ప్రకాష్ రాజ్‌కు క్లాస్ పీకిన మలయాళ బాల నటి.. మేం మీకు కనిపించలేదా అంటూ నిలదీత.. ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ వైరల్

మలయాళం బాలనటి ఒకరు ప్రకాష్ రాజ్ కు పీకింది. మాలికాపురంలాంటి సినిమాలు చేసిన దేవానంద జిబిన్ ఇన్‌స్టాగ్రామ్ లో చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. కేరళ స్టేట్ ఫిల్మ్ అవార్డుల్లో బాల నటులకు ఎలాంటి అవార్డులు ఇవ్వకపోవడంపై ఆమె తీవ్రంగా స్పందించింది.

Published on: Nov 04, 2025 9:47 PM IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

కేరళ స్టేట్ ఫిల్మ్ అవార్డుల జ్యూరీ ఛైర్మన్ గా వ్యవహరించిన ప్రకాష్ రాజ్‌కు మలయాళ బాల నటి దేవానంద జిబిన్ క్లాస్ పీకడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ అవార్డుల్లో బాల నటులకు ఒక్క అవార్డు కూడా ఇవ్వకపోవడం, ఆ స్థాయి సినిమాలు, నటులేవీ తమకు కనిపించలేదని ప్రకాష్ రాజ్ అనడంపై ఆమె అసంతృప్తి వ్యక్తం చేసింది.

ప్రకాష్ రాజ్‌కు క్లాస్ పీకిన మలయాళ బాల నటి.. మేం మీకు కనిపించలేదా అంటూ నిలదీత.. ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ వైరల్
ప్రకాష్ రాజ్‌కు క్లాస్ పీకిన మలయాళ బాల నటి.. మేం మీకు కనిపించలేదా అంటూ నిలదీత.. ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ వైరల్

మేము మీకు కనిపించలేదా?

2024 ఏడాదికిగాను కేరళ స్టేట్ ఫిల్మ్ అవార్డులను సోమవారం (నవంబర్ 3) అనౌన్స్ చేసిన విషయం తెలుసు కదా. ఇందులో రికార్డు స్థాయిలో ఏడోసారి మమ్ముట్టి బెస్ట్ యాక్టర్ అవార్డు గెలుచుకున్నాడు. అయితే ఇందులో బాల నటులకుగానీ, వాళ్ల సినిమాలకు గానీ ఒక్క అవార్డు కూడా ఇవ్వలేదు. దీనిని సమర్థించుకుంటూ అలాంటి సినిమాలు, నటులు కనిపించలేదని ప్రకాష్ రాజ్ వివరణ ఇచ్చాడు.

దీనిని తప్పుబడుతూ బాలనటి దేవానంద జిబిన్ ఇన్‌స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. మేము మీకు కనిపించలేదా అంటూ క్లాస్ పీకింది. “మీరు బాల నటులను చూసీచూడనట్లు వ్యవహరించి ఉండొచ్చు. కానీ ఇక్కడంతా చీకటే అని మాత్రం అనకండి. పిల్లలు కూడా సమాజంలో భాగమే అని చెప్పిన మీరు.. వాళ్లను చూసీ చూడనట్లు వదిలేశారు. నిజానికి 'స్థానార్థి శ్రీకుట్టన్', 'గు', 'ఫీనిక్స్', 'ఏఆర్ఎం' వంటి ఎన్నో చిత్రాలలో బాల నటీనటులు అద్భుతంగా నటించారు. వారిలో కనీసం ఇద్దరు పిల్లలకు అవార్డులు ఇచ్చి ఉంటే అది ఎంతో మంది చిన్నారులకు, వారి తల్లిదండ్రులకు పెద్ద ప్రోత్సాహం, శక్తిగా మారేది.

బాలలకు మరింత ఎక్కువ అవకాశాలు ఇవ్వాలని, వారు కూడా సమాజంలో భాగమేనని స్వయంగా ప్రకటించిన జ్యూరీ చైర్మన్.. తీరా అవార్డుల ప్రకటనలో మాత్రం బాలల హక్కులను పూర్తిగా విస్మరించడం నాకు తీవ్ర ఆగ్రహం కలిగేలా చేసింది. ఈ అంశంపై అన్ని మీడియా వర్గాలు, సినీ కార్మికులు, మరియు సాధారణ ప్రజలు కూడా చర్చించాలి. బాల నటుల హక్కుల కోసం పోరాడాలి. అప్పుడే వారి ప్రతిభకు, కృషికి సరైన గుర్తింపు లభిస్తుంది. మార్పులతో పాటు హక్కులను కూడా కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది” అని ఆమె పోస్ట్ చేసింది.

నేషనల్ అవార్డులపై ప్రకాష్ రాజ్

నేషనల్ అవార్డులు రాజీ పడ్డాయని, అక్కడ పైరవీలు చేసిన వారికే అవార్డులు ఇస్తున్నారని ప్రకాష్ రాజ్ విమర్శించిన విషయం తెలిసిందే. కానీ అలాంటి ప్రకాష్ రాజ్ పై మరుసటి రోజే ఓ బాల నటి విమర్శలు గుప్పించడం చర్చనీయాంశమవుతోంది.

కేరళ ఫిల్మ్ ఇండస్ట్రీ జ్యూరీ ఛైర్మన్ గా తనకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చారని ప్రకాష్ రాజ్ చెప్పాడు. అయితే అలాంటి వ్యక్తి ఇప్పుడు బాల నటులను విమర్శించాడన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. అంతేకాదు అసలు బాలల సినిమాలే లేవని, ఆ స్థాయి నటులూ లేరని అనడంపైనా ఆగ్రహం వ్యక్తమవుతోంది. మరి దీనిపై అతడు ఎలా స్పందిస్తాడో చూడాలి.