మంత్రులు, వాళ్ల సెక్రటరీల సిఫారసులు నా దగ్గర పని చేయవు.. ఆ మంత్రినే బ్లాక్ చేసేశా: మ్యూజిక్ డైరెక్టర్ మాస్ వార్నింగ్
బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్, సింగర్ విశాల్ దద్లానీ చేసిన పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. ఓ మంత్రి సిఫారసుతో పని కోసం తన దగ్గరికి వచ్చిన ఓ సింగర్ గురించి చెబుతూ అలాంటి వాళ్లను తాను బ్లాక్ చేస్తానని, ఆ సిఫారసులు పని చేయవని అతడు స్పష్టం చేశాడు.
ప్రముఖ సంగీత దర్శకుడు, సింగర్ విశాల్ దద్లానీ కొత్తగా వచ్చే గాయకులకు గట్టి వార్నింగ్ ఇచ్చాడు. పాటలు పాడే అవకాశం కోసం మంత్రులు, రాజకీయ నాయకులతో ఫోన్ చేయించే కల్చర్ తనకు అస్సలు నచ్చదని, అలా చేస్తే వారి నంబర్లను బ్లాక్ చేస్తానని ఇన్స్టాగ్రామ్ వేదికగా సీరియస్ పోస్ట్ పెట్టాడు. ఇప్పుడా పోస్ట్ వైరల్ అవుతోంది.

"ఆ మంత్రిని, నిన్ను ఇద్దరినీ బ్లాక్ చేశా.."
సినిమా ఇండస్ట్రీలో నెపోటిజం, సిఫార్సుల గురించి తరచుగా చర్చ జరుగుతూనే ఉంటుంది. తాజాగా బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్, ఇండియన్ ఐడల్ జడ్జి విశాల్ దద్లానీ (Vishal Dadlani) దీనిపై ఘాటుగా స్పందించాడు. సోమవారం (ఫిబ్రవరి 9) తన ఇన్స్టాగ్రామ్లో ఒక పోస్ట్ పెడుతూ.. పని కోసం రాజకీయ నాయకులను వాడేవారిని తాను సహించనని తేల్చిచెప్పాడు.
కొత్తగా వచ్చే సింగర్లకు సలహా ఇస్తూ విశాల్ ఇలా రాసుకొచ్చాడు. "ఎవరో ఒక మంత్రి గారితోనో, వారి సెక్రటరీతోనో నాకు ఫోన్ చేయించకండి. అలా చేస్తే మీరు నన్ను ఎప్పటికీ కలవలేరు. 'కాంటాక్ట్స్' ద్వారా పైకి రావాలనుకునే వారిపై నాకు అసలు గౌరవం ఉండదు. ఇప్పుడే ఒకరు అలా ప్రయత్నించారు.. ఆ మంత్రి గారిని, ఆ సింగర్ని ఇద్దరినీ బ్లాక్ చేసేశాను. మీరు ఎంత గొప్ప సింగర్ అయినా సరే.. ఇలాంటి సిఫార్సులతో వస్తే మాత్రం నేను మీతో పనిచేయను" అని స్పష్టం చేశాడు.
టాలెంట్ ఉంటే చాలు..
రాజకీయ పలుకుబడిని ఉపయోగించడం అంటే.. మీ టాలెంట్పై మీకే నమ్మకం లేనట్లు అని విశాల్ అభిప్రాయపడ్డాడు. "దయచేసి మీ ప్రతిభను నమ్ముకోండి. కష్టపడండి, ఓపికగా ఉండండి. మీరు మంచి సింగర్ అయితే మీ టైం కచ్చితంగా వస్తుంది. సిఫార్సుల పద్ధతి చాలా బోర్ కొట్టేస్తుంది. అది మీలో ఆత్మవిశ్వాసం లేకపోవడాన్ని చూపిస్తుంది" అని విశాల్ అన్నాడు.
విశాల్ ఇటీవలి సినిమాలు
విశాల్ దద్లానీ ప్రస్తుతం సోనీ టీవీలో ప్రసారమవుతున్న 'ఇండియన్ ఐడల్ సీజన్ 16' (Indian Idol Season 16)కు శ్రేయా ఘోషల్, బాద్షాలతో కలిసి జడ్జిగా వ్యవహరిస్తున్నాడు. అలాగే ఇటీవల 'హనుమాన్కైండ్' (Hanumankind) అనే రాపర్తో కలిసి 'టేస్ట్ ది థండర్' అనే పాటను రూపొందించాడు.
తెలుగులోనూ విశాల్ తనదైన ముద్ర వేశాడు. ఈమధ్యే చిరంజీవి నటించిన 'మన శంకర వరప్రసాద్ గారు' సినిమాలోని 'మెగా విక్టరీ మాస్ సాంగ్', పవన్ కళ్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'లోని 'దేఖ్లేంగే సాలా' పాటలను అతడే పాడటం విశేషం.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్డేట్స్ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


