలోనే తుంచేయగలను అని మీనా వార్నింగ్ ఇస్తుంది. అది విని నీలకంఠం ఏదో అనబోతాడు. కానీ శృతి అడ్డుకొని ఓ వీడియోను వాళ్లకు చూపిస్తుంది.

మీనా వీడియో చూసి సంజూ, నీలకంఠం షాక్

ఆ వీడియో ఇంటి దగ్గర మీనా చేసినదే. అందులో మీనా మాట్లాడుతూ.. సంజూ నిజ స్వరూపాన్ని బయటపెడుతుంది. మీ యువజన నాయకుడు రాఖీ శుభాకాంక్షలు చెబుతూ కట్టుకున్న భార్యనే తన అన్నకు రాఖీ కట్టకుండా చేస్తున్నాడు.. ఈ దుర్మార్గుడి చరిత్ర తెలుసుకోవాలంటే మమ్మల్ని సంప్రదించండి.. అతని నిజం స్వరూపం ఏంటో అతని భార్య మౌనికను అడగండి.. ఇతని రౌడీయిజానికి ఇతని తండ్రి రాక్షసత్వం తోడయింది.. ఇలాంటి వాడు నాయకుడిగా వస్తే అక్కాచెల్లెళ్ల పరిస్థితి ఏంటో ఆలోచించండి.. అని ఆ వీడియోలో మీనా అంటుంది.

అది చూసిన సంజూ షాక్ తింటాడు.. ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశామంటే సంజూ రాజకీయ జీవితం అయిపోయినట్లే అని శృతి అంటుంది. మీరు చెబితే జనం నమ్మేస్తారా అని నీలకంఠం అంటే.. పాజిటివ్ కంటే నెగటివ్ వాటికే ఎక్కువ అట్రాక్ట్ అవుతారు జనం అని శృతి సమాధానమిస్తుంది. మీరు మా ఇంటికి వచ్చి మా ఆయనకు క్షమాపణ చెప్పి, మౌనికతో రాఖీ కట్టించకపోతే ఈ వీడియో వెంటనే వైరల్ అవుతుంది అని వార్నింగ్ ఇచ్చి మీనా, శృతి వెళ్లిపోతారు.

ప్రభావతి మాటల తూటాలు.. నోరు మూయించిన మీనా

అటు ఇంటి దగ్గర రోహిణికి క్లాస్ పీకుతూ ఉంటుంది ప్రభావతి. బాలు వల్ల తనకు అవమానం జరిగిందంటూ ఇంటికి వచ్చి తల్లికి చెప్పబోతాడు మనోజ్. అప్పుడే బాలు కూడా వస్తాడు. ఇప్పుడు వీడి భార్య, రవిగాడి భార్య అక్కడికి వెళ్లారు.. వాళ్లకు ఏం జరుగుతుందో అని ప్రభావతి అంటుండగానే మీనా, శృతి వస్తారు. ఏమైంది మిమ్మల్ని గేటు వరకు కూడా రానీయలేదా.. శపథం చేసి వెళ్లావ్ ఏదీ నా కూతురు అంటూ ప్రభావతి మాటల తూటాలు పేలుస్తుంది.

కానీ మీనా, శృతి సైలెంట్ గా ఉంటారు. ఒకసారి బయటకు చూస్తే అక్కడ ఏం జరిగిందో తెలుస్తుంది అని మీనా అంటుంది. అప్పుడే కారులో నుంచి నీలకంఠం, సంజూ దిగడం చూసి ప్రభావతి నోరు మూతపడుతుంది. వాళ్లు వచ్చి తమ వల్ల తప్పు జరిగిందని చెప్పడమే కాదు.. మౌనికను తీసుకొచ్చి బాలుకి రాఖీ కట్టిస్తారు. మా ఆయనకు క్షమాపణ కూడా చెప్పాలని మీనా అడగడంతో నీలకంఠం షాక్ తింటాడు. అక్కడితో గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More