డీప్ ఫేక్పై కఠిన చట్టాలు తీసుకురావాలి.. నేనూ బాధితుడినే..: ఏక్తా దివస్ రన్లో చిరంజీవి కామెంట్స్
డీప్ ఫేక్ టెక్నాలజీపై మెగాస్టార్ చిరంజీవి ఆందోళన వ్యక్తం చేశాడు. కఠిన చట్టాలు తీసుకురావాల్సిన అవసరం ఉన్నదని అతడు అన్నాడు. ఏక్తా దివస్ సందర్భంగా హైదరాబాద్ పోలీసులు నిర్వహించిన 2కే రన్ లో అతడు పాల్గొన్నాడు.
డీప్ ఫేక్ టెక్నాలజీ బారిన పడిన పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కిన మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు దానికి వ్యతిరేకంగా గళమెత్తాడు. దీనిని కట్టడి చేయడానికి కఠిన చట్టాలను రూపొందించాల్సిన అవసరం ఉందని అన్నాడు. వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా నిర్వహించిన ఏక్తా దివస్ ర్యాలీలో చిరు పాల్గొన్నాడు. అతడు ప్రస్తుతం అయ్యప్ప మాలలో ఉండటం విశేషం.

డీప్ ఫేక్పై చిరంజీవి యుద్ధం
మెగాస్టార్ చిరంజీవి హైదరాబాద్ పోలీసులు నిర్వహించిన ఏక్తా దివస్ 2కే రన్ లో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా డీప్ ఫేక్ టెక్నాలజీ, ఏఐని దుర్వినియోగం చేస్తుండటంపై చిరు మాట్లాడాడు. సైబర్ నేరాలను కట్టడి చేయడానికి పోలీసులు తీసుకుంటున్న చర్యలను కొనియాడాడు. అయితే డీప్ ఫేక్ ఓ గొడ్డలి పెట్టులాంటిదని, దీనికి చెక్ పెట్టడానికి కఠిన చట్టాలను తీసుకురావాల్సిన అవసరం ఉందని చిరంజీవి స్పష్టం చేశాడు.
టెక్నాలజీ మన జీవితాలను హాయిగా మార్చేసినా ఆ మంచితోపాటు చెడు కూడా ఉంటుందని అన్నాడు. దీనిపై అందరికీ అవగాహన కల్పించాలని కోరాడు. ప్రతి ఒక్కరూ టెక్నాలజీని బాధ్యతాయుతంగా వాడాలని, వినోదం కోసం, ఆకర్షించడం కోసం ఎవరికీ హాని తలపెట్టొద్దని అన్నాడు. తాను కూడా దీని బాధితుడినే అని, తన ఫొటోలను దుర్వినియోగం చేస్తూ ఫేక్ వీడియోలను క్రియేట్ చేయడంపై చిరంజీవి ఈ మధ్యే పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. అతని ఫొటోలు, వాయిస్ వాడితే కఠిన చర్యలు తప్పవని కోర్టు కూడా చెప్పింది.
చిరంజీవి ఈ మధ్యే అయ్యప్ప మాల వేసుకున్నాడు. నల్లటి దుస్తుల్లోనే అతడు ఈ ర్యాలీలో పాల్గొన్నాడు. ప్రతి ఏటా రామ్ చరణ్ మాల వేసుకోవడం చూస్తూనే ఉంటాం. కానీ చిరంజీవి కూడా అయ్యప్ప మాలలో కనిపించడం విశేషం.
చిరంజీవి రాబోయే సినిమాలు
ఇక ప్రస్తుతం చిరంజీవి వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఓవైపు విశ్వంభరతోపాటు అనిల్ రావిపూడి డైరెక్షన్ లో మన శంకరవరప్రసాద్ గారు మూవీ కూడా చేస్తున్నాడు. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా రిలీజ్ కానుంది. ఈ మూవీ నుంచి ఈ మధ్యే వచ్చిన మీసాల పిల్ల సాంగ్ సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్డేట్స్ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


