సంగీత ప్రపంచంలో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ గాయకుడు, ఇండియన్ ఐడల్ సీజన్-3 విజేత ప్రశాంత్ తమాంగ్ (Prashant Tamang) కన్ను మూశాడు. ఆదివారం (జనవరి 11) ఉదయం గుండెపోటు రావడంతో అతడు మరణించాడు. కేవలం 43 ఏళ్ల వయసులో, అదీ కెరీర్ పరంగా బిజీగా ఉన్న సమయంలో అతడు ఇలా అర్ధాంతరంగా వెళ్లిపోవడం అభిమానులను కలచివేస్తోంది. ప్రశాంత్ సన్నిహితుడు, మ్యూజిక్ కంపోజర్ రాజేష్ ఘటానీ ఈ విషాద వార్తను ధృవీకరించాడు.
షో చేసి ఇంటికొచ్చిన కాసేపటికే..

వివిధ రిపోర్టుల ప్రకారం.. ప్రశాంత్ తమాంగ్ ఇటీవల అరుణాచల్ ప్రదేశ్లో ఒక లైవ్ షోలో పాల్గొన్నాడు. అక్కడి నుంచి ఢిల్లీకి తిరిగి వచ్చిన తర్వాత, ఆదివారం ఉదయం తన నివాసంలో ఉన్నట్టుండి కుప్పకూలిపోయాడు. కుటుంబ సభ్యులు వెంటనే ద్వారకాలోని ఆసుపత్రికి తరలించినప్పటికీ, అప్పటికే అతడు ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు ప్రకటించారు. అతనికి అంతకుముందు ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవని, ఇది ఆకస్మాత్తుగా జరిగిన ఘోరమని సన్నిహితులు చెబుతున్నారు.
పోలీస్ కానిస్టేబుల్ నుంచి పాప్ స్టార్ దాకా..
పశ్చిమ బెంగాల్లోని డార్జిలింగ్లో 1983, జనవరి 4న జన్మించిన ప్రశాంత్ జీవితం ఎందరికో స్ఫూర్తిదాయకం. తండ్రి మరణం తర్వాత అతడు కోల్కతా పోలీసులో కానిస్టేబుల్గా చేరాడు. అక్కడ పోలీస్ ఆర్కెస్ట్రాలో పాటలు పాడుతూ తనలోని గాయకుడికి మెరుగుపెట్టాడు. 2007లో ‘ఇండియన్ ఐడల్ సీజన్ 3’లో పాల్గొని సంచలనం సృష్టించాడు. తన గాత్రంతో దేశ ప్రజలను మెప్పించి, ఏకంగా 7 కోట్ల ఓట్లు సాధించి విజేతగా నిలిచాడు. ఆ తర్వాత ‘ధన్యవాద్’ అనే ఆల్బమ్తో ఆకట్టుకున్నాడు. ‘మన్ సైన్లీ’, ‘గోర్ఖా పల్టన్’ వంటి పాటలు అతనికి మంచి పేరు తెచ్చాయి.
సల్మాన్ ఖాన్ సినిమాలోనూ..
కేవలం గాయకుడిగానే కాకుండా నటుడిగానూ ప్రశాంత్ తనదైన ముద్ర వేశాడు. పలు నేపాలీ చిత్రాల్లో నటించిన అతడు.. అమెజాన్ ప్రైమ్ హిట్ వెబ్ సిరీస్ ‘పాతాళ్ లోక్ 2’ (Paatal Lok 2)లో డేనియల్ అచో అనే కీలక పాత్ర పోషించాడు. అంతేకాకుండా, బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ నటిస్తున్న ‘బాటిల్ ఆఫ్ గల్వాన్’ (Battle of Galwan) సినిమాలోనూ ప్రశాంత్ నటిస్తున్నట్లు సమాచారం. ఇంతలోనే అతని మరణవార్త వినాల్సి రావడం బాధాకరం.