సాయి పల్లవి ఫోన్ కాల్ నా జీవితాన్ని మార్చేసింది.. మందు మానేశాను.. నన్ను నేను నిరూపించుకున్నాను: మ్యూజిక్ డైరెక్టర్

సాయి పల్లవితో మాట్లాడిన తర్వాత తన జీవితం ఎలా మారిపోయిందో చెప్పాడు మ్యూజిక్ డైరెక్టర్ సురేష్ బొబ్బిలి. విరాట పర్వం మూవీ నుంచి మొదట తనను తొలగించినా.. తర్వాత ఎలా తిరిగి వచ్చానో, ఆ తర్వాత మందు మానేసి ఎలా తనను తాను నిరూపించుకున్నానో అతడు చెప్పాడు.

Published on: Dec 03, 2025 4:26 PM IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

'విరాట పర్వం', 'నీదీ నాదీ ఒకే కథ', ఇటీవల వచ్చిన '90s' వెబ్ సిరీస్ వంటి అద్భుతమైన ప్రాజెక్టులతో గుర్తింపు తెచ్చుకున్న సంగీత దర్శకుడు సురేష్ బొబ్బిలి. అయితే అతడు తన కెరీర్‌లో ఒక దశలో మందుకు బానిసై తీవ్రంగా పోరాడాడన్న విషయం చాలా కొద్దిమందికే తెలుసు. ఇటీవల 'గుల్టే' (Gulte)కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సురేష్ దీనిపై తన పోరాటం గురించి బహిరంగంగా మాట్లాడాడు. నటి సాయి పల్లవి నుంచి వచ్చిన ఒకే ఒక్క ఫోన్ కాల్, తాను మందు మానేయడానికి ఎలా ప్రేరణనిచ్చిందో వివరించాడు.

సాయి పల్లవి ఫోన్ కాల్ నా జీవితాన్ని మార్చేసింది.. మందు మానేశాను.. నన్ను నేను నిరూపించుకున్నాను: మ్యూజిక్ డైరెక్టర్
సాయి పల్లవి ఫోన్ కాల్ నా జీవితాన్ని మార్చేసింది.. మందు మానేశాను.. నన్ను నేను నిరూపించుకున్నాను: మ్యూజిక్ డైరెక్టర్

సాయి పల్లవి వల్లే సురేష్‌ జీవితంలో మలుపు

వేణు ఊడుగుల దర్శకత్వంలో రానా దగ్గుబాటి, సాయి పల్లవి నటించిన 'విరాట పర్వం' (2022) సినిమా సమయంలో సురేష్‌ను ప్రాజెక్ట్ నుంచి తప్పించారు. అయితే తిరిగి అతన్నే తీసుకోవాలని సాయి పల్లవి పట్టుబట్టిందట. "సాయి పల్లవి గారు నన్ను ఎంతగానో నమ్మారు. నా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ బాగుందని, దాన్నే వాడాలని ఆమె గట్టిగా చెప్పారు" అని సురేష్ తెలిపాడు.

సినిమా ఫైనల్ స్కోర్ పూర్తి చేసిన తర్వాత సాయి పల్లవి నుంచి తనకు ఫోన్ వచ్చిందని సురేష్ గుర్తు చేసుకున్నాడు. అప్పుడు ఆమె ఏమన్నదో అతడు వివరించాడు. "సినిమా విడుదలయ్యాక అందరికంటే ముందు మంచి పేరు తెచ్చుకునేది మీరేనని ఆమె చెప్పారు. నేను అద్భుతంగా పనిచేశానని, ఇకపై పనిపైనే దృష్టి పెట్టాలని, మిగిలినవన్నీ వదిలేయాలని ఆమె సూచించారు. అప్పటికే ఆమె పెద్ద స్టార్. అలాంటి వ్యక్తి నాలో ప్రతిభను గుర్తించడం నాకు ఎంతో ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చింది. నేను ఎక్కడి నుంచి వచ్చాను, ఈ పరిశ్రమకు ఎందుకు వచ్చాను అనేది నాకు గుర్తుచేసింది" అని సురేష్ అన్నాడు.

నరకం చూశాను.. కానీ గెలిచాను

ఆ క్షణంలో తనకు వచ్చిన అవకాశాలు, తన ప్రతిభ ఎంత విలువైనవో తాను గుర్తించినట్లు సురేష్ చెప్పాడు. తాను తప్పుడు మార్గంలో వెళ్తున్నానని గ్రహించి, సినిమా విడుదలైన తర్వాత మద్యం మానేశాడు. ఆ తర్వాత మూడు నెలల పాటు విత్‌డ్రావల్ సింప్టమ్స్ వల్ల "నరకం చూశాను" అని అతడు తెలిపాడు. అయితే ఆ కష్టాన్ని అధిగమించి, గత మూడేళ్లుగా తాను మద్యానికి పూర్తిగా దూరంగా ఉన్నట్లు సురేష్ తెలిపాడు.

సాయి పల్లవి కెరీర్ ఇలా..

సాయి పల్లవి చివరగా నాగ చైతన్యతో కలిసి 'తండేల్' చిత్రంలో నటించింది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ. 100 కోట్లకు పైగా వసూలు చేసింది. 2024లో శివకార్తికేయన్‌తో కలిసి 'అమరన్' చిత్రంలోనూ మెరిసింది. త్వరలో సునీల్ పాండే చిత్రంతో ఆమె బాలీవుడ్‌లో అడుగుపెట్టనుంది. ఇందులో ఆమిర్ ఖాన్ కుమారుడు జునైద్ ఖాన్ సహనటుడు. అలాగే నితేష్ తివారీ ప్రతిష్టాత్మక ‘రామాయణం’లో ఆమె సీత పాత్రను పోషిస్తోంది. ఇందులో రణబీర్ కపూర్ రాముడిగా, యష్ రావణుడిగా కనిపించనున్నారు.

News/Entertainment/సాయి పల్లవి ఫోన్ కాల్ నా జీవితాన్ని మార్చేసింది.. మందు మానేశాను.. నన్ను నేను నిరూపించుకున్నాను: మ్యూజిక్ డైరెక్టర్
News/Entertainment/సాయి పల్లవి ఫోన్ కాల్ నా జీవితాన్ని మార్చేసింది.. మందు మానేశాను.. నన్ను నేను నిరూపించుకున్నాను: మ్యూజిక్ డైరెక్టర్