May 18: మే 18.. ఈరోజు స్పెషాలిటీ ఏంటో తెలుసా? ఇండియాలో తొలి సినిమా రిలీజై సరిగ్గా 114 ఏళ్లు.. ఆ మూవీ ఇదే
May 18: భారతీయ చలనచిత్ర రంగానికి మే 18 ఓ పెద్ద మైలురాయి వంటి రోజు. 1912లో దేశంలోనే మొట్టమొదటి ఫీచర్ ఫిలిం 'శ్రీ పుండలీక్' విడుదలై ఈ రోజుతో 114 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ ఐకానిక్ మూకీ సినిమా ప్రస్థానం, దాని వెనుక ఉన్న ఆసక్తికర విశేషాలపై ప్రత్యేక కథనం.
May 18: ప్రపంచంలో మరే దేశంలోనూ లేని విధంగా భారతీయులు సినిమాను ప్రాణంగా ప్రేమిస్తారు. ఒకప్పుడు బాలీవుడ్ హవా నడిచినా, ఇప్పుడు టాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్ చిత్రాలు గ్లోబల్ లెవెల్లో సంచలనాలు సృష్టిస్తున్నాయి. ఆస్కార్ స్టేజ్ వరకు వెళ్లిన మన సినిమా ప్రస్థానం అసలు ఎక్కడ మొదలైందో తెలుసా? దానికి సమాధానమే మే 18.

భారతీయ వెండితెరకు తొలి అడుగు
సరిగ్గా 114 ఏళ్ల క్రితం, అంటే 1912 మే 18న భారతదేశపు మొట్టమొదటి ఫీచర్ ఫిల్మ్ 'శ్రీ పుండలీక్' ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దాదాసాహెబ్ తోర్నే (రామచంద్ర గోపాల్ తోర్నే) దర్శకత్వం వహించిన ఈ మూకీ మరాఠీ మూవీ.. హిందూ సాధువు పుండలీకుడి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కింది.
అప్పట్లో భారతీయ ప్రేక్షకులు కేవలం స్టేజ్ నాటకాలు లేదా విదేశాల నుంచి వచ్చే సినిమాలను మాత్రమే చూసేవారు. ఆ సమయంలో మన వాళ్ల కోసం మనమే ఒక సినిమా తీయాలని తోర్నే బలమైన సంకల్పం చెప్పుకున్నారు.
22 నిమిషాల అద్భుతం.. కెమెరా వెనుక బ్రిటీష్ చేయి
రామ్రావ్ కీర్తీకర్ రాసిన ఒక ప్రసిద్ధ మరాఠీ నాటకం ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు. అప్పట్లో సౌండ్ టెక్నాలజీ అందుబాటులో లేకపోవడంతో 22 నిమిషాల నిడివి గల ఈ చిత్రాన్ని పూర్తిగా మూకీగానే తీశారు. ముంబై (అప్పటి బాంబే)లోని ఒక థియేటర్ లో నాటకం జరుగుతుండగానే ఈ సినిమాను షూట్ చేశారు. మన దేశంలో అప్పట్లో టెక్నాలజీ కొత్త కావడంతో, జాన్సన్ అనే బ్రిటీష్ కెమెరామన్ను రప్పించి షూటింగ్ పూర్తి చేశారు.
మొదట ఈ నాటకాన్ని ఒకే షాట్లో నిరంతరాయంగా రికార్డ్ చేయడం తోర్నేకు నచ్చలేదు. అందుకే ఆయన వేర్వేరు సన్నివేశాలను విడివిడిగా షూట్ చేసి, ఆ తర్వాత వాటన్నింటినీ ఒకచోట చేర్చారు. భారతీయ సినీ చరిత్రలో దీన్నే తొలి 'ఫిలిం ఎడిటింగ్' ప్రక్రియగా పరిశోధకులు భావిస్తారు. ఈ చిన్న ప్రయోగమే నేడు మనం చూస్తున్న గ్రాఫిక్స్, ఎడిటింగ్ హంగులతో కూడిన భారీ చిత్రాలకు పునాది వేసింది.
తొలి సినిమా ఏది? వందేళ్ల నాటి వివాదం
114 ఏళ్లు గడిచినా 'శ్రీ పుండలీక్' చిత్రాన్ని భారతదేశపు మొదటి అధికారిక ఫీచర్ ఫిల్మ్గా అంగీకరించే విషయంలో చరిత్రకారుల మధ్య పెద్ద చర్చ నడుస్తోంది. ఈ సినిమా కేవలం ఒక నాటకాన్ని రికార్డ్ చేయడం మాత్రమేనని, ఇది పూర్తిగా ఒరిజినల్ సినిమా కాదని కొందరి వాదన. దీనికి తోడు ఈ సినిమా నెగెటివ్స్ ప్రాసెసింగ్ కోసం లండన్ పంపించాల్సి వచ్చింది. కెమెరామన్ కూడా బ్రిటీష్ వ్యక్తినే ఎంచుకున్నారు.
"ఈ కారణాల వల్లే 1913లో దాదాసాహెబ్ ఫాల్కే పూర్తిగా స్వదేశీ సాంకేతికతతో తీసిన 'రాజా హరిశ్చంద్ర' చిత్రానికే మొదటి పూర్తి నిడివి భారతీయ ఫీచర్ ఫిల్మ్ హోదా దక్కాలని చాలా మంది వాదిస్తారు" అని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
వివాదాలు ఎలా ఉన్నప్పటికీ భారతీయ సినిమా రంగానికి 'శ్రీ పుండలీక్' ఒక దిక్సూచి అనడంలో ఎలాంటి సందేహం లేదు. టాలీవుడ్ నేడు వందల కోట్ల మార్కెట్తో ప్రపంచవ్యాప్తంగా దూసుకుపోవడానికి, శతాబ్దం క్రితం పడిన ఇటువంటి చిన్న చిన్న అడుగులే కారణం.
తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)
ప్రశ్న: భారతదేశపు మొట్టమొదటి ఫీచర్ ఫిల్మ్ 'శ్రీ పుండలీక్' ఎప్పుడు విడుదలైంది?
జవాబు: 'శ్రీ పుండలీక్' చిత్రం 1912 మే 18న విడుదలైంది. 2026 నాటికి ఈ సినిమా విడుదలై విజయవంతంగా 114 ఏళ్లు పూర్తయింది.
ప్రశ్న: 'శ్రీ పుండలీక్' సినిమాను ఎవరు నిర్మించారు, దీని ప్రత్యేకత ఏంటి?
జవాబు: ఈ చిత్రానికి దాదాసాహెబ్ తోర్నే (రామచంద్ర గోపాల్ తోర్నే) దర్శకత్వం వహించారు. ఇది హిందూ సాధువు పుండలీకుడి జీవితంపై ఆధారపడిన 22 నిమిషాల మూకీ మరాఠీ చిత్రం.
ప్రశ్న: 'శ్రీ పుండలీక్', 'రాజా హరిశ్చంద్ర' సినిమాల మధ్య వివాదం ఏంటి?
జవాబు: 'శ్రీ పుండలీక్' చిత్రానికి బ్రిటీష్ కెమెరామన్ పనిచేశారు, దీని నెగెటివ్స్ లండన్లో ప్రాసెస్ అయ్యాయి. అందుకే పూర్తిగా భారత్లోనే తయారైన 1913 నాటి దాదాసాహెబ్ ఫాల్కే 'రాజా హరిశ్చంద్ర' చిత్రానికే మొదటి అధికారిక భారతీయ సినిమా హోదా ఇవ్వాలని కొందరు చరిత్రకారులు భావిస్తారు.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్డేట్స్ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


