మలయాళ సైకలాజికల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ వచ్చేస్తోంది.. ట్రైలర్ రిలీజ్.. దృశ్యం డైరెక్టర్, మీనా కాంబినేషన్లో..
జియోహాట్స్టార్ వేదికగా మరో ఆసక్తికరమైన మలయాళ సైకలాజికల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ 'రోస్లిన్: సీక్రెట్ స్టోరీస్ అన్ఫోల్డ్' (Roslin) విడుదలకు సిద్ధమైంది. 'దృశ్యం' దర్శకుడు జీతు జోసెఫ్ షో రన్నర్గా వ్యవహరిస్తున్న ఈ సైకలాజికల్ థ్రిల్లర్ ట్రైలర్ ఈరోజు (ఫిబ్రవరి 13) విడుదలైంది.
మలయాళ వెబ్ సిరీస్లకు ఓటీటీలో మంచి క్రేజ్ ఉంది. ఆ క్రేజ్ను కొనసాగిస్తూ జియోహాట్స్టార్ (JioHotstar) మరో ఉత్కంఠభరితమైన వెబ్ సిరీస్ను ప్రేక్షకుల ముందుకు తెస్తోంది. అదే 'రోస్లిన్: సీక్రెట్ స్టోరీస్ అన్ఫోల్డ్'. ఈ సిరీస్ ట్రైలర్ను మేకర్స్ శుక్రవారం (ఫిబ్రవరి 13) విడుదల చేశారు. ట్రైలర్ ఆద్యంతం మిస్టరీగా సాగుతూ సిరీస్ పై ఆసక్తిని రేకెత్తిస్తోంది.

రోస్లిన్ వెబ్ సిరీస్ కథేంటంటే..
మలయాళం వెబ్ సిరీస్ రోస్లిన్ ట్రైలర్ గమనిస్తే.. రోస్లిన్ (సంజన దీపు) అనే యువతి చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ఆమె మానసికంగా కాస్త ఆందోళనలో ఉంటుంది. ఒక ఆకుపచ్చ కళ్ళు ఉన్న ఆగంతకుడు తనను వెంటాడుతున్నట్లు ఆమెకు తరచూ పీడకలలు వస్తుంటాయి. ఈ విషయాన్ని తన డాక్టర్తో చెప్పి భయపడుతుంటుంది.
అయితే ఆమె తల్లిదండ్రులు (వినీత్, మీనా) మాత్రం ఆమె మాటలను సీరియస్గా తీసుకోరు. రాత్రిపూట దెయ్యాల పుస్తకాలు చదవడం వల్లే ఇలాంటి భ్రమలు కలుగుతున్నాయని కొట్టిపారేస్తారు. కానీ కథలో ఊహించని ట్విస్ట్ ఏంటంటే.. రోస్లిన్ కలలో భయపెట్టిన ఆ వ్యక్తి (హకీమ్ షాజహాన్), నిజజీవితంలో ఒక అతిథిలా వారి ఇంటికి వస్తాడు. తన మాటలతో, ప్రవర్తనతో రోస్లిన్ తల్లిదండ్రులను ఇట్టే ఆకట్టుకుంటాడు. కానీ రోస్లిన్ మాత్రం అతన్ని చూసి భయపడుతుంది.
అసలు అతను ఎవరు? రోస్లిన్ కలలోకి అతను ఎందుకు వస్తున్నాడు? తన తల్లిదండ్రులను కాపాడుకోవడానికి రోస్లిన్ ఏం చేసింది? అనే ఉత్కంఠభరితమైన అంశాలతో ఈ వెబ్ సిరీస్ సాగనుంది. ఇందులో ఎక్కువ పాత్రలు కూడా లేవు.
జీతు జోసెఫ్ మార్క్..
ఈ థ్రిల్లర్ వెబ్ సిరీస్కు ప్రధాన ఆకర్షణ మలయాళ స్టార్ డైరెక్టర్ జీతు జోసెఫ్ (Jeethu Joseph). 'దృశ్యం', 'నేరు' వంటి సినిమాలతో సంచలనం సృష్టించిన అతడు.. ఈ సిరీస్కు షో రన్నర్గా వ్యవహరిస్తున్నాడు. సుమేష్ నందకుమార్ దర్శకత్వం వహించగా, వినాయక్ శశికుమార్ కథ అందించారు. శంకర్ రామకృష్ణన్, టి.జి. రవి తదితరులు ఇతర పాత్రల్లో నటించారు.
రోస్లిన్ ఓటీటీ రిలీజ్ ఎప్పుడంటే?
ఈ ఏడాది జియోహాట్స్టార్లో విడుదలవుతున్న మొదటి మలయాళ వెబ్ సిరీస్ ఇదే. ఫిబ్రవరి 27 నుంచి ఈ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. విశేషమేమిటంటే.. ఇది మలయాళంతో పాటు తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మరాఠీ, బెంగాలీ భాషల్లోనూ అందుబాటులో ఉంటుంది.
జియోహాట్స్టార్ రాబోయే రోజుల్లో మరిన్ని మలయాళ సిరీస్లను ప్లాన్ చేస్తోంది. సూపర్ హిట్ సిరీస్ 'కేరళ క్రైమ్ ఫైల్స్' సీజన్ 3, సంచలనం సృష్టించిన కూడత్తాయి సైనైడ్ హత్యల ఆధారంగా నిఖిలా విమల్ నటిస్తున్న 'అనలి' (Anali), అలాగే రహ్మాన్ నటించిన '1000 బేబీస్' సీజన్ 2 కూడా త్వరలో రానున్నాయి.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్డేట్స్ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


