నన్ను రక్షించడానికి భర్త కూడా లేడు.. నేను నా హక్కుల కోసం పోరాడటం లేదు: రేణు దేశాయ్ పోస్ట్ వైరల్
రేణు దేశాయ్ ఓ ఎమోషనల్ పోస్ట్ చేసింది. వీధి కుక్కల సమస్యపై ఆమె హైదరాబాద్లో నిర్వహించిన ప్రెస్ మీట్ గందరగోళమవడం, ఓ వ్యక్తిపై ఆమె విరుచుకుపడిన తర్వాత ట్రోలింగ్ జరుగుతోంది. ఈ నేపథ్యంలో తనను రక్షించడానికి ఎవరూ లేరంటూ ఆమె ఓ పోస్ట్ చేసింది.
వీధి కుక్కల సమస్యపై అవగాహన కల్పించే క్రమంలో నటి, సామాజిక కార్యకర్త రేణు దేశాయ్ (Renu Desai) తీవ్రమైన విమర్శలను, ట్రోలింగ్ను ఎదుర్కొంటోంది. సోమవారం (జనవరి 19) హైదరాబాద్లో జరిగిన ప్రెస్ మీట్లో ఆమె ఆగ్రహం వ్యక్తం చేయడం, ఆ తర్వాత తన మాజీ భర్త పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), పిల్లలను ఉద్దేశించి నెటిజన్లు చేసిన కామెంట్స్ ఆమెను తీవ్రంగా బాధించాయి. ఈ నేపథ్యంలో మంగళవారం (జనవరి 20) రేణు దేశాయ్ ఇన్స్టాగ్రామ్లో ఒక భావోద్వేగభరితమైన పోస్ట్ చేసింది.

నాకు ఎవరూ లేరు..
వారణాసి గంగా నదిలో పడవపై ప్రయాణిస్తున్న వీడియోను షేర్ చేస్తూ రేణు దేశాయ్ ఒక నోట్ రాసింది. "నన్ను రక్షించడానికి నాకు తండ్రి లేరు, తల్లి లేదు, అన్నయ్య లేడు, భర్త కూడా లేరు. నేను చేయని తప్పుకు నాపై ఇంత విషం చిమ్ముతున్నారు. నా బాధను, కన్నీళ్లను ఆ దేవికి, మహాదేవుడికి మాత్రమే చెప్పుకుంటాను. వారే నా బాధను వింటారు, నా కన్నీళ్లను చూస్తారు" అని రాసుకొచ్చింది.
మీ ఇష్టం వచ్చినట్టు తిట్టుకోండి.. కానీ..
కొన్ని దూకుడుగా ఉండే కుక్కల తప్పుకు, అమాయకపు కుక్కలన్నింటినీ చంపేయడం తప్పు అని.. ఈ విషయం అందరికీ అర్థమయ్యే వరకు తాను పోరాడుతూనే ఉంటానని రేణు స్పష్టం చేసింది.
"నా వ్యక్తిగత హక్కుల కోసం నేనెప్పుడూ బహిరంగంగా పోరాడలేదు. కానీ మూగజీవాల కోసం గట్టిగా మాట్లాడుతాను. నా గురించి మీరు ఎంత నెగెటివ్, అసహ్యకరమైన కామెంట్స్ అయినా చేసుకోండి.. కానీ నా కన్నీళ్లు ఎవరి సమక్షంలో (దేవుడి ముందు) కారుస్తున్నానో గుర్తుపెట్టుకోండి" అని హెచ్చరించింది.
అసలేం జరిగింది?
సోమవారం (జనవరి 19) ప్రెస్ క్లబ్లో జరిగిన సమావేశంలో ఒక వ్యక్తి తనపై దాడికి రావడంతో రేణు దేశాయ్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు ఆమెను టార్గెట్ చేశారు. "అందుకే పవన్ కళ్యాణ్ నిన్ను వదిలేశారు", "నీ పిల్లలు కుక్క కాటుతో చనిపోతే అప్పుడు బుద్ధి వస్తుంది" అంటూ దారుణమైన కామెంట్స్ చేశారు.
దీనిపై రేణు నిన్ననే కన్నీటితో వీడియో విడుదల చేసిన సంగతి తెలిసిందే. తాను మనుషుల ప్రాణాల గురించే మాట్లాడుతున్నానని, అలాగని అన్ని కుక్కలను చంపేయడం పరిష్కారం కాదని ఆమె వాదిస్తోంది. ఈ ప్రెస్ మీట్ లో రేణు సహనం కోల్పోయి మాట్లాడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. మరో నటి, యాంకర్ రష్మి గౌతమ్ తో కలిసి రేణు ఈ ప్రెస్ మీట్ చేసింది.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్డేట్స్ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


